తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు పుట్టిన రోజు సందర్భంగా గృహ నిర్మాణ శాఖ నుంచి తొలగించబడిన 51 మంది బాధితులు అనాధ పిల్లలకు పాలు, పండ్లు పంపిణీ చేశారు. ముఖ్యమంత్రి కేసిఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. కేసిఆర్ ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్ళు ఇలాంటి పుట్టిన రోజు వేడుకలు జరుపుకోవాలని మనసారా ఆకాంక్షిస్తున్నట్లు వారు తెలిపారు. కేసిఆర్ కారణజన్ముడని కొనియాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ సాధన కోసం పద్నాలుగేళ్లు నిర్విరామ పోరాటం సాగించి, తెలంగాణ సాధించి, పాలకుడిగా బంగారు తెలంగాణ నిర్మాణం చేసిన కేసిఆర్ నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా జీవించాలని ఆకాంక్షించారు. తెలంగాణ పయనిస్తున్న ప్రగతి శీల మార్గంలోనే దేశం కూడా పయనించాలని కోరుకుంటున్న కేసిఆర్ దేశ రాజకీయాలలో మార్పులు తీసుకొచ్చి, అభినవ భారత నిర్మాణం చేపట్టి, ప్రపంచంలోనే భారత్ ను శక్తి వంతమైన దేశంగా తీర్చిదిద్దాలని ఆకాంక్షించారు. తమ జీవితాలను కూడా నిలబెట్టాలని కోరుకున్నారు. తమను విధుల్లోనుంచి తొలగించి ఆరేళ్లు గడుస్తున్నాయని, మంత్రి కేటిఆర్ తమకు తప్పకుండా దారి చూపిస్తారనే నమ్మకం వుందన్నారు. తమకు ఇప్పటికే మంత్రి కేటిఆర్ మాట ఇచ్చారని, త్వరలో తమకు మంచి రోజులొస్తాయని వారు ఆశాభావం వ్యక్తం చేశారు.