పొత్కపల్లిలో మత్తు పదార్థాల వ్యతిరేక అవగాహన సదస్సు
ఓదెల (పెద్దపల్లి జిల్లా)నేటిధాత్రి:
ఓదెల మండలం పొత్కపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోలో బుధవారం మత్తు పదార్థాల వినియోగంపై అవగాహన కల్పించేందుకు పోత్క పల్లి – కాల్వ శ్రీరాంపూర్ ప్రధాన కూడలి వద్ద ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. డ్రగ్స్, గంజాయి వంటి మత్తు పదార్థాల వినియోగం వ్యక్తిగతంగా మాత్రమే కాకుండా సమాజాన్ని కూడా నాశనం చేస్తుందన్న సందేశాన్ని ఇస్తూ ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్పై దికొండ రమేష్ నేతృత్వంలో (బ్రేక్ ద చైన్స్ ఆఫ్ సబ్ స్టాన్స్ అబూస్ ఆర్ వన్ బ్యాడ్ ఛాయిస్ కాన్ చేంజ్ ఏ లైఫ్) అనే నినాదాలతో స్థానిక జడ్.పి. హెచ్.ఎస్ హైస్కూల్ విద్యార్థులతో కలిసి ఫ్లాష్ మాబ్ (నృత్య ప్రదర్శన) నిర్వహించారు. ఈ ప్రదర్శన పొత్కపల్లి సెంటర్లో స్థానికుల దృష్టిని ఆకర్షించింది. అవగాహన సభలో ఎస్పై రమేష్ మాట్లాడుతూ, “డ్రగ్స్ వాడకాన్ని యువత ఫ్యాషన్గా తీసుకోవడం ప్రమాదకరం. ఇది భవిష్యత్తును నాశనం చేస్తుంది. మత్తులో వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు, నేరాలకు దారి తీస్తాయి. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు యువతకు మార్గనిర్దేశం చేయాలి,” అని అన్నారు. స్కూళ్లు, కళాశాలల్లో డ్రగ్స్ వినియోగం గమనిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని పిలుపునిచ్చారు. విద్యార్థులలో చైతన్యం తీసుకురావడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ఈ అవగాహన కార్యక్రమంలో హైస్కూల్ అధ్యాపక బృందం, పోలీస్ సిబ్బంది, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.