ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం: అధికారులతో కలిసి మాజీ కార్పొరేటర్ పర్యటన
మియాపూర్ డివిజన్ కాలనీల్లో డ్రైనేజీ సమస్యల క్షేత్రస్థాయి పరిశీలన
శేరిలింగంపల్లి, నేటి ధాత్రి :-
మియాపూర్ డివిజన్ పరిధిలోని పలు కాలనీల్లో నెలకొన్న మౌలిక వసతుల సమస్యల పరిష్కారానికి మాజీ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ చొరవ చూపారు. గురువారం న్యూ కాలనీ మరియు శ్రీరంగాపురం కాలనీల్లో అధికారులతో కలిసి ఆయన విస్తృతంగా పర్యటించారు.న్యూ కాలనీలో నూతనంగా చేపట్టబోయే డ్రైనేజీ లైన్ల నిర్మాణ ప్రాంతాలను, అలాగే శ్రీరంగాపురం కాలనీలో ప్రస్తుతం తలెత్తిన డ్రైనేజీ సమస్యను జలమండలి డిజిఎం నారాయణ, సిఎంసి ఇంజనీరింగ్ విభాగం అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. కాలనీవాసుల కష్టాలను స్వయంగా అడిగి తెలుసుకున్న ఆయన, సమస్యల తీవ్రతను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.ఈ సందర్భంగా ఉప్పలపాటి శ్రీకాంత్ మాట్లాడుతూ.. పీఏసీ ఛైర్మన్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ సహకారంతో మియాపూర్ డివిజన్లో డ్రైనేజీ, మంచినీటి సమస్యలను విడతల వారీగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ప్రతి కాలనీలో మౌలిక వసతులు మెరుగుపరిచి, ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పిస్తామని తెలిపారు. డివిజన్ ప్రజలకు తాను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని, ఎలాంటి సమస్యలు ఉన్నా నేరుగా తన దృష్టికి తీసుకురావాలని ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో సిఎంసి ఇంజనీరింగ్ విభాగం ఏఈ ప్రశాంత్, వర్క్ ఇన్స్పెక్టర్లు జగదీష్, లింగయ్యలతో పాటు స్థానిక నాయకులు వెంకటేష్ గౌడ్, తిమ్మరాజు, నరేష్, శంకర్ నాయక్, జ్యోతి, లక్ష్మి మరియు కాలనీ వాసులు పాల్గొన్నారు.
