India Approves 288 S-400 Missiles Deal
రష్యా నుంచి 288 ఎస్-400 క్షిపణులు.. డిఫెన్స్ ప్యానల్ పచ్చజెండా
రష్యా నుంచి 288 ఎస్-400 క్షిపణుల కొనుగోలుకు రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలో డిఫన్స్ అక్విజిషన్ కౌన్సిల్ సుమారు రూ.10,000 కోట్ల ఒప్పందానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
న్యూఢిల్లీ: భారత రక్షణ రంగ పటిష్టత దిశగా మరో కీలక ముందడుగు పడింది. రష్యా నుంచి 288 ఎస్-400 (S-400) క్షిపణుల కొనుగోలుకు రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలో డిఫన్స్ అక్విజిషన్ కౌన్సిల్ (DAC) సుమారు రూ.10,000 కోట్ల ఒప్పందానికి (AoN) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఫాస్ట్ ట్రాక్ పద్ధతిలో (FTP) జరిగే ఈ కొనుగోళ్లలో 120 స్వల్ప శ్రేణి క్షిపణలు, 168 సుదీర్ఘ శ్రేణి క్షిపణలు ఉన్నాయి. ఇప్పటికే కాంట్రాక్ట్ జరిగిన మరో రెండు ఎస్-400 వ్యవస్థలు ఈ ఏడాది జూన్, నవంబర్లో భారత్కు అందనున్నాయి
‘ఆపరేషన్ సిందూర్’ సమయంలో ఉపయోగించిన క్షిపణుల నిల్వలను పునరుద్ధరించడం, వాయి రక్షణ సామర్థ్యాన్ని పెంచుకోవడం తాజా కొనుగోళ్ల ముఖ్య ఉద్దేశంగా డిఫెన్స్ వర్గాలు తెలిపాయి. ఇదేవిధంగా చైనా, పాకిస్థాన్ సరిహద్దుల వద్ద భారత వాయు రక్షణ వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందని, 400 కిలోమీటర్ల పరిధిలో వైమానిక ముప్పును సమర్ధవంతంగా ఎస్-400 వ్యవస్థ అడ్డుకుంటుందని పేర్కొన్నాయి.పాకిస్థాన్తో గత ఏడాది తలెత్తిన ఉద్రిక్తతలు, ఆపరేషన్ సిందూర్ సమయంలో ఎస్-400 వ్యవస్థ శత్రువుల వెన్నులో చలిపుట్టించింది. 314 కిలోమీటర్ల దూరంలోని పాక్ యుద్ధ విమానాన్ని కుప్పకూల్చింది. ఆదంపూర్, భుజ్ సెక్టార్లలో ఈ వ్యవస్థను మోహరించడంతో పాక్ గత్యంతరం లేని పరిస్థితుల్లో తమ యుద్ధ విమానాలను ఆప్ఘనిస్థాన్, ఇరాన్ సరిహద్దులకు తరలించాల్సి వచ్చింది. ప్రస్తుతం కొనుగోలు చేయనున్న 400 కి.మీ, 200 కి.మీ, 150 కి.మీ, 40 కిలోమీటర్ల శ్రేణి క్షిపణులు శత్రువుల విమానాలు, డ్రోన్ దాడులను సమర్ధవంతంగా తిప్పికొట్టగలవు.
