భూ సమస్యల పరిష్కారానికి గొప్ప వేదిక భూభారతి చట్టం…
రెవెన్యూ గ్రామ సభలను రైతులు వినియోగించుకోవాలి…
జిల్లాలో 2 రెవెన్యూ డివిజన్లు, 18 మండలాలు, 288 రెవెన్యూ గ్రామాలు…
నేటి నుండి ప్రారంభమైన రెవెన్యూ సదస్సులు…
జిల్లా కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ అద్వైత్ కుమార్ సింగ్…
నేటి ధాత్రి – మహబూబాబాద్ :-
భూ సమస్యల పరిష్కారానికి గొప్ప వేదిక భూభారతి నూతన రెవెన్యూ చట్టం అని, రెవెన్యూ గ్రామసభలను భూ సమస్యలు ఉన్న రైతులు వినియోగించుకోవాలని మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ అన్నారు.మంగళవారం జిల్లా వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన నూతన భూభారతి రెవెన్యూ చట్టం – 2025,రెవెన్యూ గ్రామసభలను ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా అన్ని రెవెన్యూ గ్రామాలలో నిర్వహించారు.అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ,రాష్ట్రవ్యాప్తంగా పైలెట్ ప్రాజెక్టులో భాగంగా దంతాలపల్లి మండలంలో ఇప్పటికే రెవెన్యూ సదస్సులు నిర్వహించడం జరిగిందని తెలిపారు.జిల్లాలో రెండు బృందాలుగా రెవెన్యూ సిబ్బందిని నియమించి
ఉదయం 9 నుండి 4 వరకు రెవెన్యూ సదస్సులు నిర్వహించనున్నట్లు తెలిపారు.ఇప్పటికే స్థానిక తహసీల్దారులు పూర్తిస్థాయిలో సంబంధిత రెవెన్యూ గ్రామాలలో ప్రచారం నిర్వహించి ప్రజలను చైతన్య పరిచినట్లు తెలిపారు.మహబూబాబాద్, సింగారం, నెల్లికుదురు మండలం, వావిలాల రెవెన్యూ గ్రామాలలో జరుగుతున్న సదస్సులను పరిశీలించారు.ప్రభుత్వం సూచించిన ప్రకారం రెవెన్యూ గ్రామసభలను పక్కాగా నిర్వహించాలని దరఖాస్తుదారులకు ముందస్తు ఫారాలను ఇవ్వాలని వారి యొక్క దరఖాస్తులను పరిశీలించి స్వీకరించాలన్నారు.సదస్సులలో ప్రత్యేక హెల్ప్ డిస్కులను ఏర్పాటు చేయాలన్నారు.
వాటి ద్వారా దరఖాస్తుదారులకు తగు సూచనలు చేస్తూ దరఖాస్తులను పూరించుటకు సహకరించాలన్నారు.జిల్లా వ్యాప్తంగా ప్రతీ రోజు వచ్చిన దరఖాస్తుల స్థితిగతులను పరిశీలించి ఆన్లైన్లో నమోదు చేయాలన్నారు.అదనపు కలెక్టర్ రెవెన్యూ కె. వీరబ్రహ్మచారి కురవి మండలం తిరుమలపురం, మొగిలిచర్ల, రెవెన్యూ గ్రామాలలో జరుగుతున్న సదస్సులను పరిశీలించారు.ప్రజలకు అనువైన ప్రదేశాలు గ్రామపంచాయతీ, రైతు వేదికలు,తదితర ప్రదేశాలలో ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలతో రెవెన్యూ సదస్సుల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు పక్కా ప్రణాళికతో సదస్సులు నిర్వహిస్తూ పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉన్నామని తెలిపారు.