అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలి
రైతాంగ ఉద్యమాల బలోపేతంకై 7,8తేదీలలో జాతీయ సమావేశాలు
ఏఐకేఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దారపు రమేష్
నర్సంపేట,నేటిధాత్రి:
ఇటీవల కురిసిన అకాల వర్షాలతో పంటలు కోల్పోయిన రైతులకు ఎకరానికి 50 వేల రూపాయల పరిహారం అందించి ప్రభుత్వం ఆదుకోవాలని ఏఐకేఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దారపు రమేష్ డిమాండ్ చేశారు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ప్రభుత్వాలు తక్షణమే స్పందించకపోవడం సిగ్గుచేటు అన్నారు.శనివారం స్థానిక నర్సంపేట ఓంకార్ భవన్ లో జరిగిన అఖిల భారత రైతు సమాఖ్య (ఏఐకేఎఫ్) సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన పెద్దారపు రమేష్ మాట్లాడుతూ అప్పులు తెచ్చి పెట్టుబడి పెట్టి ఆరుగాలం కష్టపడి పంటలు పండిస్తే తీరా చేతికి పంటలు వచ్చే దశలో అకాల వర్షాలు రైతన్నలకు తీరని నష్టాన్ని చేకూర్చాయని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా మొక్కజొన్న, వరి, మిర్చి,మామిడి, అరటి తదితర పంటలు నేలమట్టమై 10 లక్షల ఎకరాలలో తీవ్రమైన నష్టం వాటిల్లిందని దాంతో అన్నదాతలు ఆందోళనలో ఉన్నారని పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితులలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే స్పందించి నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకునేందుకు క్షేత్రస్థాయిలో పంట చేనులను పరిశీలించి బాధిత రైతాంగానికి భరోసా కల్పించి ఎకరాకు కనీసం 50వేల రూపాయల పరిహారాన్ని అందించాలని డిమాండ్ చేశారు. అలాగే మొక్కజొన్నలను వరి ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలను తక్షణమే ఏర్పాటు చేసి కుంటి సాకులు లేకుండా భేషరత్తుగా కొనుగోలు చేయాలని కోరారు. ఈ క్రమంలో రైతు సంఘం కార్యకర్తలు ఎక్కడికి అక్కడ రైతులకు అండగా కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు.
ఈనెల 7 8 తేదీల్లో జలంధర్ లో ఏఐకేఎఫ్ జాతీయ సమావేశాలు
జాతీయస్థాయిలో రైతాంగ ఉద్యమాలను మరింత బలోపేతం చేయడానికి అఖిలభారత రైతు సమాఖ్య (ఏఐకేఎఫ్) జాతీయ సమావేశాలు ఈనెల 7 8 తేదీలలో పంజాబ్ రాష్ట్రంలోని జలంధర్ లో జరగనున్నాయని పేర్కొన్నారు.
ఈ సమావేశాలకు తెలంగాణ రాష్ట్రం నుంచి ఏఐకేఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పెద్దారపు రమేష్, రాష్ట్ర గౌరవాధ్యక్షులు వల్లెపు ఉపేందర్ రెడ్డి, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వరికుప్పల వెంకన్న, గిరిజన రైతు సంఘం రాష్ట్ర కన్వీనర్ వి తుకారాం నాయక్ హాజరవుతారని తెలిపారు.