బంధన్ హాస్పిటల్లో దారుణం.

బంధన్ హాస్పిటల్లో దారుణం.

కడుపు నొప్పని వస్తే, కాటికి పంపిన బంధన్ హాస్పిటల్ వైద్యం.

బంధన్ హాస్పిటల్ నిర్లక్ష్యం ఖరీదు నిండు ప్రాణం బలి.

హనుమకొండ బంధన్ హాస్పిటల్ లో వైద్యం వికటించి వరంగల్ కి చెందిన మహేందర్ అనే వ్యక్తి మృతి.

అనుభవం లేని డాక్టర్లు వైద్యం చేయడం వల్లే మహేందర్ రావు మృతి చెందినట్లు ఆరోపిస్తూ బంధువుల ఆందోళన.

హాస్పిటల్ లోనికి ఎవరిని అనుమతించని పోలీసులు. మృతుడి బంధువులు, పలువురిని హాస్పిటల్ లోనే ఉంచి తాళాలేసిన యాజమాన్యం.

మృతుడికి ముగ్గురు ఆడపిల్లలు, న్యాయం చేయాలని బంధువుల డిమాండ్.

గతంలో కూడా బంధన్ హాస్పిటల్ లో వైద్యం వికటించిన వైనం..

గతంలో వచ్చిన ఫిర్యాదులపై స్పందించి ఉంటే ఈ మృతి జరిగేది కాదంటూ పలువురి ఆవేదన

చోద్యం చూస్తున్న “వైద్యాధికారులు”.! ఇప్పటికైనా వైద్యాధికారులు స్పందించేనా..?

*బంధన్ హాస్పిటల్ పై చర్యలకు వెనకాడుతున్న హనుమకొండ వైద్యశాఖ అధికారులు?.

ఇంకెంతమంది ప్రాణాలు పోవాలి? అపెండిక్స్ ఆపరేషన్ లు సైతం చేయరాని ఇలాంటి హాస్పటల్ ను సీజ్ చేయాలని బాధితుల డిమాండ్.

“బంధన్ ఆసుపత్రి” వెనక ఉన్న రాజకీయ నాయకులు ఎవరు?

నలుగురు డాక్టర్లు కలిసి కోట్లు పెట్టి హాస్పిటల్ లు కట్టడం.., పేద ప్రజల నుండి డబ్బులు వసూలు చేయడమేనా వీళ్ళ టార్గెట్?

నాణ్యమైన వైద్యం అందివ్వడం చేతకాదా.. డబ్బుల సంపాదనే వీళ్ళ ప్రధాన ఎజెండా?

వరంగల్ నేటిధాత్రి:

అమ్మ జన్మనిస్తే.. ఏదైనా ప్రాణాపాయ స్థితి ఏర్పడితే దాని నుంచి కాపాడి.. పునర్జన్మనిచ్చే దేవుళ్లుగా వైద్యులను ఆరాధిస్తుంటారు. అలా గొప్పగా కీర్తించబడే పవిత్రమైన వైద్య వృత్తికి కొందరు డాక్టర్లు అపఖ్యాతి తీసుకొస్తున్నారు. ఈ కోవకు చెందినవారే హనుమకొండలోని బంధన్ ఆసుపత్రి వైద్యులు అని బాధితులు ఆరోపిస్తున్నారు. వివరాల్లోకి వెళితే ఆదివారం నాడు, వరంగల్ నగరం రంగశాయిపేట కు చెందిన మహేందర్ రావు అనే వ్యక్తి కడుపునొప్పితో బాధపడుతుండగా కుటుంబ సభ్యులు హన్మకొండలోని బంధన్ హాస్పిటల్ లో అడ్మిట్ చేశారు. కడుపు నొప్పితో బాధపడుతున్న వ్యక్తిని అందుబాటులో ఉన్న అనుభవం లేని డి ఫార్మా,, బిఏఎంఎస్ చేసిన డాక్టర్లు పరిశీలించి ట్రీట్మెంట్ చేయడం వల్ల వ్యక్తి మృతి చెందారని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. మహేందర్ రావుకు గతంలోనే గుండెకు సంబంధించి వైద్యం జరిగింది అది దృష్టిలో పెట్టుకొని గుండె కు సంబంధించిన డాక్టర్ను పిలవండి అని కుటుంబ సభ్యులు తెలిపిన కానీ, బంధన్ హాస్పిటల్ వాళ్ళు ఈ రోజు ఆదివారం గుండెకు సంబంధించి డాక్టర్ రారు, మేము చూసుకుంటాం అని, కనీసం జనరల్ అనస్థీషియా డాక్టర్ లేకుండానే ట్రీట్మెంట్ చేసిన డాక్టర్లు. గ్యాస్ట్రిక్ సమస్య, కడుపునొప్పి, ఉబ్బసంతో బాధపడుతున్న వ్యక్తి హాస్పిటల్ కు నడుచుకుంటూ వచ్చి హాస్పిటల్లో అడ్మిట్ అయి, డిశ్చార్జ్ కూడా రాసిన డాక్టర్లు, మరి ఏమైందో, ఏమో కానీ అచ్చిరాని వైద్యం చేసి మంచిగున్న వ్యక్తిని నిర్లక్ష్యంగా ప్రాణాలు బలిగొన్నారు అని మృతుడి కుమార్తె మీడియాతో మాట్లాడుతూ కన్నీరు పెట్టుకున్నారు. పేషెంట్ కు అల్ట్రా సౌండ్ స్కానింగ్ కొరకు నడుచుకుంటూ బయటికి తీసుకువెళ్లాల్సిన అవసరం ఏమి వచ్చింది అని ప్రశ్నిస్తున్నారు బంధువులు.

hospital

పేషంట్ కొరకు కార్డియాలజిస్ట్ డాక్టర్ ను పిలవండి, లేదంటే మేము వేరే హాస్పటల్ కు వెళ్తాము అని, అంబులెన్స్ కూడా తెచ్చుకొని, హాస్పిటల్ దగ్గర దాదాపుగా మూడు గంటలు వేచి ఉన్నా కానీ, సదరు బంధన్ డాక్టర్లు నిర్లక్ష్యంతో అనుభవం లేని డాక్టర్లు ట్రీట్మెంట్ చేయడం ద్వారా వ్యక్తి మృతి చెందిన సంఘటన. దీంతో కుటుంబ సభ్యులు హాస్పిటల్ లో ఆందోళనకు దిగారు. నిర్లక్ష్యంగా వైద్యం చేసి, తమ తండ్రి మృతికి కారణం అయ్యారు బంధన్ హాస్పిటల్ డాక్టర్లు అని, ఈ హాస్పిటల్ లో ఎలాంటి క్వాలిఫైడ్ డాక్టర్లు అందుబాటులో లేరని, అనుభవం లేని డాక్టర్లు మాత్రమే వైద్యం చేస్తున్నారనీ నడుచుకుంటూ వచ్చిన మా నాన్నని నిర్లక్ష్యంగా వైద్యం చేసి మరణానికి కారకులయ్యారు అని మృతుడి కుమార్తెలు కన్నీరు పెట్టుకున్నారు. మహేందర్ రావు మృతి విషయం తెలుసుకున్న వెంటనే బంధువులు హుటాహుటిన హాస్పిటల్ కు చేరుకొని ఆందోళన చేశారు. వెంటనే స్థానిక పోలీసులు రంగంలోకి దిగి బంధువులతో, హాస్పిటల్ యజమాన్యంతో మాట్లాడారు. బంధన్ హాస్పిటల్ బడా బాబులది కావడం దీని వెనుక రాజకీయ నాయకుల అండ ఉండడంతో, సమస్యను మేము పరిష్కరించుకుంటాం అని చెప్పి, విషయం బయటకు రాకుండా మేనేజ్ చేసిన తీరు ఆశ్చర్యం. ఏది ఏమైనా కానీ బంధం హాస్పిటల్ లో సరియైన డాక్టర్లు లేకుండానే వైద్యం చేస్తున్న విషయం మరోసారి వెలుగులోకి వచ్చింది. గతంలో కూడా అనుభవం లేని డాక్టర్లు అపెండిక్స్ ఆపరేషన్ చేసి ఫెయిల్యూర్ అయిన ఘటన మరువకముందే, కడుపు నొప్పితో బాధపడుతున్న మరో వ్యక్తి ఈ హాస్పిటల్ లో జాయిన్ అయి, మృతి చెందిన వార్త నగరంలో కలకలం రేపింది. గతంలోనే అపెండిక్స్ ఫెయిల్యూర్ కు సంబంధించి హాస్పిటల్ నిర్లక్ష్యం వలన తనకు అన్యాయం జరిగిందని ఒక జర్నలిస్ట్ హనుమకొండ వైద్యశాఖ అధికారులకు ఫిర్యాదు చేసినా కూడా, సదరు వైద్య శాఖ అధికారులు కానీ, హనుమకొండ డిఎంహెచ్ఓ సైతం స్పందించకుండా, హాస్పిటల్ పై ఎలాంటి యాక్షన్ కూడా తీసుకోలేదు ఇప్పటివరకు. అప్పుడే వాళ్లు స్పందించి హాస్పిటల్ లో వైద్యులు ఎవరున్నారు? ఎలాంటి ట్రీట్మెంట్ చేస్తున్నారు? క్వాలిఫైడ్ డాక్టర్లు ఉన్నారా? లేదా? అనే విషయాన్ని పరిశీలించి చర్యలు తీసుకోవాల్సిన వైద్యశాఖ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు ఉండడం గమనార్హం.

గతంలో ఒక జర్నలిస్టుకు చేసిన అపెండిక్స్ ఆపరేషన్ సైతం ఫెయిల్యూర్

Hospital

బంధన్ హాస్పిటల్ వైద్యుల నిర్వాకం వల్ల తాను ప్రాణాపాయ స్థితికి వెళ్లి నెలల పాటు మంచానికి పరిమితం అయ్యానని బాధితుడు జర్నలిస్టు కృష్ణ పేర్కొన్నారు. గత ఏడాది 21 జూలైన అపెండిక్స్ సమస్యతో బంధన్ ఆసుపత్రిలో అడ్మిట్ అయిన జర్నలిస్ట్ కృష్ణకు.. అదే రోజు సాయంత్రం 6 గంటలకు సుమారు నాలుగు గంటల పైనే వైద్యులు ఆపరేషన్ చేశారు.  ఒకరోజు తర్వాత హాస్పిటల్ లో వైద్యం సరిగా లేకపోవడం గ్రహించిన కుటుంబ సభ్యులు.. వైద్యులను అడగగా.. ఎవరూ స్పందించకపోవడంతో.. ఆపరేషన్ వికటించిందని భావించి..జూలై 23 రాత్రి వరంగల్ మెడికవర్ హాస్పటల్ కి వెళ్లారు. అక్కడ వైద్యులు రోగిని చెక్ చేసి పరిస్థితి విషమంగా ఉందని తెలపడంతో వెంటనే హైదరాబాద్ బేగంపేట మెడికోవర్ హాస్పటల్ కి వెళ్లి అడ్మిట్ అయ్యారు. మెడికవర్ ఆస్పత్రికి చేరుకున్న రోగిని చూసిన వైద్యులు ఇన్ఫెక్షన్ ఎక్కువ స్థాయికి చేరుకుందని అబ్జర్వేషన్ లో ఉంచి మరో ఆపరేషన్ చేశారు. దానికి పూర్తిగా అయిన ఖర్చు రూ.14 లక్షలు.. దానికి తోడు ఆరు నెలల పాటు పూర్తి స్థాయిలో రెస్ట్ తీసుకోవాలని వైద్యులు తెలిపారు. ఐతే అంత పెద్దగా కావడానికి కారణం బంధన్ హాస్పటల్ లో జర్నలిస్టు కృష్ణకు 4 గంటల పాటు చేసిన వైద్యంలో

Hospital

జరిగిన తప్పిదమే కారణం అని బాధితుడు కృష్ణ ఆరోపించారు. అయితే బాధితుడు సర్జరీ చేసే సమయంలో రికార్డు అయిన వీడియో ఇవ్వమని పలుమార్లు అడిగిన కూడా బంధన్ హాస్పిటల్ యాజమాన్యం నిర్లక్ష్యపు సమాధానం ఇస్తూ దాట వేయడంతో బాధితుడు తనపై చాలా ప్రయోగాలు చేశారు అని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై గతంలో ఉన్నతాధికారులకు బాధితుడు ఫిర్యాదు చేశారు. తనకు న్యాయం చేయాలని కోరారు. సమాజంలో జరిగే మంచి చెడును విశ్లేషించే పాత్రికేయుడి నైన తనకు సదరు ఆసుపత్రిలో అన్యాయం జరగగా.., ఇక సామాన్యుడి సంగతి ఏమిటని జర్నలిస్ట్ కృష్ణ ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి, బంధన్ ఆసుపత్రి వెనక ఉన్న రాజకీయ అండదండలను చూసి బెదరకుండా ఆసుపత్రిపై విచారణ జరిపి తగు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version