MCP(U) Urges Voters to Reject Bribery in Municipal Polls
దోచుకోవడానికే ఎన్నికల్లో ప్రలోభాలు
రాజకీయ విలువల స్థాపనకై మున్సిపల్ ఎన్నికల్లో ఎంసిపిఐ(యు) పోటీ
ఎంసిపిఐ (యు) జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్
నర్సంపేట,నేటిధాత్రి:
ఎన్నికల్లో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక విస్మరించిన పార్టీలను మునిసిపల్ ఎన్నికల్లో ఓడించి బుద్ధి చెప్పాలని ఎంసిపిఐ(యు) జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్ పిలుపునిచ్చారు.స్థానికంగా ఉన్న ప్రజా అవసరాలను,ప్రభుత్వ స్థలాలను దోచుకోవడానికే ఎన్నికల్లో ప్రలోభాలు చేస్తున్నారని ఆరోపించారు.ప్రజా సమస్యల పరిష్కారానికి రాజకీయ విలువలను కాపాడడానికి ఎంసిపిఐ(యు) బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని కోరారు.
నర్సంపేట మున్సిపల్ పరిధిలోని మాదన్నపేట ఎంసిపిఐ (యు) ముఖ్య కార్యకర్తల సమావేశం గ్రామ కార్యదర్శి అనుమాల రమేష్ అధ్యక్షతన జరిగింది.పెద్దారపు రమేష్ మాట్లాడుతూ పట్టణ ప్రజా సమస్యలను విస్మరించిన ప్రభుత్వ యంత్రాంగం మాదన్నపేట, మహేశ్వరం ,రాజపల్లె నాగూర్లపల్లె పర్ష నాయక్ తండా తదితర గ్రామాలను మున్సిపాలిటీలో విలీనం చేసి ఆయా గ్రామాల అభివృద్ధిని నీరుగార్చారని,ఈ నేపథ్యంలో గ్రామీణ ఉపాధి హామీ పథకం లేకుండా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపాలిటీ పరిధిలో జనాభా పెరుగుతుండగా కనీస సౌకర్యాలు ఉపాధి తగ్గిపోతున్నాయని కానీ ఎన్నికలు రాగానే పాలక పార్టీలు విపరీతంగా డబ్బు,మద్యం ఇతర ప్రలోభాలతో గెలిచి మరింత దోచుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.ఐతే పట్టణ ఓటర్లు ప్రజలు అప్రమత్తం కావాలని లేకపోతే అనేక ఇబ్బందులకు గురవుతామని అన్నారు. ఈ మున్సిపల్ ఎన్నికల్లో ఎంసిపిఐ(యు) కలిసి వచ్చే వామపక్ష కమ్యూనిస్టు పార్టీలను సామాజిక శక్తులను కలుపుకొని పోటీ చేస్తుందని, ఓట్లు సీట్లు అధికారం లక్ష్యం కాకుండా రాజకీయ విలువలు, ప్రజా సమస్యల పరిష్కారానికి ఎన్నికలను ఉపయోగించుకోవాలని అన్నారు.
నర్సంపేట పట్టణ సమగ్రాభివృద్ధికి పాటుపడాలంటే చిత్తశుద్ధి కలిగిన ఎంసిపిఐ(యు) బలపరిచిన అభ్యర్థులను ఆదరించి గెలిపించాలని ఆ దిశలో కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు.ఈ సమావేశంలో పార్టీ డివిజన్ సహాయ కార్యదర్శి కొత్తకొండ రాజమౌళి, జిల్లా కమిటీ సభ్యులు కేశెట్టి సదానందం,మాజీ సర్పంచ్ కర్నే సాంబయ్య, నాయకులు కేశెట్టి శ్రీను, గుర్రం రవి, కందికొండ సాంబయ్య, వక్కల రాజమౌళి తదితరులు పాల్గొన్నారు.
