హెల్త్ క్యూబ్ డయాగ్నస్టిక్ డివైసెస్ కిట్లు పంపిణీ
16 రకాల వైద్య పరీక్షలు ఒకేసారి నిర్వహణ
ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు
ప్రజలకు నాణ్యమైన తక్షణ వైద్య సేవలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు తెలిపారు.
గురువారం ఐడిఓసి కార్యాలయంలో వైద్యశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన
హెల్త్ క్యూబ్ డయాగ్నస్టిక్ డివైసెస్ పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ప్రజలకు త్వరితగతిన వైద్య పరీక్షలు మిర్వహణకు 50
హెల్త్ క్యూబ్ డయాగ్నస్టిక్ డివైసెస్ కిట్లు పంపిణీ చేసినట్లు తెలిపారు. ఈ కిట్ల ద్వారా 16 రకాల వైద్య పరీక్షలు నిర్వహించవచ్చని అన్నారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణకు
తక్షణ రోగ నిర్ధారణ పరీక్షలు చేసి సమయానికి చికిత్స అందించడానికి ఈ పరికరాలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
బీడీఎల్ పరిశ్రమ సిఎస్ఆర్ నిధుల ద్వారా ఈ కిట్లు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. అలాగే సిఎస్ఆర్ నిధులతో ప్రధాన ఆసుపత్రిలో వెంటిలేటర్లు, ఎంఆర్ఐ, సిటీ స్కాన్, సాంకేతిక నిపుణులు ఏర్పాటు వంటి ఆధునిక యంత్రాలను ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఆసుపత్రి అభివృద్ధి కోసం 203 పోస్టులను మంజూరు చేయించగా, రూ.14 కోట్ల వ్యయంతో ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిని 200 పడకల ఆసుపత్రిగా అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు.
పల్లె దవాఖానాల ఏర్పాటుతో గ్రామీణ ప్రాంత ప్రజలకు వైద్య సేవలు మరింత చేరువవుతాయని, అసంపూర్తి భవనాలను త్వరితగతిన పూర్తి చేస్తామని ఆయన తెలిపారు. సిఎస్ఆర్, డిఎంఎఫ్టిఎస్డిఎఫ్ నిధులను వైద్య రంగ అభివృద్ధికి వినియోగిస్తున్నట్లు తెలిపారు. ప్రజలు ఆరోగ్యంగా ఉండేలా వైద్యాధికారులు సిబ్బంది కృషి చేసి మంచి పేరు తెచ్చుకోవాలని ఆయన సూచించారు.
జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ, జిల్లాలోని ప్రతి సబ్ సెంటర్లో వైద్య పరీక్షలు నిర్వహించేందుకు ఈ పరికరాలు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. ఈ కిట్ల ద్వారా 16 రకాల వైద్య పరీక్షలను అక్కడికక్కడే నిర్వహించవచ్చని అన్నారు. గతంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుండి పరీక్షల కోసం నమూనాలను జిల్లా కేంద్రంలోని టి హబ్ కు పంపించాల్సి వచ్చేదని, ఇప్పుడు అక్కడే పరీక్షలు చేసి వెంటనే చికిత్స అందించే అవకాశం ఏర్పడిందని పేర్కొన్నారు.
ప్రజలు తమ ఆరోగ్యంపై శ్రద్ధ వహించి, సమయానికి వైద్య పరీక్షలు చేయించుకోవాలని ఆయన సూచించారు.
ఈ కార్యక్రమంలో
జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ మధుసూదన్, మున్సిపల్ చైర్మన్ బుర్ర కొమరయ్య, మున్సిపల్ కమిషనర్ ఉదయ్ కుమార్, ప్రోగ్రాం అధికారి శ్రీదేవి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యులు, ఏ ఎన్ ఎం లు, ఎం ఎల్ హెచ్ పి లు తదితరులు పాల్గొన్నారు.
