న్యూఢిల్లీ, డిసెంబర్, 23:
టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీని ఉభయ సభల్లో బీఆర్ఎస్ పార్టీగా మార్చాలని ఆ పార్టీ ఎంపీలు ఆయా సభాపతులను కలిసి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు శుక్రవారం టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు, లోక్సభాపక్ష నేత నామా నాగేశ్వరరావు నేతృత్వంలో పలువురు ఎంపీలు రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ ఖడ్,
లోక్సభ స్పీకర్ ఓం బిర్లా లను వారి చాంబర్లో వేర్వేరుగా కలిసారు. టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ గా మారిన తీరును వారికి వివరించారు.
ఈ సందర్భంగా పార్లమెంటులో పార్టీ పేరు మార్చాలని కోరుతూ ఆ పార్టీ అధినేత కేసీఆర్ సంతకంతో కూడిన లేఖలను వారికి అందజేశారు. సభాపతులను కలిసిన వారిలో టీఆర్ఎస్ ఎంపీలు జోగినపల్లి సంతోష్ కుమార్, వద్దిరాజు రవిచంద్ర, కే ఆర్ సురేష్ రెడ్డి, బీబీ పాటిల్ తదితరులు ఉన్నారు.