Women Safety Awareness Seminar at CKM College
సీకేఎం కాలేజీలో మహిళల భద్రతపై అవగాహన సదస్సు
వరంగల్, నేటిధాత్రి.
వరంగల్ దేశాయిపేటలోని సీకేఎం గవర్నమెంట్ డిగ్రీ కళాశాలలో మహిళల భద్రతపై అవగాహన సదస్సు నిర్వహించారు. పదవ బెటాలియన్ ఎన్సీసీ వరంగల్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ట్రాఫిక్ సీఐ సుజాత, షీ టీం ఎస్సై శ్వేత, ముఖ్య అతిథులుగా హాజరై సదస్సును ప్రారంభించారు.
ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ధర్మారెడ్డి మాట్లాడుతూ మహిళల భద్రత కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక పోలీస్ బృందమే షీ టీమ్ అని తెలిపారు. మహిళలపై జరుగుతున్న వేధింపులు, ఈవ్టీజింగ్, స్టాకింగ్ వంటి సమస్యలను అరికట్టడంలో షీ టీమ్ కీలక పాత్ర పోషిస్తోందని పేర్కొన్నారు. కళాశాలలు, పాఠశాలలు మరియు సమాజంలో మహిళల భద్రతపై అవగాహన కల్పించడం ద్వారా మహిళల గౌరవాన్ని కాపాడడంతో పాటు వేధింపులను నిరోధించవచ్చని అన్నారు.

ట్రాఫిక్ సీఐ సుజాత మాట్లాడుతూ.. మహిళలు ఎదుర్కొనే సమస్యలను పోలీసులకు వెంటనే తెలియజేయాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో పోలీస్ హెల్ప్లైన్ 100, షీ టీమ్ నెంబర్ 1930కు ఫోన్ చేయవచ్చని లేదా తెలంగాణ పోలీస్ సోషల్ మీడియా ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. అలాగే ట్రాఫిక్ నిబంధనలను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని సూచించారు. మైనర్లు వాహనాలు నడపడం చట్టరీత్యా నేరమని, హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని, ఒకే బండిపై ముగ్గురు ప్రయాణించరాదని, మద్యం సేవించి వాహనాలు నడపకూడదని తెలిపారు. యువత రోడ్డు ప్రమాదాలకు గురై ప్రాణాలు కోల్పోతున్న సంఘటనలు అనేకం ఉన్నాయని, తల్లిదండ్రులకు కడుపుకోత మిగిల్చే పరిస్థితులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
మరో ముఖ్య అతిథి ఎస్సై స్వాతి మరియు హెడ్ కానిస్టేబుల్ నారాయణ మాట్లాడుతూ షీ టీమ్ నిర్వహిస్తున్న అవగాహన కార్యక్రమాలు సమాజంలో మహిళలకు భద్రత కల్పించడంలో ఉపయోగపడుతున్నాయని తెలిపారు. విద్యార్థులు కూడా ఈ కార్యక్రమాల్లో భాగస్వాములు అయితే సమాజం మరింత సురక్షితంగా మారుతుందని అన్నారు. ముఖ్యంగా యువతులు తమ వాట్సాప్ డీపీలు, స్టేటస్లలో వ్యక్తిగత వివరాలు లేదా ఫోటోలు పంచుకోవడంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ వరప్రసాద్, విజయ్ పాల్ రెడ్డి, ఎన్సీసీ కెప్టెన్ డాక్టర్ సతీష్, లైబ్రేరియన్ అనిల్, ఆయేషా, కానిస్టేబుల్ పూర్ణ, సూపరింటెండెంట్ శ్రీనివాస్, పా షా, జ్ఞానేశ్వర్, స్రవంతి, హరిబాబు, వెంకట్, సుమన్, చంద్రమోహన్ తదితర బోధనా, బోధనేతర సిబ్బంది, కళాశాల విద్యార్థులు, ఎన్సీసీ మరియు ఎంబీఏ విద్యార్థులు పాల్గొన్నారు.
