నిర్మలా సీతారామన్ 9వ బడ్జెట్.. దేశ చరిత్రలో రికార్డు: పాకా సత్యనారాయణ…

నిర్మలా సీతారామన్ 9వ బడ్జెట్.. దేశ చరిత్రలో రికార్డు: పాకా సత్యనారాయణ

 

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా తొమ్మిదోసారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం దేశ చరిత్రలో రికార్డు అని బీజేపీ రాజ్యసభ సభ్యులు పాకా సత్యనారాయణ వ్యాఖ్యానించారు. ఆమె అనుభవాన్ని, ఒకే ప్రభుత్వం పట్ల ప్రజలకున్న నమ్మకాన్ని తెలియజేస్తోందని పేర్కొన్నారు.

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా తొమ్మిదోసారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం దేశ చరిత్రలో రికార్డు అని బీజేపీ రాజ్యసభ సభ్యులు పాకా సత్యనారాయణ (BJP MP Paka Satyannarayana) వ్యాఖ్యానించారు. ఆమె అనుభవాన్ని, ఒకే ప్రభుత్వం పట్ల ప్రజలకున్న నమ్మకాన్ని తెలియజేస్తోందని పేర్కొన్నారు. ఈ బడ్జెట్ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు ప్రజల ఆశలకు అనుగుణంగా ఉందని నిపుణులు విశ్లేషిస్తున్నారని చెప్పుకొచ్చారు. ఈ బడ్జెట్‌తో దేశ వృద్ధి రేటు గణనీయంగా పెరుగుతుందని వెల్లడించారు. ద్రవ్యోల్బణం తగ్గుముఖం పడుతుందని అంచనా వేస్తున్నారని తెలిపారు.
ముఖ్యంగా ఎలక్ట్రానిక్స్ రంగంలో భారత్ ప్రపంచంలోనే రెండో స్థానానికి చేరుకునే అవకాశం ఉందని వివరించారు. 2014లో 11వ స్థానంలో ఉన్న భారత ఆర్థిక వ్యవస్థ, నేడు నాల్గోస్థానానికి చేరుకోవడం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పదేళ్ల అద్భుత పరిపాలనకు నిదర్శనమని ఉద్ఘాటించారు. 2014లో రూ. 14.30 లక్షల కోట్లుగా ఉన్న బడ్జెట్, నేడు రూ. 50.40 లక్షల కోట్లకు చేరుకుందని చెప్పుకొచ్చారు. కోవిడ్ మహమ్మారిని ఎదుర్కోవడమే కాకుండా, ప్రపంచ యుద్ధాల ప్రభావం భారత్‌పై పడకుండా ప్రభుత్వం సమర్థవంతంగా వ్యవహరించిందని తెలిపారు. రష్యా నుంచి చమురు దిగుమతులు, యూరోపియన్ యూనియన్‌తో కుదుర్చుకున్న ఒప్పందాలు భారతదేశ పరపతిని పెంచాయని తెలిపారు.

భారత్ ఎదిగితే ప్రపంచం ఎదుగుతుందని యూరోపియన్ యూనియన్ అధ్యక్షులు చెప్పడం విశేషమని పేర్కొన్నారు. ఏపీ ప్రయోజనాల దృష్ట్యా ఈ బడ్జెట్‌లో కీలక అంశాలు ప్రస్తావనకు వచ్చాయని తెలిపారు. పోలవరం నిర్మాణ బాధ్యతను కేంద్ర ప్రభుత్వమే పూర్తిగా తీసుకోవడంతో పనులు వేగవంతం కానున్నాయని చెప్పుకొచ్చారు. జగన్ ప్రభుత్వం మూడు రాజధానుల పేరుతో రాష్ట్రాన్ని నాశనం చేశారని ధ్వజమెత్తారు. అమరావతిని చట్టబద్ధమైన ఏకైక రాజధానిగా అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రత్యేక ప్యాకేజీలు, నాబార్డ్ వంటి సంస్థల నుంచి ఆర్థిక సహాయం అందనుందని వెల్లడించారు.

ప్రపంచ ఆక్వా ఎగుమతుల్లో భారత్ వాటా 76 శాతం కాగా, అందులో 60శాతం కేవలం ఆంధ్రప్రదేశ్ నుంచే జరుగుతోందని వివరించారు. ఈ రంగానికి బడ్జెట్‌లో తగిన ప్రాధాన్యత లభించిందని తెలిపారు. సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ , మంత్రి నారా లోకేశ్ ప్రయత్నాల వల్ల ప్రపంచ వాణిజ్య సంస్థలకు ఆంధ్రప్రదేశ్‌పై నమ్మకం పెరిగి, భారీగా పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని వెల్లడించారు. మొత్తంగా, ఈ బడ్జెట్ అటు దేశ భద్రతకు, ఇటు వ్యవసాయ, పారిశ్రామిక రంగాల అభివృద్ధికి పెద్దపీట వేస్తోందని పేర్కొన్నారు.

విజయవాడలో బీజేపీ వారధి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి పాకా సత్యనారాయణ హాజరై మాట్లాడారు. ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం కోసం బీజేపీ ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టిందని వెల్లడించారు. ప్రజల సమస్యలను వివిధ ప్రభుత్వ శాఖల దృష్టికి తీసుకెళ్లి, వాటికి త్వరితగతిన పరిష్కరించేలా ఈ కార్యక్రమం చేపట్టామని వివరించారు.

ప్రతి శుక్రవారం ఒక ప్రజా ప్రతినిధి ఆధ్వర్యంలో రాష్ట్ర పార్టీ కార్యాలయంలో ఈ సమావేశం జరుగుతుందని చెప్పుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రధానంగా నాలుగు ప్రాంతాల్లో ఈ ‘వారధి’ కార్యక్రమం ఏర్పాటు చేశామని తెలపారు. ప్రజలు తమకు ఉన్న ఇబ్బందులను, సమస్యలను ఈ వేదిక ద్వారా తెలియజేసి పరిష్కరించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రభుత్వం, ప్రజల మధ్య ఒక ‘వారధి’లా ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని పాకా సత్యనారాయణ పేర్కొన్నారు.

వారి సారథ్యంలో ఏపీకి పెద్ద ఎత్తున పెట్టుబడులు: మాధవ్…

వారి సారథ్యంలో ఏపీకి పెద్ద ఎత్తున పెట్టుబడులు: మాధవ్

 

ప్రధాని మోడీ నేతృత్వంలో ఈ ప్రాజెక్టులన్నీ ముందుకు తీసుకురావడం, సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ ఆధ్వర్యంలో విశాఖలో గూగుల్ డేటా సెంటర్ రావడం వల్ల ఏపీకి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు వచ్చిందని మాధవ్ తెలిపారు.

 ఏపీకి కేంద్రం నుంచి లక్షన్నర కోట్ల సాయం అందిందని బీజేపీ ఏపీ అధ్యక్షులు మాధవ్ (AP BJP Chief Madhav) తెలిపారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. లక్షా 80వేల కోట్ల పెట్టుబడితో గ్రీన్ హైడ్రోజన్ హబ్ పనులు శరవేగంగా సాగుతున్నాయన్నారు. రూ.11,444 కోట్లతో విశాఖ స్టీల్ ప్లాంట్ అభివృద్ధికి నిధులు కేటాయించారని చెప్పారు. గూగుల్ డేటా సెంటర్ ద్వారా 15 బిలియన్ డాలర్ల్ ఒక లక్షా 25వేల కోట్లతో విశాఖకు రావడం డబుల్ ఇంజన్ గ్రోత్‌కు ఒక చిహ్నమని పేర్కొన్నారు. విశాఖను గ్లోబల్ గ్రోత్ సెంటర్‌గా మార్చేలా అనేక కంపెనీలు, ఐటీ సంస్థలు వస్తున్నాయని వెల్లడించారు మాధవ్.
ప్రధాని మోడీ నేతృత్వంలో ఈ ప్రాజెక్టులన్నీ ముందుకు తీసుకురావడం, సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ ఆధ్వర్యంలో విశాఖలో గూగుల్ డేటా సెంటర్ రావడం వల్ల ఏపీకి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు వచ్చిందని తెలిపారు. కర్ణాటక వంటి పక్క రాష్ట్రాలకు కంటగింపుగా మారిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాలు దగా కోరు రాజకీయాలు చేస్తూ.. వారి వైఫల్యాలను వారే బయట పెట్టుకుంటున్నారని విమర్శించారు. కర్ణాటకలో ఫెయిల్ గవర్నమెంట్ ఉంది కాబట్టే.. ఆ పార్టీ తరపున వారు ఆక్రోశం వెలిబుచ్చుతున్నారని వ్యాఖ్యలు చేశారు. మోడీ, చంద్రబాబులు అసాధ్యమైన అంశాన్ని సాధించి.. ప్రపంచ వ్యాప్తంగా ఏపీ గురించి చర్చించుకునేలా చేశారని ఏపీ బీజేపీ చీఫ్ తెలిపారు.

కృత్రిమ మేధస్సుతో అనేక ప్రయోగాలకు విశాఖ వేదిక కాబోతుందన్నారు. ఎనర్జీ సోర్స్ కింద సోలార్, విండ్, హై ఎనర్జీలను వాడేందుకు గ్రీన్ ఎనర్జీ తయారవుతుందన్నారు. టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాన్ ఫ్యాక్చరింగ్‌లో యువత ప్రతిభకు చైనా తర్వాత ఏపీకే అవకాశాలు ఉన్నాయని చెప్పుకొచ్చారు. అమెరికాలో ఆంక్షలు ఉండటంతో భారత దేశంలోనే వీరంతా ఉండబోతున్నారని అన్నారు. ఐదేళ్లల్లో ఐదు లక్షల ఉద్యోగాలు యువతకు వస్తాయని ప్రకటించారు. నరేంద్ర మోడీ, రాష్ట్ర ప్రభుత్వం సారథ్యంలో ఏపీకి పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయని తెలిపారు. వైజాగ్ – చెన్నై కారిడార్, బెంగుళూరు – చెన్నై కారిడార్, రాయలసీమ వైపు మరో కారిడార్‌లు రాబోతున్నాయని మాధవ్ అన్నారు. డిపెన్స్ క్రస్టల్స్, అతిపెద్ద రిఫైనరీ, జాతీయ రహదారుల కనెక్టివిటీ అన్ని ప్రాంతాలకు పెరగడం ద్వారా అభివృద్ధి మరింత పెరుగుతుందని అభిప్రాయపడ్డారు.

ఎలక్ట్రానికి వెహికల్ తయారు చేసే కంపెనీలు, జిందాల్ సంస్థలు, పవర్ హౌస్‌లు ఏపీకి రాబోతున్నాయని.. డబుల్ ఇంజన్ సర్కార్ ఆధ్వర్యంలో రాయలసీమ అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుందన్నారు. మన రాజధాని అమరావతిలో గత ప్రభుత్వంలో అభివృద్ధి ఆగిపోయిందని… అమరావతితో వారంతా ఆటలాడుకుని నాశనం చేశారని మండిపడ్డారు. మోడీ సారథ్యంలో ఇప్పుడు అమరావతి నిర్మాణానికి 15వేల కోట్లు కేటాయించారన్నారు. అమరావతి నుంచి అనంతపురం వరకు జాతీయ రహదారుల అనుసంధానం కాబోతున్నాయని తెలిపారు. ఏపీ జీవనాడి పోలవరం నిర్మాణం కోసం కేంద్రం ఐదు వేల కోట్లు కేటాయించిందని అన్నారు. కుడి, ఎడమ కాలువ పనులు పూర్తి చేసి త్వరలోనే ప్రాజెక్టు పూర్తి చేస్తారని వెల్లడించారు. ఏపీని అన్ని విభాగాల్లో అబివృద్ధి చేసేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి అడుగులు వేస్తున్నాయన్నారు. ఓకల్ ఫర్ లోకల్ నినాదంతో.. ప్రతిఒక్కరూ స్వదేశీ వస్తువులను కొనుగోలు చేయాలని పిలుపునిచ్చారు. భారత దేశ ఆర్థికాభివృద్ధికి దేశ ప్రజలంతా సహకారం అందించాలని ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్ కోరారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version