జగిత్యాలలో వీడిన చిక్కుముడి.. కామారెడ్డిలో బిగ్ ట్విస్ట్…

జగిత్యాలలో వీడిన చిక్కుముడి.. కామారెడ్డిలో బిగ్ ట్విస్ట్

 

ఎట్టకేలకు జగిత్యాల మున్సిపాలిటీ పీఠంపై సస్పెన్స్ వీడింది. జగిత్యాల మున్సిపల్ చైర్‌పర్సన్ పీఠం ప్రస్తుత ఎమ్మెల్యే సంజయ్ వర్గానికే పార్టీ అధిష్ఠానం కేటాయించింది.

జగిత్యాల, ఫిబ్రవరి 16: తాజా.. మాజీ ఎమ్మెల్యేల మధ్య అధిపత్య పోరు నెలకొన్న వేళ.. జగిత్యాల మున్సిపాలిటీ పీఠంపై సస్పెన్స్ వీడింది. జగిత్యాల మున్సిపల్ చైర్‌పర్సన్ పీఠం ప్రస్తుత ఎమ్మెల్యే సంజయ్ వర్గానికే పార్టీ అధిష్ఠానం కేటాయించింది. దాంతో మున్సిపల్ చైర్మన్‌గా ఆయన వర్గానికి చెందిన సమిండ్ల వాణిని ఎంపిక చేశారు. అలాగే వైస్ చైర్మన్ పదవి మాజీమంత్రి జీవన్ రెడ్డి వర్గానికి కేటాయించింది. దీంతో వైస్ చైర్మన్ పదవికి పర్వీన్‌ను ఎన్నుకున్నారు.
మరోవైపు జెడ్పీ, మార్కెట్ కమిటీ పదవును జీవన్‌రెడ్డి వర్గానికి కేటాయిస్తామని అధిష్ఠానం హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. అయితే, ఈ ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం తాము సైతం కష్ట పడ్డామంటూ జీవన్‌రెడ్డితోపాటు ఆయన వర్గం అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లింది. ఈ మేరకు జీవన్ రెడ్డి వర్గానికి వైస్ చైర్మన్ పదవిని కేటాయించారు. దీంతో ఇరువర్గాలు ప్రస్తుతానికి శాంతించినట్లు ఒక చర్చ సాగుతోంది.

కామారెడ్డిలో బిగ్ ట్విస్ట్..

కామారెడ్డి మున్సిపాలిటీ చైర్మన్ ఎన్నికల్లో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచి గెలిచిన ఇప్ప ఉమారాణిని చైర్ పర్సన్ పీఠం వరించింది. ఈ మున్సిపల్ ఎన్నికల ఫలితాల అనంతరం ఇప్ప ఉమారాణి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ చైర్మన్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చేది లేదంటూ కామారెడ్డిలోని బీఆర్ఎస్ పార్టీ నేతలు తేల్చి చెప్పారు.దాంతో తాజాగా పార్టీలో చేరిన ఇప్ప ఉమారాణి పేరును కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదించింది. మరోవైపు వైస్ చైర్మన్ స్థానాన్ని బీఆర్ఎస్ పార్టీ నేతలు కోరారు. హఫీజ్, కాసర్ల గోదావరిలో ఒకరికి ఈ వైస్ చైర్మన్ పదవి దక్కే అవకాశం ఉందని తెలుస్తోంది.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version