Collector Conducts Surprise Inspection at Narsampet Hospital
ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్
నర్సంపేట,నేటిధాత్రి:
ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందుతున్నాయా అనే విషయాన్ని పరిశీలించేందుకు జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద శుక్రవారం నర్సంపేటలోని ప్రభుత్వ జిల్లా ఆసుపత్రి వైద్యశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా కలెక్టర్ ఆసుపత్రిలో అందిస్తున్న వైద్య సేవలు, ఔషధాల లభ్యత, శుభ్రత, రోగుల సౌకర్యాలు తదితర అంశాలను సమగ్రంగా పరిశీలించారు. రోగులతో మాట్లాడి వారికి అందుతున్న చికిత్సపై వివరాలు తెలుసుకున్నారు.ఆసుపత్రిలో శుభ్రతను కచ్చితంగా పాటించాలనీ, రోగులకు సమయానికి మెరుగైన వైద్య సేవలు అందించాలనీ సంబంధిత అధికారులకు కలెక్టర్ ఆదేశించారు. అవసరమైన మందులు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంచాలని, సిబ్బంది విధులను సమర్థవంతంగా నిర్వర్తించాలని సూచించారు.ఈ తనిఖీలో కలెక్టర్ వెంట ఆర్డీవో ఉమారాణి, ఆసుపత్రి పర్యవేక్షకులు కిషన్ నాయక్, డాక్టర్లు, ఇతర వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
