Sell Cotton Only at CCI Centers: MLA Gandra
పత్తి పంటను సీసీఐ కేంద్రాల్లో అమ్ముకోవాలి.
ప్రైవేటు వ్యక్తులు, దళారులకు అమ్ముకొని మోసపోవద్దు
ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు
భూపాలపల్లి నేటిధాత్రి
రైతుల సంక్షేమమే సీఎం రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వ ధ్యేయమని, రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పత్తి పంటను సీసీఐ కేంద్రాల్లో అమ్ముకొని మద్దతు ధర పొందాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. ఈరోజు(గురువారం) భూపాలపల్లి మంజూరు నగర్ లోని యం ఎస్ ఆర్ కాటన్ ఇండస్ట్రీస్ లో సీసీఐ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పత్తి కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ.. సీసీఐ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పత్తి కొనుగోలు కేంద్రాన్ని రైతులు సద్వినియోగం చేసుకొని, మద్దతు ధరను పొందాలని అన్నారు. 8 నుండి 12 శాతం వరకు తేమ శాతం ఉండడం వలన రైతులు నష్టపోతున్నారని 20 శాతం తేమ ఉండే విధంగా కొనుగోలు చేయాలన్నారు. ప్రతి ఎకరాకి 7 క్వింటాళ్లు కొనుగోలు చేయాలనే నిబంధన కేంద్ర ప్రభుత్వం ఎత్తివేసి, 12 క్వింటాలు కొనుగోలు చేసేలా రైతులకు సహకరించాలన్నారు. పత్తి కొనుగోలు కేంద్రాల్లో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. కపాస్ కిసాన్ యాప్ ద్వారా రైతులు స్లాట్ బుకింగ్ చేసుకుని పత్తిని తీసుకురావాలని సూచించారు. అంతకుముందు వివిధ పంటలకు సంబంధించిన కనీస మద్దతు ధర పోస్టర్ ను ఎమ్మెల్యేలు, అధికారులు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ కిష్టయ్య
పత్తి మిల్లు ఓనర్ లింగారెడ్డి పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారులు, నాయకులు, రైతులు పాల్గొన్నారు
