No Transparency in Wage Hike: BRTU
వేతనాల పెంపులో పారదర్శకత లేదు: బీఆర్టీయూ
నర్సంపేట, నేటిధాత్రి:
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రకటించిన కనీస వేతనాల పెంపులో శాస్త్రీయత, పారదర్శకత లేదని బీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు గోనె యువరాజు విమర్శించారు. పెరిగిన నిత్యావసర ధరలకు అనుగుణంగా వేతనాలు పెరగలేదని ఆరోపించారు.ఆయన మాట్లాడుతూ, వేతన పెంపు కోసం క్యాబినెట్ సబ్ కమిటీ వేసి దేశానికి ఆదర్శంగా శాస్త్రీయ పద్ధతిలో పెంపు చేస్తామని సీఎం ప్రకటించినా ఆచరణలో చిత్తశుద్ధి లోపించిందన్నారు. కనీస వేతనాల పెంపులో కరువు భత్యం గురించి ప్రస్తావించకపోవడం దారుణమన్నారు.అన్ స్కిల్డ్ వర్కర్లకు రూ.16,000, సెమీస్కిల్డ్కు రూ.17,000, స్కిల్డ్కు రూ.18,500, హై స్కిల్డ్కు రూ.20,000 పెంచినట్లు సీఎం ప్రకటించారని, అయితే అన్ స్కిల్డ్ తప్ప మిగతా వారికి బేసిక్, కరువు భత్యం కలుపుకొని ఇప్పుడు వస్తున్న జీతానికి, పెంచిన దానికి పెద్ద తేడా లేదని తెలిపారు. కాంట్రాక్టు లేబర్ జీవో 11 ప్రకారం ఇప్పటికే రూ.13,098 నుంచి రూ.23,683 వరకు వేతనాలు అందుతున్నాయని, జీవో 4లో స్కిల్డ్ కార్మికునికి రూ.19,572 ఉండగా సీఎం ప్రకటించింది రూ.18,500 మాత్రమేనని, గతంతో పోలిస్తే రూ.1,072 తగ్గిందని వివరించారు.బీఆర్ఎస్ హయాంలో కనీస వేతనాల సలహా మండలి బోర్డు అన్ స్కిల్డ్ కార్మికుడికి రూ.18,009, కరువు భత్యం పాయింట్కు రూ.12 సిఫార్సు చేసిందని, 2021 జూన్ 25న 5 జీవోలను జారీ చేసినా కాంగ్రెస్ ప్రభుత్వం గెజిట్ విడుదల చేయలేదని గుర్తుచేశారు.డాక్టర్ అట్రాయి ఫార్ములా ప్రకారం శాస్త్రీయంగా లెక్కగడితే కనీస వేతనం నెలకు రూ.32,000 ఇవ్వాలని సుప్రీంకోర్టు చెబుతున్నా, కార్మిక సంఘాలు రూ.26,000 డిమాండ్ చేస్తున్నా సీఎం పట్టించుకోలేదని ఆరోపించారు. రాష్ట్రంలో అంగన్వాడీ, ఆశ, ఎన్ఆర్ఈజీఎస్, ఎన్ఆర్హెచ్ఎం, సర్వశిక్షా అభియాన్ కింద 3 లక్షలకు పైగా స్కీమ్ వర్కర్లు ఉన్నారని, వీరు ఏ కేటగిరీ కిందికి వస్తారో స్పష్టత లేదని, వేతన సవరణను పునఃసమీక్షించాలని డిమాండ్ చేశారు.
