*27న ప్రవాసీలకు ప్రత్యేక కౌంటర్ ప్రారంభోత్సవం*
*”నేటిధాత్రి”..హైదరాబాద్*
హైదరాబాద్ బేగంపేట లోని మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రజాభవన్ లో ఈనెల 27న శుక్రవారం ఉదయం 10 గంటలకు గల్ఫ్ కార్మికులు, ఎన్నారైల కోసం ‘ప్రవాసీ ప్రజావాణి’ ప్రత్యేక కౌంటర్ ను బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభిస్తారని టీపీసీసీ ఎన్నారై సెల్ చైర్మన్, అంబాసిడర్ డా. బిఎం వినోద్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు.
ప్రభుత్వం ప్రతి మంగళ, శుక్ర వారాలలో నిర్వహిస్తున్న ప్రజావాణి ఫిర్యాదుల స్వీకరణ, పరిష్కార వ్యవస్థలోనే ప్రవాసుల కోసం ఒక ప్రత్యేక కౌంటర్ ను ఏర్పాటు చేశారు. గల్ఫ్ దేశాల్లో పనిచేస్తున్న తెలంగాణ కార్మికుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన జీఓ ప్రకారం ‘ప్రవాసీ ప్రజావాణి’ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.
ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సమన్వయంతో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీల సమక్షంలో ‘ప్రవాసీ ప్రజావాణి’ కేంద్రం ప్రారంభోత్సవానికి సన్నాహాలు చేస్తున్నామని వినోద్ కుమార్ తెలిపారు. ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు జి. చిన్నారెడ్డి, ప్రజావాణి నోడల్ అధికారి దివ్యా దేవరాజన్, టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ బి. మహేష్ కుమార్ గౌడ్, ఎమ్మెల్సీ టి. జీవన్ రెడ్డి, పలువురు ప్రజా ప్రతినిధులు, గల్ఫ్ కార్మిక కుటుంబాలు, గల్ఫ్ సంఘాల నాయకులు పాల్గొనే ఈ కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులేనని టీపీసీసీ ఎన్నారై సెల్ కన్వీనర్ మంద భీంరెడ్డి తెలిపారు.