CP Praises Students Discipline
విద్యార్థుల క్రమశిక్షణపై సీపీ ప్రశంసలు
రోడ్డు భద్రతపై అవగాహనతో భవిష్యత్కు బాటలు
పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా
జైపూర్,నేటి ధాత్రి:
రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మంచిర్యాల జోన్, జైపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న సోషల్ వెల్ఫేర్ స్కూల్లో “అరైవ్ & అలైవ్” పేరుతో రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమం చేపట్టారు.ఈ కార్యక్రమాన్ని జైపూర్ సీఐ నవీన్, ఎస్సై రాజశేఖర్ ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ కార్యక్రమానికి రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా,మంచిర్యాల జోన్ డీసీపీ ఏ.భాస్కర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.ఈ సందర్భంగా సీపీ అంబర్ కిషోర్ ఝా విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ వారు చూపుతున్న క్రమశిక్షణను అభినందించారు.రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని,చిన్న వయస్సు నుంచే ట్రాఫిక్ నియమాలను నేర్చుకుని పాటించడం ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు.విద్యార్థి దశలో అలవర్చుకున్న మంచి అలవాట్లు భవిష్యత్తులో బాధ్యతాయుత పౌరులుగా ఎదగడానికి దోహదపడతాయని తెలిపారు.రోడ్డు ప్రమాదాల నివారణ కోసం ట్రాఫిక్ రూల్స్ను తప్పనిసరిగా పాటించాలని, హెల్మెట్,సీట్ బెల్ట్ వినియోగం అత్యవసరమని సూచించారు.ఈ నియమాలను మనమే కాకుండా కుటుంబ సభ్యులు,స్నేహితులకు కూడా తెలియజేయాలని విద్యార్థులకు సూచించారు.ట్రాఫిక్ సిగ్నల్స్ ప్రాముఖ్యతను వివరించి, నియమాలను గౌరవిస్తే ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చని చెప్పారు.ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని ట్రాఫిక్ నియమాలపై చిత్రలేఖనం చేశారు.సీపీ,డీసీపీలు వాటిని పరిశీలించి విద్యార్థులకు బహుమతులు అందజేశారు.అదేవిధంగా ప్రతి విద్యార్థి తమ తల్లిదండ్రులకు పోస్ట్ కార్డు ద్వారా హెల్మెట్ ధరించడం,సీట్ బెల్ట్ వినియోగం, ట్రాఫిక్ నియమాలను పాటించడం వంటి విషయాలపై అవగాహన కల్పించారు.చివరగా విద్యార్థులు రోడ్డు భద్రత నియమాలను పాటిస్తూ,తమ కుటుంబ సభ్యులతో కూడా పాటింపజేస్తామని ప్రతిజ్ఞ చేశారు.
