ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా అరైవ్ అలైవ్ కార్యక్రమానికి శ్రీకారం.
కోదాడ, నేటి ధాత్రి:
ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా అరైవ్ అలైవ్ రోడ్డు భద్రత కార్యక్రమాన్ని పెరికా హాస్టల్లో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ షేక్ జిలానీ, పోలీస్ శాఖ ఎస్ఐ, మున్సిపల్ శాఖ, విద్యుత్ శాఖ అధికారులు, లారీ అసోసియేషన్ అధ్యక్షుడు తునం కృష్ణ పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎంవీఐ షేక్ జిలానీ మాట్లాడుతూ. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రజలలో అవగాహన పెంచడం ముఖ్య లక్ష్యమని తెలిపారు. అధిక వేగం, నిర్లక్ష్య డ్రైవింగ్, ఫిట్నెస్ లేని వాహనాలు వంటి కారణాలపై ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తామని చెప్పారు. కమర్షియల్ వాహనాలు, స్కూల్ బస్సులపై కఠిన పర్యవేక్షణ కొనసాగుతుందని పేర్కొన్నారు. అదేవిధంగా ప్రమాదం జరిగిన వెంటనే తొలి ఒక గంటను గోల్డెన్ అవర్ గా పరిగణిస్తూ గాయపడిన వారికి తక్షణ వైద్య సహాయం అందించడం ద్వారా ప్రాణాలను రక్షించవచ్చని తెలిపారు. రాహ్వీర్ పథకం గురించి వివరిస్తూ, ప్రమాద బాధితులకు వెంటనే సహాయం చేసే పౌరులకు ప్రభుత్వం ప్రోత్సాహక బహుమతులు అందిస్తుందని చెప్పారు.లారీ అసోసియేషన్ అధ్యక్షుడు తునం కృష్ణ మాట్లాడుతూ, డ్రైవర్లు ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటించాలని అధిక వేగం ప్రమాదాలకు ప్రధాన కారణమని పేర్కొన్నారు. రోడ్డు భద్రతపై ప్రతి డ్రైవర్ బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు.ఎంవీఐ ఆధ్వర్యంలో డ్రైవర్లు, ఆటో యూనియన్లు, విద్యార్థులకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. హెల్మెట్, సీట్ బెల్ట్ వినియోగం, మద్యం సేవించి డ్రైవింగ్ చేయకూడదనే అంశాలపై ప్రమాణం చేయించారు. పోలీస్, మున్సిపల్, విద్యుత్ శాఖలు సమన్వయంతో పని చేస్తూ రోడ్ల సంరక్షణ, గుంతల పూడ్చివేత, వీధి దీపాల నిర్వహణ వంటి చర్యలను చేపడతామని అధికారులు తెలిపారు.ఏప్రిల్ 13 నుండి 18 వరకు కొనసాగనున్న ఈ కార్యక్రమంలో గ్రామ స్థాయి రోడ్డు భద్రత కమిటీలు ఏర్పాటు చేసి, ప్రజల్లో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.అరైవ్ అలైవ్” లక్ష్యాన్ని సాధించేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతతో వ్యవహరించి, గోల్డెన్ అవర్లో సహాయం అందించడం, రాహ్వీర్ పథకాన్ని వినియోగించడం ద్వారా ప్రాణాలను కాపాడాలని అధికారులు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో భాగంగా అనంతగిరిలో రోడ్డు భద్రత గ్రామ సభను ప్రారంభించారు. ఈ గ్రామ సభలో తాసిల్దార్, అనంతగిరి ఎస్సై, కోదాడ ఏఎంవీఐ పాల్గొని గ్రామస్థులకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. గ్రామ స్థాయిలో ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. కార్యక్రమంలో పట్టణ నాయకులు పెద్దలు, అధికారులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
