9-Year-Old Vihan Ram Creates Mountaineering Record
9 ఏళ్ల వయసులోనే పర్వతారోహణలో అరుదైన ఘనత సాధించిన విహాన్ రామ్
మంచిర్యాల,నేటి ధాత్రి :
స్థానిక నారాయణ హై స్కూల్కు చెందిన 9 ఏళ్ల విద్యార్థి జతోత్ విహాన్ రామ్ పర్వతారోహణలో విశేష ప్రతిభ కనబరుస్తూ అరుదైన రికార్డులు సృష్టిస్తున్నాడు. 2026 మే నెల ప్రారంభంలో ఆస్ట్రేలియాలోని అత్యంత ఎత్తైన మౌంట్ కోసియస్కో శిఖరాన్ని (2,228 మీటర్లు) విజయవంతంగా అధిరోహించాడు.అంతకుముందు 2024 అక్టోబర్ 7న హిమాచల్ ప్రదేశ్లోని పఠాల్సు శిఖరాన్ని (4,250 మీటర్లు), 2025 జనవరి 15న టాంజానియాలోని కిలిమంజారో పర్వతంలోని గిల్మాన్స్ పాయింట్ (5,685 మీటర్లు) చేరుకుని తన సాహసాన్ని చాటుకున్నాడు.మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి’ అనే సందేశంతో పాటు ఫిట్ ఇండియా స్పూర్తిని ప్రచారం చేస్తూ ప్రపంచంలోని ప్రధాన శిఖరాలను అధిరోహిస్తున్న విహాన్ రామ్, ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ మరియు ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు సంపాదించాడు.ఈ సందర్భంగా నారాయణ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ జనరల్ మేనేజర్ గోపాల్ రెడ్డి, డీజీఎం వెంకటరమణ రెడ్డి, ఏజీఎం చైతన్య రావు అతడిని శాలువాతో సత్కరించి మెమొంటో అందజేశారు.పాఠశాల ప్రిన్సిపల్ స్రవంతి మాట్లాడుతూ చిన్న వయసులోనే విహాన్ రామ్ సాధించిన విజయాలు నేటి విద్యార్థులకు ఆదర్శమని కొనియాడారు.ఈ కార్యక్రమంలో ఈ చాంప్స్ ఆర్ అండ్ డి స్వాతి లక్ష్మీ, కో-ఆర్డినేటర్ శ్వేత, జోనల్ అనాలసిస్ట్ రాజేందర్ కుమ్మరి, అకడమిక్ డీన్ వెంకటస్వామి, వైస్ ప్రిన్సిపాల్ సంధ్యరాణి,ఏఓ కిషన్ తదితరులు పాల్గొన్నారు.
