భూమి కార్మికులది…సోకు సొసైటీది!

https://epaper.netidhatri.com/

‘‘చిత్రపురి’’ లో చిత్రవిచిత్ర ‘‘దోపిడీ విన్యాసాలు’’ ఎపిసోడ్‌ – 2

`చిత్రపురి ఛానల్‌ ప్రశ్నలకు అ ‘నిల్‌’ సమాధానాలు!

`పర్యావరణ అనుమతులు లేవు?

` హెచ్‌ఎండిఏ అనుమతులు ఇంకా పూర్తిగా రాలేదు!

`స్వయంగా సొసైటీ పెద్ద ఒప్పుకున్న వాస్తవాలు?

`మరి నిర్మాణాలు ఎలా చేపడతారు!

`ఇంకా కార్మికులను ఎంత కాలం మోసం చేస్తారు?

`బఫర్‌ జోన్‌లో నిర్మాణాలు సాధ్యమా!

`దోచుకోవడానికి కార్మికులే దొరికారా?

` ‘‘రో’’ హౌజులు ఎవరి కోసం కట్టారు?

` కార్మికుల భూమిలో పెద్దలకు ఎలా కేటాయిస్తారు?

`భూమి కొనుగోలుకు కార్మికుల కష్టంతో..

`పంపకాలు సొసైటీ చేతిలో..

`రియలెస్టేట్‌ లోనే లేని ధరలు..

` చిత్రపురిలో నాలుగింతలు.

` పేద కార్మికుల దోపిడీకి కుయుక్తులు.

` రియల్‌ రంగంలో 10 శాతం అడ్వాన్స్‌.

`చిత్రపురిలో 30 శాతం అడ్వాన్స్‌.

`కార్మికుల సొంత భూమిలో నిర్మాణానికి ఫీట్‌కు రూ. 6 వేలా?

`అప్పార్ట్‌మెంటు అమ్మకాలలో కూడ అంత ధర లేదు!

`ట్విన్‌ టవర్స్‌ నిర్మించే సంస్థ పేరేమిటి?

`పేరు చెప్పడానికి దాపరికమేమిటి?

`పేద కార్మికులకు అప్పులు పుట్టేనా!

` వారం, పది రోజుల్లో అంత సొమ్ము సాధ్యమయ్యేనా?

`దిగమింగిన సొమ్ము సరిపోలేదా?

` ఇంకా ధన దాహం తీరలేదా?

` త్వరలో జరిగే సొసైటీ ఎన్నికల ఖర్చు కోసం కార్మికుల పొట్ట మళ్ళీ కొట్టాలా?

` కార్మికులకు సేవ పేరుతో ఇంతకు దిగజారాలా?

`ఈ ప్రశ్నలకు ఎవరు సమాధానం చెబుతారు?

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

అది సినీ లోకం. మాయా ప్రపంచం. గాలిలో మేడల సమాజం. ఇక్కడ కూడా కార్మికులకు కష్టాలే! ఇక్కడ కూడా దోపిడే. ఇక్కడా పీడనే. వారికి నిరంతరం వేధనే. మిగిలేది ఆకలే. జీవితాంతం అప్పులే. అందరూ మోసం చేసేవాళ్లే! చిన్న వేషానికో, మాట సాయానికో సంబరపడిపోయే చిన్న జీవులను చిత్రపురిలో ఇంకెంత కాలం మోసం చేస్తారు? ఇంకెంత కాలం దోపిడీ చేస్తారు? ఇంకెంత కాలం మభ్యపెడతారు? వయసుడుతున్నవారిని ఇంకెంత కాలం దోచుకుతింటారు? నలభై ఏళ్లుగా మోసం చేస్తూనే వున్నారు. వారి పేరు చెప్పి పెద్దలుగా చెలామణి అవుతున్నారు. కార్మికుల నుంచి కష్టాలలోకి మరింత నెట్టేస్తున్నారు. వారి స్ధలాలోనే వారికి చోటు లేకుండా చేస్తున్నారు. నీడ లేని నిర్భాగ్యులను చేస్తున్నారు. అభాగ్యులుగా మార్చి ఆటలాడుతుకుంటున్నారు. ఎప్పటికప్పుడు ఏమార్చుతూనే వున్నారు. వేపుకుతింపుటన్నారు. వేదించుకు తింటున్నారు. మాటలు మార్చి మభ్యపెడుతూనే వున్నారు. వారి ఆశలు ఆవిరిచేస్తున్నారు. అడియాసలు చేస్తున్నారు. సొసైటీ పెద్దలకు కనీసం మానవత్వం లేదా? కార్మికుల జీవితాలతో ఆడుకోవద్దన్న కనికరం లేదా? మీ కంటికి కార్మికులు కనీసం మనుషులుగా కూడా కనిపించడం లేదా? నలభై ఏళ్లుగా కార్మికులకు న్యాయం చేయని పెద్దలు ఇప్పుడు న్యాయం చేస్తారా? ఆ కార్మికుల మేలు గురించి ఏనాడైనా ఆలోచించారా? ముఖ్యంగా తెలంగాణ సినీ కార్మికుల గురించి పట్టించుకున్నారా? చిత్రపురి కోసం ప్రభుత్వంతోపాటు భూమి ఇచ్చింది తెలంగాణ నటుడు ప్రభాకర్‌రెడ్డి. కాని ఎంత మంది తెలంగాణ సినీ కార్మికులకు న్యాయం చేశారు? పెత్తనమంతా ఇంకెంత కాలం ఆంద్రావాళ్లే చేస్తారు? సొసైటీ పేరుతో పదవులు, ఆస్ధులు అనుభవిస్తారు? అటు సినిమాల్లోనే దోపిడీ! చిత్రపురిలోనూ దోపిడేనా? ఇవి సినిమా కష్టాలే కాదు… సినీ కార్మికులు జీవితాంతం మోస్తున్న భాధలు…గుండె బరువులు.

చిత్ర పురిలో ఆది నుంచి కిరికిరే..ఆంధ్రా పెద్దలు గిరిగీసుకొని పెడుతున్న ఇబ్బందులే.

నిజానికి చిత్రపురి స్ధలాలు..కార్మికులవి. కాని సొకుంతా సొసైటీ చేసుకుంటోంది. సినీ లోకంలో పెద్ద మనుషుల వేదికగా చెలామణి అవుతోంది. అసలు చిత్రపురిలో అనువైన స్ధలాలపై సినీ గద్దలు వాలారు. సొసైటీ పేర్ల పలహారం చేసుకున్నారు. నిర్మాణయోగ్యానికి అనువయ్యే స్ధలాలు సినీ పెద్దలకా? నిర్మాణానికి అవకాశంలేని స్ధలాలలో కార్మికులకు ట్విన్‌ టవర్స్‌ నిర్మాణం చేస్తారా? నమ్మమంటారా? ఇక్కడ కొన్ని విషయాలు లోతుగా అధ్యయనం చేయాలి. అప్పుడు సొసైటీ అసలు బాగోతం బైటపడుతుంది. ప్రస్తుతం కార్మికుల కోసం నిర్మాణం చేస్తామని సొసైటీ ముఖ్యడు చెబుతున్న వివరాల ప్రకారమే…చిత్రపురి ఛానల్‌లో చెప్పిన విషయాల ఆధారంగానే పర్యావరణ అనుమతులు లేవు. హెచ్‌ఎండియే పూర్తి అనుమతులు రాలేదు. ఇంతకన్నా కార్మికులను మోసం చేస్తున్నామని చెప్పడానికి రుజువేం కావాలి? ప్రస్తుతం కార్మికుల మీద లేని ప్రేమతో నిర్మాణాలు సాగించాలనుకుంటున్న స్థలం బఫర్‌ జోన్‌ లో వుంది. అని స్వయంగా సొసైటీ పెద్దనే చెబుతున్నారు. అసలు చెరువుల మాయంపైనే తెలంగాణలో పెద్ద ఎత్తున రచ్చ జరుగుతోంది. ఇక్కడ చెరువు శిఖం కూడా కాదు, బఫర్‌ జోన్‌లో ఇండ్ల నిర్మాణానికి చట్టం ఒప్పుటుందా? పాలకులు ఎవరైనా ఆయా శాఖలు అంగీకరిస్తాయా? చట్టాలు అనుమతిస్తాయా? అయినా ఎలా నిర్మాణం చేస్తామని చెబుతున్నారు. కార్మికులనుంచి 30శాతం అడ్వాన్సు వసూలు చేయాలనుకుంటున్నారు? అది చట్టవిరుద్దం కాదా? అసలు రియల్‌ వ్యాపారంలోనే భూమితోపాటు,ఫ్లాట్‌ కొంటేనే ఆ కంపనీలు 5 నుంచి10శాతం అడ్వాన్సు తీసుకుంటాయి. మరి చిత్రపురిలో 30శాతం వసూలు చేయడం ఏమిటి? భూమి కార్మికులదైనప్పుడు 30శాతం అవసరం ఏమొచ్చింది? కార్మికులకు అంత సొమ్ము ఏక కాలంలో చెల్లించేంత స్ధొమత వుందా? వుంటుందా? ఇది కూడా పేద కార్మికులను పక్కకు తప్పించే ఎత్తుగడ కాదా? సొసైటీకి అనుకూలమైన వారికి దారాధత్తం చేయడం కోసం కాదంటారా? పైగా ఏ రియల్‌ కంపనీ అయినా ఇప్పుడున్న పరిస్ధితుల్లో నగర శివారుల్లో స్వేర్‌ ఫీట్‌ రూ.4వేలు కూడా లేదు. కాని చిత్రపురిలో స్వేర్‌ ఫీట్‌కు రూ.6వేలు ధర నిర్ణయించడమేమిటి? ఇది కార్మికులు మోయలేని భారం కాదా? కార్మికుల కష్టంతో కొన్న భూమిలో అంతంత ధరలు పెట్టి ప్లాట్‌ కొనుగోలు చేసుకోవడం సాధ్యమౌతుందా? అసలు ట్విన్‌ టవర్స్‌ నిర్మాణం చేసే సంస్ధ ఏమిటన్నది కార్మికులకు తెలియాల్సిన అవసరం లేదా? అందులో దాపరికమెందుకు? ఆ దాగుడు మూతలెందుకు? వారం పది రోజులు గడువిచ్చి కార్మికులను సొమ్ము జమ చేయమంటే సాధ్యమతౌతుందా? వారికి లక్షల రూపాయల అప్పులు ఇప్పటికిప్పుడు పుడతాయా? ఈ తతంగమంతా ఎందుకు? ఎవరికి మేలు చేసుందుకు? ప్లాట్లు ఎవరికి కట్టబెట్టేందుకు? తెలంగాణ కార్మికులకు అన్యాయం చేయడానికే అన్నది స్పష్టంగా అర్ధమౌతోంది. 

 ఇక చిత్రపురిలో రో హౌజ్‌ల నిర్మాణలు చేయడం చట్టవిరుద్దం. 

ఎందుకంటే కార్మికుల స్ధలాలో పెద్దలు వాలడమే తప్పు. వారికి భూములు కేటాయించడం మరింత నేరం. మొత్తం చిత్రపురిలో ఎన్ని ఫ్లాట్లు నిర్మాణం చేసినా సభ్యత్వాలున్న కార్మికులకు సరిపోవు. అలాంటి వాటిలో నిర్మాతలకు స్ధలాలు కేటాయించడమేమిటి? వారికి రో హౌజ్‌ల నిర్మాణం చేపట్టడమేమిటి? నిర్మాణం చేసిన మొత్తం రో హౌజ్‌ల స్దానంలో కొన్ని వేల ప్లాట్స్‌ నిర్మాణం చేయొచ్చు. కొన్ని వేల మంది కార్మికులకు న్యాయం చేయొచ్చు. 250 మంది పెద్దల కోసం అంతంత స్ధలాలు కేటాయించడమేమిటి? కార్మికులకు నష్టం చేయడమేమిటి? వీటికి సమాధానాలు రావాల్సిన అవసరం వుంది. రో హౌజ్‌ల నిర్మాణం అక్రమమని జిహెచ్‌ఎంసి నోటీసలు జారీ చేసింది. కూలగొట్టింది. మళ్లీ నిర్మాణాలు చేపట్టొద్దని ఆదేశాలు జారీ చేసింది. అధికారులు కూలగొట్టినా ఎందుకు మళ్లీ నిర్మాణాలు ఎలా సాగిస్తున్నారు. ఇది మున్సిపల్‌ చట్టం ఉల్లంఘన కాదా? ప్రభుత్వం అక్రమ నిర్మాణాలనీ తేల్చిన తర్వాతే కూల్చుతుంది. మళ్లీ ఎలా వాటికి మరమ్మత్తులు చేస్తున్నారు. తిరిగి ఎలా నిర్మాణాలు చేపడుతున్నారు. అసలు చిత్రపురిలో ఏం జరుగుతోంది. కనీసం కార్మికులకైనా తెలియాల్సిన అవసరం లేదా? సొసైటీ లోటు బడ్జెట్‌లో వుందంటే కారణం ఎవరు? కొన్ని వేల మంది కార్మికులకు ఇండ్లు ఇవ్వాల్సిన చోట పిడికెడు మంది సినీ పెద్దలకు సంతర్పణ చేస్తే లోటు రాకుండా వుంటుందా? ఆ లోటు మళ్లీ కార్మికులతో భర్తీ చేయాలని చూస్తున్నారా? అందుకే ట్విన్‌ టవర్స్‌ పేరుతో నిర్మాణాలనీ మభ్యపెట్టి, అడ్వాన్సుల పేర 30శాతం వసూలుకు నిర్ణయించారా? త్వరలో జరగాల్సిన సోసైటీ ఎన్నికల ఖర్చు కోసం మళ్లీ కార్మికుల పొట్టకొట్టే దుకాణం తెరిచారా? రో హౌజ్‌ల నిర్మాణంతోనే సొసైటీ కార్మికులకు కాకుండా పెద్దలకు కొమ్ముకాస్తుందనేది తేలిపోయింది? అలాంటప్పుడు సొసైటీ ఎందుకు? ప్రభుత్వ పరం చేయండి? ప్రభుత్వమే నిర్ణయం తీసుకుంటుంది. ఆ స్ధలం ప్రభుత్వానికే అప్పగించడండి. ప్రభుత్వమే కార్మికులందరికీ రెండు పడకల గదులు ఇండ్లు నిర్మాణం చేసి ఇస్తుంది. సొసైటీ కార్మికుల సంక్షేమం కోసమే అయితే ఆ పని చేయండి? ఎన్నికల కోసం కోట్లు ఖర్చులుండవు. వారి విలాసాలకు భవనాలుండవు. కార్యాలయాలుండవు. అవి కూడా కార్మికులకు అందజేయొచ్చు. కొన్ని లక్షల మంది కార్మికులకు ఇండ్లు లేవు. జీవితంలో సొంత ఇల్లు కల తీరక వేలలకు వేలు అద్దెలు చెల్లిస్తున్నారు. జీవితం మొత్తం అద్దె ఇళ్లలోనే కాలం గడుతున్నారు. అలాంటి వారికి న్యాయం చేయడానికి నలభై ఏళ్లు కూడా సరిపోతే, ఇంకెప్పుడు ఇండ్లు వస్తాయి. వచ్చే తరానికి కూడా ఆ చిత్రపురిలో కార్మికులకు చోటే వుండదు. ఈ విషయంపై ప్రభుత్వం తక్షణం దృష్టిపెట్టాల్సిన అవసరం వుంది. గత పాలకులు మొత్తం సినీ పెద్దలకు కొమ్ము కాశారు. చిత్రపురిలో పేదల కోసం స్ధలాలిచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వమే మళ్లీ అదికారంలోకి వచ్చింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మీద నమ్మకం వుంది. కార్మికులకు మళ్లీ ఆశ చిగురిచింది. వారి ఆశలపై మళ్లీ నీళ్లు చల్లకండి. వారి ఆశలు సజీవం చేయండి. ఈ ఐదేళ్లలలో వారికి సొంతింటి కల నెరవేర్చండి. కార్మికుల జీవితాలతో ఆటలాడుకుంటున్న సొసైటీ ప్రక్షాళన చేయండి. తెలంగాణ సినీ కార్మికులకు అన్యాయం జరక్కుండా చూడండి. ఇది కార్మికుల వేదన..ఆవేదన..అరణ్య రోధన..తీరన యాతన..తపన!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *