ఎల్కతుర్తి – సిద్దిపేట హైవే కాంట్రాక్ట్ పై చర్యలు తీసుకోండి
సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాసరావు డిమాండ్
బీమదేవరపల్లి, నేటిదాత్రి :
హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తపల్లి గ్రామం జాతీయ రహదారిపై బీమదేవరపల్లి, ఎల్కతుర్తి మండలాల సిపిఐ నాయకులతో కలిసి హైవే నిర్మాణ పనులను పరిశీలించిన అనంతరం బీమదేవరపల్లి మండలం కొత్తపల్లి గ్రామం శివారు వద్ద ప్రధాన రహదారిపై సిపిఐ ఆద్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. దీంతో రహదారిపై ట్రాఫిక్ నిలిచిపోయింది. ఈ సందర్భంగా తక్కళ్లపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ రామయ్య పేట నుండి ఎల్కతుర్తి చేపట్టిన నూతన జాతీయ రహదారి 765 నెంబరు హైవే పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్ నత్తనడక పనులు, నాణ్యతను పాటించడం లేదని, తద్వారా రోడ్డు నిర్మాణం పూర్తి కాకముందే రోడ్డుపైన గుంతలు,రోడ్డు ద్వంసం అవుతున్నదన్నారు. కాంట్రాక్టు పనులు దక్కించుకుని సంవత్సరాలు గడుస్తున్నా పనులు సకాలంలో పూర్తి చేయకుండా కాంట్రాక్టర్ నిర్లక్ష్యము వహిస్తున్నాడని, తద్వారా స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. మద్యం సేవించి ఓవర్ స్పీడ్ తో నడుపుతున్న వాహనాలు ఈ రోడ్డుపైన అనేక ప్రమాదం జరిగి ప్రాణాలు కోల్పోయినారు.రోడ్డు పై కంకర తేలి, దుమ్ము, దూళీతో సమీప గ్రామాల ప్రజలు రోగాల బారిన పడుతున్నారని అన్నారు. ఈ హైవే పై ఓవర్ లోడ్ వాహనాలు నియాంత్రిచాలని, రోడ్డు సకాలంలో పూర్తి కాకపోవడంతో నిత్యం జరుగుతున్న ప్రమాదాలను నియంత్రించాలని డిమాండ్ చేశారు. నాసిరకం పనులు నిర్వహిస్తూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న సదరు కాంట్రాక్టర్ ను ప్రభుత్వం బ్లాక్ లిస్ట్ లో పెట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ హనుమకొండ జిల్లా కార్యదర్శి కర్రె భిక్షపతి,రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు ఆదరి శ్రీనివాస్ ,జిల్లా సహాయ కార్యదర్శులు తోట భిక్షపతి, మద్దెల ఎల్లేష్, నాయకులు ఊటుకూరి రాములు,కర్రె లక్ష్మణ్, సీనియర్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.