ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమం అమలులో ప్రజాప్రతినిధుల పాత్ర కీలకం..

ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమం అమలులో ప్రజాప్రతినిధుల పాత్ర కీలకం

జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

మంచిర్యాల,నేటి ధాత్రి:

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమం అమలులో ప్రజా ప్రతినిధుల పాత్ర కీలకమైనదని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు.గురువారం జిల్లాలోని క్యాతనపల్లి మున్సిపల్ పరిధిలో గల అమ్మ గార్డెన్స్ లో గ్రామపంచాయతీ సర్పంచ్ లు, మున్సిపల్ కార్పొరేషన్/మున్సిపాలిటీ మేయర్/చైర్ పర్సన్ లు,డిప్యూటీ మేయర్/ వైస్ చైర్ పర్సన్ లు,కార్పొరేటర్లు/ కౌన్సిలర్లకు 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం పై ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమానికి డి సి పి ఎ.భాస్కర్, జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి.చంద్రయ్య,జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర్ రావు,వివిధ శాఖల జిల్లా అధికారులతో కలిసి హాజరయ్యారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ స్థానిక సంస్థలు,మున్సిపల్ ఎన్నికలు నిర్వహించి ప్రజాప్రతినిధులను ఎన్నుకోవడం జరిగిందని,ఈ క్రమంలో విధులు,అధికారాలపై గ్రామపంచాయతీల సర్పంచ్లకు శిక్షణ తరగతులు నిర్వహించడం జరిగిందని,పంచాయితీ రాజ్ చట్టాలు వివరించడం జరిగిందని తెలిపారు.మార్చి 6 నుంచి జూన్ 12వ తేదీ వరకు 99 రోజుల పాటు ప్రభుత్వం ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం చేపట్టడం జరిగిందని తెలిపారు.గ్రామ,మండల, నియోజకవర్గ,జిల్లా,రాష్ట్రస్థాయి లలో కార్యచరణ అమలు చేయడం జరుగుతుందని తెలిపారు.మున్సిపాలిటీలు, గ్రామపంచాయతీలలో పారిశుధ్యం,ప్రభుత్వ కార్యాలయాలలో పెండింగ్ లో ఉన్న పైళ్ల క్లియరెన్స్ తదితర అంశాలపై కార్యాచరణ,సమాజ హిత అంశాలపై ప్రణాళికలు అమలు చేయడం జరుగుతుందని తెలిపారు.రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలు,అమలు చేయడంలో ప్రజా ప్రతినిధులు తీసుకోవలసిన చర్యల గురించి తెలుసుకోవాలని తెలిపారు.తెలంగాణ పంచాయతీరాజ్ & మున్సిపల్ యాక్ట్ ల గురించి ప్రజాప్రతినిధులకు సంక్షిప్తంగా వివరించడం జరుగుతుందని తెలిపారు.విద్యా రంగ అభివృద్ధి దిశగా అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీ ఆధ్వర్యంలో అన్ని ప్రభుత్వ పాఠశాలలలో విద్యార్థుల సౌకర్యార్థం మౌలిక వసతులు, విద్యుత్,త్రాగునీరు, మూత్రశాలలు,ప్రహరీ గోడ నిర్మాణ పనులు నాణ్యత ప్రమాణాలతో చేపట్టడం జరిగిందని,ఇందులో భాగంగా ఉపాధి హామీ క్రింద పనులు చేయడం జరిగిందని తెలిపారు.స్వయం సహాయక సంఘాల మహిళలను అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీ అభివృద్ధి పనులలో భాగస్వామ్యలను చేయడం జరిగిందని తెలిపారు.రేషన్ కార్డు కొరకు దరఖాస్తు చేసుకున్నట్లయితే క్షేత్రస్థాయిలో పరిశీలించి అర్హులైన లబ్ధిదారులకు మంజూరు చేయడం జరుగుతుందని తెలిపారు.గ్రామపంచాయతీలు, మున్సిపాలిటీలలో నెలకొన్న సామాజిక సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించడం జరుగుతుందని తెలిపారు.నిరుద్యోగ యువత భవిష్యత్తు దృష్ట్యా మాదకద్రవ్యాల నిరోధకం,మద్యం వినియోగంపై ప్రజా ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు.ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా 2, 3 వార్డులలో 3, 4 రోజుల పాటు పారిశుధ్యం,త్రాగునీటి పైప్ లైన్ల మరమ్మత్తు,ఇతర పనులు చేపట్టడం జరుగుతుందని,ప్రజా ప్రతినిధులు కార్యక్రమాలలో పాల్గొని ప్రజలను భాగస్వామ్యులను చేయాలని తెలిపారు.పారిశుధ్య నిర్వహణలో భాగంగా ప్రతి రోజు ప్రతి ఇంటి నుండి చెత్త సేకరణ నిరంతరాయంగా కొనసాగించాలని తెలిపారు.ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలలో ఒకసారి లబ్ధి పొందిన వారిని గుర్తించాలని, మరల లబ్ధిదారుల జాబితాలో వారి వివరాలు లేకుండా జాగ్రత్త వహించాలని,తద్వారా అర్హత గల మిగిలిన లబ్ధిదారులకు ప్రయోజనం చేకూరుతుందని, ప్రభుత్వ లక్ష్యాలు విజయవంతం అవుతాయని తెలిపారు.రహదారి ప్రమాదాల నివారణలో భాగంగా ప్రతి ఒక్కరు రహదారి భద్రత నియమాలను పాటించే విధంగా ప్రజాప్రతినిధులు వారి పరిధిలో అవగాహన కల్పించాలని తెలిపారు.మున్సిపల్ పాలకవర్గం ఏర్పాటు చేయబడినందున మున్సిపల్ అభివృద్ధి కొరకు నిధులు మంజూరు అవుతాయని, ఈ నిధులను సక్రమంగా వినియోగిస్తూ ప్రజా ప్రయోజనకర అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి సమర్థవంతంగా నిర్వహించాలని తెలిపారు.వేసవిలో ప్రజలకు నిరంతరం నీటిని సరఫరా చేసే విధంగా ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలను ప్రజాప్రతినిధులు తమ పరిధిలో పకడ్బందీగా అమలు చేయాలని,నీటి వనరులను సమర్ధవంతంగా వినియోగించుకోవాలని తెలిపారు.విద్యుత్ దీపాల ఏర్పాటులో సౌర విద్యుత్ దీపాల ఏర్పాటుపై దృష్టి సారించాలని,తద్వారా విద్యుత్ వినియోగాన్ని నియంత్రించవచ్చని తెలిపారు.ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమం అమలులో ప్రజా ప్రతినిధుల విధులు, అధికారాలు తెలుసుకొని ప్రభుత్వ పథకాలను క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేసి ప్రజాసంక్షేమం ఉందిగా కృషి చేయాలని తెలిపారు.ప్రభుత్వం చేపట్టిన ప్రత్యేక కార్యక్రమం అమలులో ప్రజా ప్రతినిధుల పాత్ర కీలకమైనదని తెలిపారు.ఈ కార్యక్రమంలో వివిధ ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

పరకాల మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసం…

పరకాల మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసం

కాంగ్రెస్ 13,బిఆర్ఎస్ 6,బిజేపీ 3 స్థానాలు

పరకాల,నేటిధాత్రి

 

పరకాల మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది.మొత్తం 22 వార్డులలో జరిగిన ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 13 కౌన్సిలర్ స్థానాలు గెలుచుకుని స్పష్టమైన మెజారిటీ సాధించింది.దీంతో పరకాల మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసం అయింది.ఎన్నికల ఫలితాల ప్రకారం 22 స్థానాల్లో 13 సీట్లు దక్కించుకోవడంతో కాంగ్రెస్‌కు పూర్తి ఆధిక్యం లభించింది. మేజిక్ ఫిగర్ 12 కాగా,కాంగ్రెస్ దానికంటే ఒక సీటు ఎక్కువ సాధించింది.ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రశాంతంగా సాగింది. ఫలితాలు వెలువడిన వెంటనే కాంగ్రెస్ నాయకులు,కార్యకర్తలు ఆనందోత్సాహాలు వ్యక్తం చేశారు.పట్టణంలోని పలు ప్రాంతాల్లో సంబరాలు కనిపించాయి.బీఆర్‌ఎస్ పార్టీ 6 స్థానాలతో రెండో స్థానంలో నిలిచింది.బీజేపీ 3 సీట్లు సాధించి తమ ఉనికిని చాటుకుంది.మున్సిపల్ పాలనలో ఇకపై కాంగ్రెస్ కీలక పాత్ర పోషించనుంది.

గెలిచిన అభ్యర్థులు వీరే

1వ వార్డు వెంకట స్వామి దుబాసి(బిఆర్ఎస్),2వ వార్డుశ్యామల(బిఆర్ఎస్),3వ వార్డు పోరండ్ల మౌనిక(కాంగ్రెస్),4వ వార్డు ఏకు దివ్య(కాంగ్రెస్),5వ వార్డు గొడుగు రజిత (బిఆర్ఎస్),6వ వార్డు రాణి తుమ్మల(బిఆర్ఎస్),7వ వార్డు – సునీల్ కుమార్ పావుశెట్టి(కాంగ్రెస్),8వ వార్డు నల్లెల కుమార్(కాంగ్రెస్),9వ వార్డు బెజ్జంకి పూర్ణాచారి(బిజెపి),10వ వార్డు లావణ్య పసుల (కాంగ్రెస్),11వ వార్డు గుడెల్లి సాధన్ కుమార్(కాంగ్రెస్),12వ వార్డు ఆకుల లావణ్య (బిజెపి),13వ వార్డు మాధవి లత (కాంగ్రెస్),14వ వార్డు పడిదల దీప్తి (బిఆర్ఎస్),15వ వార్డు విజయ్ కుమార్(బిజెపి),16వ వార్డు బండి శ్రీదర్(కాంగ్రెస్),17వ వార్డు బొచ్చు సుభద్ర(కాంగ్రెస్),18వ వార్డు రేగూరి కరుణ,(బిఆర్ఎస్),19వ వార్డు శ్రీనివాస్ కొయ్యడ (కాంగ్రెస్),20వ వార్డు పాలకుర్తి శ్రీనివాస్ (కాంగ్రెస్),21వ వార్డు సూదమల్ల రమేష్ (కాంగ్రెస్),22వ వార్డు అల్లే దశరథం(కాంగ్రెస్) లు గెలుపు బాటలో నిలిచారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version