రేషన్ షాపుల ద్వారా నిత్యవసర వస్తువులను సరఫరా చేయాలి

ఏఐఎఫ్డిడబ్ల్యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వంగల రాగసుధ

నర్సంపేట తహసిల్దార్ కార్యాలయం వద్ద మహిళల ఆందోళన

నర్సంపేట,నేటిధాత్రి:

రాష్ట్ర ప్రభుత్వం గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేసి రేషన్ షాపుల ద్వారా 14 రకాల నిత్యావసర వస్తువులను చౌక ధరలకు అందించాలని సంక్రాంతి పండుగకు సన్న బియ్యం సరఫరా చేయాలని ఏఐఎఫ్డిడబ్ల్యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వంగల రాగసుధ డిమాండ్ చేశారు.
మంగళవారం అఖిలభారత ప్రజాతంత్ర మహిళా సమాఖ్య రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఎన్నికల్లో మహిళలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ నర్సంపేట తహసిల్దార్ కార్యాలయం వద్ద ఆందోళన నిర్వహించి తహసిల్దార్ కు మెమోరాండం ఇచ్చారు.ఈ సందర్భంగా రాగసుధ మాట్లాడుతూ గత ఎన్నికల ముందు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో ఆశాజనకమైన హామీలు ఇచ్చి అధికారంలోకి కి వచ్చాక సకాలంలో అమలు చేయకుండా మోసం చేస్తున్నారని,ఈ క్రమంలో పెరిగిన నిత్యవసర వస్తువుల ధరలతో పేద,మధ్యతరగతి ప్రజానీకం కనీస అవసరాలు తీర్చుకోలేక అనేక అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా మహిళలకు నెలకు 2500 రూపాయలు ఇస్తామని, ధరలు నియంత్రిస్తామని, నిత్యవసర వస్తువులను చౌక ధరలకు రేషన్ షాపుల ద్వారా అందిస్తామని, సన్న బియ్యం తక్షణమే అమలు చేస్తామని చెప్పి కాలయాపన చేయడం సమంజసం కాదన్నారు. ఇప్పటికైనా తక్షణమే ఇచ్చిన హామీలను అమలు చేసి చిత్తశుద్ధి నిరూపించుకోవాలని కోరారు. లేనిపక్షంలో మహిళలను సమీకరించి అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సమైక్య ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు నిర్వహిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో ఏఐఎఫ్డి డబ్ల్యు జిల్లా కమిటీ సభ్యురాలు చొప్పరి పద్మ,మైదం పద్మ, నాయకురాళ్ళు గనిపాక బిందు, విజయ, సమ్మక్క, లక్ష్మీ,పుష్ప, జయ,లక్ష్మి, పిట్టల పద్మ, విమల తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!