సీఎం రేవంత్ రెడ్డి పర్యటనను విజయవంతం చేయండి
ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు
భూపాలపల్లి నేటిధాత్రి
మునిసిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి త్వరలో భూపాలపల్లికి రానున్నారని, వారి పర్యటనను భూపాలపల్లి నియోజకవర్గంలోని అన్ని గ్రామాల ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ నేతలు, వివిధ అనుబంధ సంఘాల నాయకులు, ప్రజలు అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పిలుపునిచ్చారు. ఈమేరకు (శనివారం) ఎమ్మెల్యే జీఎస్సార్ రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ అయిత ప్రకాష్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బట్టు కరుణాకర్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు, వివిధ మండలాల అధ్యక్షులతో కలిసి గణపురం మండలం చెల్పూరు గ్రామ శివారులోని కర్నాలకుంట చెరువు పక్కన ఉన్న ఖాళీ మైదానాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జీఎస్సార్ నాయకులకు, పోలీసులకు పలు సూచనలు చేశారు. సభా వేదిక ఏర్పాటు, హెలీ ప్యాడ్, వాహనాల పార్కింగ్ తదితర ఏర్పాట్లపై ఎమ్మెల్యే గణపురం సిఐ కరుణాకర్ రావు, ఎస్సై అశోక్ తో చర్చించారు.

కొడవటంచ శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్న ఎమ్మెల్యే
రేగొండ మండలంలోని కొడవటంచ శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు, రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ అయిత ప్రకాష్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బట్టు కరుణాకర్ పలువురు ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ ముఖ్య నేతలతో కలిసి దర్శించుకుని, ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ ప్రాంగణం మొత్తం కలియ తిరుగుతూ, జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. పనులన్నీ యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని సూచనలు చేశారు. అనంతరం అక్కడ జరిగిన రేగొండ కొత్తపల్లిగోరి మండలాల్లోని వివిధ గ్రామాలకు చెందిన ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులతో జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి పర్యటనకు సంబంధించి పలు సూచనలు చేశారు. రెండు మండలాల్లోని అన్ని గ్రామాల నుండి పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ కార్యకర్తలు, ప్రజలు, అభిమానులు తరలిరావాలని కోరారు.
ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
