హన్మకొండ మరియు వరంగల్ ఉమ్మడి జిల్లా కోర్టు అవరణలో మెగా హెల్త్ క్యాంప్:-
ప్రారంభించిన జిల్లా న్యాయమూర్తి శ్రీమతి అపర్ణాదేవి:-
హన్మకొండ/వరంగల్, నేటిధాత్రి (లీగల్):-
శుక్రవారం అదాలత్ కోర్టు ప్రాంగణంలో ఎన్ఎస్ఆర్ హాస్పిటల్స్, అప్పోలో సౌజన్యంతో హన్మకొండ, వరంగల్ బార్ అసోషియేషన్స్ ఆధ్వర్యంలో జరిగిన మెగా హెల్త్ క్యాంపును జిల్లా జడ్జి శ్రీమతి అపర్ణాదేవి ప్రారంభించారు. ఇట్టి సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆరోగ్యమే మహాభాగ్యమని, ఆరోగ్యంగా వుంటేనే న్యాయవాదులు ప్రజలకు మంచి సేవలందించ గలరని, వివిధ అనారోగ్య కారణాలతో ఇటీవల కొంతమంది అడ్వకేట్లు అకాల మరణం చెందారని ఆవేదన చెందారు. ముఖ్యంగా గుండె పోటుతో మరణాలు పెరిగిపోయాయని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మెగా హెల్త్ క్యాంపులో ఉచిత ఈసిజీ, టుడీ ఈకో వంటి పరీక్షలు నిర్వహించడం సంతోషకరమైన విషయమని అన్నారు.
హన్మకొండ బార్ అసోషియేషన్ అధ్యక్షులు పులి సత్యనారాయణ మాట్లాడుతూ మెగా హెల్త్ క్యాంపు ఏర్పాటు చేయడానికి సహకరించిన ఎన్ఎస్ఆర్ హాస్పిటల్స్, అప్పోలో సంస్థలకు ధన్యవాదాలు తెలిపారు. అడ్వకేట్స్ సంక్షేమం కోసం బార్ అసోషియేషన్ అంకితభావంతో పని చేస్తున్నదని అన్నారు. ఈ హెల్త్ క్యాంపులో జూనియర్, సీనియర్ అడ్వకేట్లు పాల్గొని వివిధ పరీక్షలు చేయించుకొన్నారని సంతోషం వెలిబుచ్చారు. మహిళా అడ్వకేట్ల కోసం గైనకాలజీ స్పెషలిస్టులు వచ్చి సేవలందించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో వరంగల్ అడ్వకేట్స్ బార్ అసోషియేషన్ అధ్యక్షులతో పాటు రెండు బార్ల కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.
