
Tributes to Konda Laxman Bapuji’s Legacy
ఉద్యమ స్ఫూర్తి ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ
జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
మంచిర్యాల,నేటి ధాత్రి:
నిజాం నిరంకుశ పాలనను వ్యతిరేకించిన తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ అని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు.కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి పురస్కరించుకొని శనివారం జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సమావేశ మందిరంలో జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కార్యక్రమానికి హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కొండా లక్ష్మణ్ బాపూజీ కొమరంభీం జిల్లా వాంకిడి గ్రామంలో 1915 సెప్టెంబర్ 27న జన్మించాడని, స్వాతంత్రోద్యమంలో, నిరంకుశ నిజాం వ్యతిరేక ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నాడని తెలిపారు. రాజకీయరంగంలో వివిధ పదవులలో ప్రజా శ్రేయస్సుకు ఎనలేని సేవలు అందించారని, తెలంగాణ కోసం 1969లో మంత్రి పదవిని తృణప్రాయంగా వదిలిలేసిన నిబద్ధత కలిగిన రాజకీయవేత్త అని,తెలంగాణ తొలి,మలిదశ ఉద్యమాలలో తన వంతు పాత్ర పోషించారని తెలిపారు.మహనీయుల జయంతి కార్యక్రమాలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం సంతోషంగా ఉందని,వారు చూపిన సన్మార్గంలో కొనసాగుతూ రాష్ట్ర అభివృద్ధికి సమిష్టిగా కృషి చేయాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.