బిజేపిది దివాళాకోరు రాజకీయం.

అడ్డగోలు రాజకీయాలతో, తెలంగాణ పరువు తీస్తూ, అభివృద్ధిని అడ్డుకుంటూ, నీతిమాలిన పనులు చేసుకుంటూ, విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటూ, కుట్రలు పన్నుతున్న బిజేపి వ్యవహారశైలిని తూర్పార పడుతూ నేటిధాత్రి ఎడిటర్‌ ‘‘కట్టా రాఘవేంద్రరావు’’తో ‘‘మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌’’ పంచుకున్నా ఆసక్తికర విషయాలు పాఠకుల కోసం…

`బిజేపి వ్యవహారంపై మండిపడిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు.

`అభివృద్ధి చేసే దమ్ము లేదు.

`ప్రజల మెప్పు పొందలేరు.

`బిజేపి అంటేనే అవద్దాలు..అన్యాయాలు.

`జనం ఉసురుపోసుకుంటున్నరు.

`బిజేపి కుట్రలు సాగనియ్యం

`ప్రగతి నిరోధకులకు తెలంగాణలో స్థానం లేదు.

`ప్రజా వ్యతిరేక బిజేపికి రాజకీయాలు చేసే అర్హత లేదు.

` కేంద్రంలో అధికారంలోకి వచ్చాక తెలంగాణకు ఇచ్చిందేదో చెప్పున్రి

`బిజేపి ఎంపిలు తెచ్చిన ప్రాజెక్టులేమిటో సూపెట్టున్రి

`విభజన చట్టంలో ఒక్క హామీ గూడ నెరవేర్చలేదు.

`యూపిఏ ఇచ్చిన వాటిని గూడా గుంజపోయిన్రు.

`ఏ మొఖం పెట్టుకొని రాజకీయాలు చేస్తరు.

`పిల్లల జీవితాలతో ఆడుకుంటరా?

`అధికారం కోసం అడ్డదారులు తొక్కుతరా?

`విద్యార్థుల భవిష్యత్తు అంధకారం చేస్తరా?

`బిజేపి చెప్పే ధర్మం..ఇదేనా?

`బిజేపి నాయకులకు సిగ్గు, ఎగ్గు లేదు.

`తెలంగాణ అభివృద్ధి మీద చిత్తశుద్ధి లేదు.

`బిజేపిని విద్యార్థుల తల్లిదండ్రులు ఛీ కొడుతున్నరు. 

`ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకోవాలే.

`తప్పయిందని ప్రజలకు క్షమాపణ చెప్పాలే!                               

హైదరాబాద్‌,నేటిధాత్రి:  

బిజేపి పార్టీకి, నాయకలకు అభివృద్ది అంటే ఏమిటో తెలియదు. అభివృద్ధి ఎలా చేయాలో తెలియదు. అభివృద్ధికి సహకరించాలన్న సోయి లేదు. కేంద్రంలో అధికారంలో వున్నపార్టీగా తెలంగాణ ప్రయోజనాల కోసం ఆరాపటం తెలియదు. ఎంత సేపు రాజకీయం చేయాలి. ప్రజలను రెచ్చగొట్టాలి. యువతలో లేనిపోని అనుమానాలు సృష్టించాలి. రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయాలి. గందరగోళం సృష్టించాలి. యువతను పెడదోరణలు పట్టించాలి. ఇదా రాజకీయం. బిజేపి నేర్చుకున్న దేశంకోసం, ధర్మ కోసమంటే ఇదేనా..ఇంతేనా…చదువుకునే విద్యార్ధులు జీవితాలను ఆగం చేయాలనుకోవడం రాజకీయమా? దాని ద్వారా రాజకీయ పబ్బం గడుపుకోవాలని కోవడం రాజకీయమా? మత రాజకీయాలు, మతాల మధ్య వున్న స్నేహబావాలలో చిచ్చురేపి చలికాచుకోవడమా? రాజకీయం. ఇక సాగదు. ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు. రాజకీయం ముసుగులో ప్రజలను ఇబ్బందులకు గురిచేసే దుర్మార్గపు పనులు చేస్తూపోతామంటూ ఇక ఉపేక్షించే పరిస్థితే లేదు. అడ్డగోలు రాజకీయాలతో దేశంలోనే తెలంగాణ పరువు తీస్తున్నారు. దేశమంతా తెలంగాణ వైపు చూస్తుంటే కళ్లు ముండుతున్న బిజేపి నేతలు తెలంగాణను ఆగం చేయాలన్న పన్నాగం పన్నుతున్నారు. తెలంగాణ పచ్చగా వుంటే చూడలేని బిజేపి గుజరాతీ నాయకుల పెత్తనానికి ఊడిగం చేస్తున్న రాష్ట్ర బిజేపి నేతలకు తెలంగాణ మీద కనీసం ఒక్క శాతం కూడా ప్రేమలేదు. గౌరవం లేదు. ప్రజలంటే అసలే లెక్కే లేదు. అడ్డగోలు రాజకీయాలతో తెలంగాణలో రాజకీయ అస్దిరతను సృష్టించాలని చూస్తున్నారు. అభివృద్దిని అడ్డుకుంటూ, అడుగుడునా అబద్దాల ప్రచారాలతో ప్రజలను గందరగోళంలోకి నెట్టాలని చూస్తున్నారు. కాని ప్రజలు బిజేపి నేతల మాటలు నమ్మడానికి సిద్దంగా లేరు. వారిని పట్టించుకోవడంలేదు. ముఖ్యమంత్రి కేసిఆర్‌ను, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎన్ని రకాలుగా ఇబ్బందులుపెట్టాలని చూస్తున్నా వారి పప్పులు ఉడకడవు. ఎన్ని రకాల రాజకీయ విన్యాసాలుచేయాలో అన్ని బిజేపి నేతలు చేస్తున్నారు. అయినా వారి ఆటలు సాగడంలేదు. దాంతో కుట్రలకు తెరతీశారు. ఆఖరుకు విద్యార్ధుల జీవితాలతో కూడా ఆడుకోవడానికి వెనుకాడడం లేదు. ఎంతటి నీతి బాహ్యమైన పనులైనా చేస్తామని, అధికారంలోకి రావడానికి ఎన్ని అడ్డదారులైనా తొక్కుతామని నిరూపించేందుకే పరీక్ష పత్రాల లీకులకు కూడా తెబడుతున్నారు. ఇంకా వారి చర్యలను ఉపేక్షిస్తూపోతే రాష్ట్ర ప్రయోజనాలకే ప్రమాదం. అలాంటి నేతలు సమాజానికే చిన్నతనం. అంటూ బిజేపి నేతలను తూర్పాపడుతూ, బిజేపి తెలంగాణకు చేసిన అన్యాయాలను పూసగుచ్చినట్లు వివరిస్తూ రాష్ట్ర పంచాయితీ రాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, నేటిధాత్రి ఎడిటర్‌ కట్టారాఘవేంద్రరావుతో పంచుకున్నా ఆసక్తికరమైన విషయాలు పాఠకుల కోసం ఆయన మాటల్లోనే…

తెలంగాణలో బిజేపి అనుసరిస్తున్న దుర్మార్గపు వేశాలు నిజంగానే దివాళాకోరు తనం రాజకీయాలే.

 అసలు ఇంతగా దిగజారి రాజకీయాలు చేసిన పార్టీలు ఎక్కడా వుండవు. దేశంలో ఇలాంటి తప్పుడు విధానాలు అనుసరించే అనేక రాష్ట్రాలలో దొడ్డిదారిన అధికారం చెలాయిస్తున్నారు. తెలంగానలో కూడా అదే చేద్దామని చూశారు. కాని వారి వల్ల కాలేదు. దాంతో విద్యార్ధుల జీవితాలతో కూడా ఆడుకోవడానికి సిద్ధపడ్డారు. అసలు కేంద్రంలో అధికారంలో వుంది. ప్రజలు కూడా ఓ నలుగురు ఎంపిలను ఆ పార్టీకి అందించారు. అంతగా ఆదరించినప్పుడు ప్రజల రుణం ఎలా తీర్చుకోవాలన్నది ఆలోచించాలి. ప్రజలకు ఎలా మేలు జరగాలన్నదానిపై దృష్టిపెట్టాలి. ప్రజలు ఇచ్చిన ఈ అవకాశాన్ని ఎలా వినియోగించుకోవాలన్నదానిపై ధ్యాస వుండాలి. కాని అభివృద్ధి చేసే గుణం లేదు. సోయి లేదు. ఆ ఆలోచనే లేదు. కాని రాజకీయాలు చేయాలి. అబద్దాలు చెప్పి, చెప్పి, నిజాలు కనపడకుండా చేయాలి. ఇవా చేయాల్సిన రాజకీయాలు. ప్రజలకు మేలు చేయాలి. ప్రజలకు అభివృద్దిని చూపించాలి. దేశంలోని అన్ని రాష్ట్రాలు వేరు. మన తెలంగాణ వేరు. కొత్తగా సాధించుకున్న రాష్ట్రం. సుదీర్ఘ కాలం పాటు ఉద్యమం సాగించి, పద్నాలుగేళ్లపాటు ఎన్నో ఆటుపోట్లు, వ్యయప్రయాసలకోర్చి, దేశంలోని అన్ని రాజకీయ పార్టీలను ఒప్పించి, ప్రజలను మెప్పించి, ఉద్యమంలోకి తీసుకొచ్చి, కోట్ల గొంతుకలు ఒక్కటి చేసి తెలంగాణ సాధించిన ఘనత ముఖ్యమంత్రి కేసిఆర్‌ది. అలాంటి నాయకుడి పాలనలో అలజడి సృష్టించాలిన చూస్తే, ప్రజలు క్షమించరన్న సోయి బిజేపి నేతలకు వుండొద్దా? నాలుగు సీట్లకే ఎగిరెగిరి పడుతున్నారు. కేంద్రలో అధికారంలో వున్నామని మిడిసిపడుతున్నారు. తెలంగాణలో ఈ బిజేపికి దిక్కులేదు,సక్కిలేదు. కార్యకర్తలు లేరు. నాయకులు లేరు. ఉనికి లేదు. ప్రజల మద్దతు అసలే లేదు. ప్రజలకు అభివృద్ధి చేసి చూపించాల్సిందిపోయి,కేంద్రం నుంచి నిధులు తెచ్చి, రాష్ట్రాభివృద్ధికి సహకరించాల్సిందిపోయి, తెలంగాణ ప్రగితికి మోకాలడ్డుతామంటే చూస్తూ ఊరుకుంటామా? 

  ఓ పక్క దేశంలో ధరలో ప్రజల ఉసురు పోసుకుంటున్నారు.

 తెలంగాణలో అభివృద్ధిని అడ్డుకుంటున్నారు. కొత్తగా ఏర్పాటైన తెలంగాణ మీద అడుగడుగునా విషం చిమ్ముతున్నారు. తెలంగాణకు రావాల్సిన న్యాయమైన వాటల గురించి ఇక్కడి బిజేపి నేతలు మాట్లాడరు. కేంద్ర పెద్దలతో సంప్రదించరు. తెలంగాణలో కేంద్ర జాతీయ ప్రాజెక్టు ఒక్కటీ ఇవ్వరు. పొరుగున వున్న కర్ణాకటలో అప్పర్‌ భద్రకు జాతీయ హోదా ఇచ్చారు. ఇప్పటికే కృష్ణానది మీద ఆల్మట్టి ఎత్తు పెంచుకుంటూ పోతున్నరు. పైనున్న కర్నాటక ఆల్‌మట్టి పూర్తిగా నిండితే తప్ప మనకు నీళ్లొచ్చే పరిస్దితి లేదు. తెలంగాణ రాక ముందు తెలంగాణ పరిస్దితి ఏమిటి? ఇప్పుడున్న పరిస్దితి ఏమిటి? ఇవన్నీ చూస్తూ కూడా తెలంగాణకు అన్యాయం చేయాలని చూడడం బిజేపి దిక్కుమాలిన రాజకీయాలు చేయడం కాదా? పచ్చగున్న తెలంగణను మళ్లీ ఎండబెట్టాలని చూస్తున్నారా? తెలంగాణ రైతులు బాగుపడుతుంటే కళ్లలో నిప్పులు పోసుకుంటున్నారా? బిజేపి పాలిత రాష్ట్రాలలో తెలంగాణలో అమలౌతున్న ఒక్క పథకమైనా అమలౌతుందా? రైతాంగానికి మేలు చేసే పని ఒక్కటైనా బిజేపి చేస్తుందా? ఇలాంటివి బిజేపికి అక్కర్లేదు. మతరాజకీయాలు అడ్డంపెట్టుకొవాలి పొద్దు బుచ్చుకోవాలి. అబద్దాలు చెప్పి పూటగడుపుకోవాలి. ఇప్పటికైనా బిజేపి నేతలు ఆత్మ విమర్శ చేసుకోవాలి. ఎటుపోతున్నామన్నది సోయి తెచ్చుకొని నడుచుకోవాలి. తెలంగాణ ప్రజల మనసు చూరగొనే రాజకీయాలు చేస్తే ఎవరూ వద్దనరు. ప్రజలు ఎన్నుకున్న ప్రజా ప్రభుత్వంతో నిత్యం కయ్యాలు, ప్రజలను తప్పుదారి పట్టించేందుకు ఎంతటి అన్యాయాలకైనా దిగుతామంటే ప్రభుత్వం ఊరుకుంటుందా? తప్పుడు విధానాలు మానుకోండి. మీకు చిత్తశుద్ది వుంటే తెలంగాణ అభివృద్ధికి సహకరించండి. అంతే కాని తెల్లారిలేస్తే దిక్కుమాలని రాజకీయాలే చేస్తాం…అంటూ అప్రజాస్యామిక రాజకీయాలే చేస్తామంటే ప్రజలు ఎక్కడ వుంచాలో వారికి తెలుసు. బిజేపి నేతలకు ప్రజల్లో ఇప్పటికే చోటు లేదు. సమాజంలోస్ధానం లేదు. పైన పటారం ,లోన లొటారమని అందరికీ తెలుసు. లేని గొప్పలకుపోయి తప్పులు చేసి ఇంకా చులకన కాకండి. రాజకీయాల మీద ప్రజలకు నమ్మకంలేకుండా చేసుకోకండి. ముందు ప్రజలకు క్షమాపణ చెప్పండి. భవిష్యత్తులో ఇలాంటి తప్పులు చేయమని వేడుకోండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *