Collector Reviews School and Hospital Facilities in Mancherial
విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా సౌకర్యాలు కల్పించాలి
జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
మంచిర్యాల,నేటి ధాత్రి:
ప్రభుత్వ పాఠశాలలలో విద్య అభ్యసిస్తున్న విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సౌకర్యాలు కల్పించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు.సోమవారం జిల్లాలోని మంచిర్యాల పట్టణంలో రాజీవ్ నగర్ లో గల కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని సందర్శించి కొనసాగుతున్న అదనపు గదుల నిర్మాణ పనులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం విద్యారంగాన్ని పటిష్టం చేస్తూ ప్రభుత్వ విద్యా సంస్థలు,సంక్షేమ వసతి గృహాలలో సకల సదుపాయాలు కల్పించి నాణ్యమైన విద్యను అందించడం జరుగుతుందని తెలిపారు.విద్యార్థుల ఆరోగ్య దృష్ట్యా మెనూ ప్రకారం సకాలంలో పౌష్టిక ఆహారం అందించాలని తెలిపారు.వంటశాల,సామాగ్రి నిల్వ గదిని పరిశీలించి ఆహారం తయారీ సమయంలో సిబ్బంది శుభ్రత నిబంధనలు పాటించాలని సూచించారు.ఇంటర్మీడియట్ ఫలితాలలో అనుత్తీర్ణులైన విద్యార్థులకు నిర్వహిస్తున్న ప్రత్యేక తరగతుల తీరును పరిశీలించి ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు.ఆదర్శ పాఠశాలల వసతి గృహాన్ని సందర్శించి కొనసాగుతున్న పనులను పరిశీలించి త్వరగా పూర్తిచేసే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.అనంతరం కాలేజ్ రోడ్డులో నిర్మితమవుతున్న ప్రభుత్వ ఆసుపత్రి,క్రిటికల్ కేర్ విభాగాల నిర్మాణ పనులను పరిశీలించారు.ప్రజలకు మరింత వేగవంతమైన,మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం 129.25 కోట్ల రూపాయల వ్యయంతో ప్రభుత్వ ఆసుపత్రి, 23.75 కోట్ల రూపాయల వ్యయంతో క్రిటికల్ కేర్ విభాగాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు.అధికారులు గుత్తేదారుల సమన్వయంతో పనులు వేగవంతం చేసి త్వరగా పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
