నర్సంపేటలో జరుగుతున్న అభివృద్ధి మాజీ ఎమ్మెల్యే పెద్ది నిధులే..
మున్సిపాలిటీని అభివృద్ధి చేసింది బిఆర్ఎస్ పార్టే..
ఆర్ఎస్ఎస్ రాష్ట్ర మాజీ డైరెక్టర్ రాయిడి రవీందర్ రెడ్డి
నర్సంపేట,నేటిధాత్రి:
కాంగ్రెస్ ప్రభుత్వం పేరుతో నర్సంపేట పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల నిధులు గత ఎన్నికలకు ముందు మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి తెచ్చిన నిధులే ఆని బిఆర్ఎస్ రాష్ట్ర రైతు సమన్వయ మాజీ డైరెక్టర్ రాయిడి రవీందర్ రెడ్డి తెలిపారు.
బిఆర్ఎస్ పట్టణ పార్టీ అధ్యక్షుడు నాగల్లి వెంకట్ నారాయణ గౌడ్ అధ్యక్షతన పట్టణంలోని సిటిజెన్ క్లబ్ లో నర్సంపేట పట్టణ వార్డు ముఖ్యులు, క్లస్టర్ బాధ్యులతో పార్టీ సమావేశం మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి ఆదేశాలతో నిర్వహించారు.
ఈ సందర్భంగా రాయిడి రవీందర్ రెడ్డి మాట్లాడుతూ
గత పేదేండ్ల కాలంలో నర్సంపేట మున్సిపాలిటీని అభివృద్ధి చేసింది బిఆర్ఎస్ పార్టీ మాత్రమే అని పేర్కొన్నారు.ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీలు 420 హామీలను నెరవేర్చలేదని ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా రేవంత్ రెడ్డి సర్కార్ పట్ల ప్రజలు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారని ఆరోపించారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 18 నెలలు గడిచిన నర్సంపేట మున్సిపాలిటీ అభివృద్ధికి ఒక రూపాయి నిధులు కూడా తీసుకురాలేదని ఎద్దేవా చేశారు.
అశాస్త్రీయంగా గ్రామాలను మున్సిపాలిటీలో కలిపారని, ప్రజలతో ఎలాంటి అభిప్రాయం తీసుకోలేదని చెప్పారు.
రాజకీయంగా ఎదుర్కోలేక కుట్ర పూరితంగా మున్సిపాలిటీ వార్డుల విభజన చేసారని రవీందర్ రెడ్డి ఆరోపించారు.
ప్రజల అభిప్రాయాలకు భిన్నంగా వార్డుల విభజన జరిగిందని,వార్డుల వారీగా కేటాయించిన ఓటర్ల సంఖ్యలో తీవ్ర వ్యత్యాసం కనిపిస్తుందని అన్నారు.
స్థానిక అధికారులు అధికార పార్టీ నాయకుల ఒత్తిళ్లకు లోను కాకుండా విభజనను పునఃసమీక్షించి శాస్త్రీయ పద్ధతిలో వార్డుల విభజన జరగాలని కోరుతున్నట్లు ఆయన పేర్కొన్నారు.
నిజమైన పేదలకు అర్హులకు సంక్షేమ పథకాలు అందడం లేదని తెలుపుతూ పేదలను మభ్యపెట్టి కాంగ్రెస్ పార్టీ నాయకులు లబ్ధి పొందాలనుకుంటున్నారని ఆరోపించారు.
స్థానిక కాంగ్రెస్ నాయకులు చేస్తున్న అరాచకాలను ప్రజలలోకి తీసుకెళ్లాలని బిఆర్ఎస్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
భవిష్యత్తులో పార్టీ కార్యకర్తలు నాయకులు సమిష్టిగా పనిచేసి పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని ఆర్ఎస్ఎస్ రాష్ట్ర మాజీ డైరెక్టర్ రాయిడి రవీందర్ రెడ్డి కోరారు.
ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు లెక్కల విద్యాసాగర్ రెడ్డి,మండల పార్టీ అధ్యక్షులు నామాల సత్యనారాయణ, క్లస్టర్ బాధ్యులు మోతే జయపాల్ రెడ్డి,మచ్చిక నరసయ్య గౌడ్,బండి రమేష్ ,రాంప్రసాద్,కడారి కుమారస్వామి,బండి ప్రవీణ్,పట్టణ
ప్రధాన కార్యదర్శి వెన్నుముద్దల శ్రీధర్ రెడ్డి,మహిళా విభాగం అధ్యక్షురాలు వాసం కరుణ,మాజీ కౌన్సిలర్స్,పట్టణ కమిటీ బాధ్యులు,వార్డు అధ్యక్షులు,యూత్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.