Delay in Kathanpalli Municipal Chairman Election
క్యాతన్ పల్లి ఓటర్ల (ప్రజల) తీర్పు తప్పా..?
ఛైర్మెన్, వైస్ చైర్మన్ ఎన్నిక జరిపించండి మహా ప్రభో..?
రాజకీయ కొట్లాటలతో అభివృద్ధి కుంటు పడనుందా…?
అధికార పార్టీ,ప్రతిపక్ష పార్టీ ల గొడవల వల్ల నష్ట పోయేదెవరు..?
రామకృష్ణాపూర్, నేటిధాత్రి:
తెలంగాణ రాష్ట్రంలో మున్సిపాలిటీ ఎన్నికలు జరిగిన సందర్భంగానే క్యాతన్ పల్లి మున్సిపాలిటీ ఎన్నికలు సైతం జరిగాయి. కానీ ఇక్కడి మున్సిపాలిటీ ఓటర్ల (ప్రజల) అదృష్టమో..?దురదృష్టమో..? కానీ ఇక్కడి ఛైర్మెన్, వైస్ చైర్మన్ ఎన్నిక ఆగిపోయింది.రాష్ట్రమంతా కమ్యూనిస్టులతో కలిసి పోటీ చేసిన అధికార కాంగ్రెస్ పార్టీ క్యాతన్ పల్లి లో మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరించడంతో అధికార కాంగ్రెస్ పార్టీకి 22 వార్డుల్లో కేవలం ఏడు సీట్లు మాత్రమే వచ్చాయి. బిఆర్ఎస్ పార్టీ, సిపిఐ పార్టీ కలిసి పోటీ చేయగా 14 సీట్లు కైవసం చేసుకున్నాయి. ఇక చైర్మెన్ పీఠం బిఆర్ఎస్ పార్టీకి వైస్ చైర్మన్ పీఠం సిపిఐ పార్టీకి దక్కినట్లే అని అంతా అనుకున్న సమయంలో హఠాత్తుగా ఊహించని పరిణామాలు ఎదురయ్యి చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక వాయిదా పడింది.సరిగ్గా నెల రోజుల క్రితం అనగా ఫిబ్రవరి 17 న కౌన్సిలర్ల ప్రమాణస్వీకారం మాత్రం జరిగింది, కానీ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్ని వాయిదా పడడంతో మునిసిపాలిటీ లో సీనంతా రివర్స్ అయ్యింది. అధికార , ప్రతి పక్ష పార్టీల గొడవల వల్ల సామాన్య ప్రజలే నష్టపోతున్నారు. మంత్రి, ఎమ్మెల్యే స్థాయి నాయకులు మంచిగానే ఉన్నారు,ఉంటారు కానీ కిందిస్థాయి నాయకులు, కార్యకర్తలు భలవుతారని గ్రహించాలి. రాజకీయ విషయాలను వ్యక్తిగత విషయాలుగా చూసుకోకూడదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మున్సిపాలిటీ ఎన్నిక విషయంలో బిఆర్ఎస్, సీపీఐ పార్టీలు హైకోర్టులో కేసు వేయగా మూడు వారాల్లో చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక నిర్వహించాలని తీర్పు వెలువరించింది. తీర్పు వచ్చి వారమయ్యింది.చూడాలి మరి.
క్యాతన్ పల్లి ప్రజల తీర్పు తప్పా….?
క్యాతన్ పల్లి మున్సిపాలిటీ లోని 22 వార్డుల్లో సుమారు 29 వేల ఓటర్లు ఉండగా మున్సిపాలిటీ ఎన్నికల్లో తమ తీర్పును స్పష్టంగా ఇచ్చినప్పటికీ మున్సిపాలిటీ ఎన్నిక జరగకపోవడంతో ప్రజలు ఒకింత అసహనానికి గురవుతున్నారు. మేము వేసిన ఓట్లకు విలువే లేదా అంటూ ప్రశ్నిస్తున్నారు.? ఓటర్లుగా మా తీర్పు తప్పేమో అనే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఇప్పటికైనా ఛైర్మెన్ వైస్ చైర్మన్ ఎన్నిక సజావుగా నిర్వహించండి మహా ప్రభో అని సంబంధిత అధికారులను ప్రజలు కోరుతున్నారు.
రాజకీయ కొట్లాటలతో అభివృద్ధి కుంటు పడనుందా…?
మున్సిపాలిటీలో రాజకీయ కొట్లాటలతో అభివృద్ధి కుంటు పడనుందా…? అంటే అవుననే సమాధానం స్పష్టంగా కనబడుతోంది. రాష్ట్రంలోని అన్ని మునిసిపాలిటీలలో పాలకవర్గం ఏర్పడి నెల రోజులు గడుస్తోంది. అన్ని ఏరియాలలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి కానీ క్యాతన్ పల్లి మునిసిపాలిటీలో అభివృద్ధి పనులు జరగడం లేదు. అందుకు కారణం పాలకవర్గం ఎన్నిక కాకపోవడమే కారణమని ప్రజలు బాహాటంగానే విమర్శిస్తున్నారు. రాజకీయపరంగా గొడవలు ఉంటే మీరు చూసుకోవాలి కానీ అభివృద్ధిని ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రజలు అసహనానికి గురవుతున్నారు. పరిపాలన సజావుగా చేస్తారని ఓట్లు వేశామే కానీ ఇలా రాజకీయాలు చేస్తూ అభివృద్ధిని మరుస్తారని ఓట్లు వేయలేదని ప్రజలు విమర్శిస్తున్నారు. మీ రాజకీయ పార్టీల తగాదాల వల్ల ప్రజలమీ నష్టపోతున్నామని వాపోతున్నారు. ఇప్పటికైనా ఎన్నిక సజావుగా నిర్వహించి పరిపాలన కొనసాగించేల చొరవ తీసుకోవాలని,లేనిచో రానున్న రోజుల్లో ప్రజాక్షేత్రంలో తగిన బుద్ధి చెప్తామని ప్రజలు హెచ్చరిస్తున్నారు.
