లంచాలు తీసుకోకుండా బతకరా!!
`పట్టుబడిన వారిపై చర్యలేవి!
`కొలువులు పోకపోతే భయమెక్కడిది!
`శాఖ పరమైన చర్యలు అని చేతులు దులుపుకోవడమేమిటి!
`ఉద్యోగానికి ముందు పోలీసు కేసులుంటే పనికి రారు.
`ఉద్యోగంలో పట్టుబడి కేసులైనా కొలువు పోదు.
`ఇవేం చట్టాలు…చచ్చు బండలు.
`తప్పు చేశాడని కళ్ల ముందు కనిపించినా చర్యలు వుండవు.
`లంచం నేరమైనా శిక్షలుండవు.
`కేసు ఫైల్ చేసి అధికారులు చేతులు దులుపుకుంటారు.
`నాయకులు జోక్యం చేసుకొని కొలువులిప్పిస్తారు.
`దర్జాగా లంచావతారి మళ్ళీ కుర్చీలో కూర్చుంటాడు.
`అంతకు మించి లంచాలు లేకుండా కొలువే చేయడు.
`తప్పు చేసి దొరికిన రోజే శిక్ష ఖరారు చేయాలి.
`వెంటనే విచారణ జరిపించి చర్యలు చేపట్టాలి.
`వేల మంది ఉద్యోగులు పట్టుబతున్నా భయం లేదు.
`పట్టుబడినా నష్టమేమీ లేదన్న ధైర్యం ఉద్యోగులలో పెరిగిపోయింది.
`అత్తారింటికి వెళ్లొచ్చినట్లు నాలుగు రోజులు జైలు..తర్వాత బెయిలు.
`ఉద్యోగం కోసం మరునాటి నుంచి ప్రయత్నం.
`లంచాన్ని నమ్ముకొని మళ్ళీ కొలువులో చేరడం.
`లంచావతారులకు శిక్ష అంటే ఇంతేనా!
`ఏసిబికి మరిన్ని అధికారాలు కట్డబెట్టలేరా?
`పట్టుబడిన వెంటనే చర్యలు తీసుకునే అధికారం ఇవ్వలేరా!
`వందల మంది పట్డుబడుతున్నా లాభం ఏముంది?
`కోట్లు సంపాదించుకున్న ఉద్యోగులకు భయం ఎందుకుంటుంది.
`ఒకప్పుడు నాయకులైతే చాలు తరతరాల సంపాదన అనుకునే వారు.
`ఇప్పుడు చిన్న ప్రభుత్వ ఉద్యోగి అయితే చాలు.
`కోట్లు సంపాదించుకోచ్చనుకుంటున్నారు.
`ప్రజలను రూపాయి అడగడానికి నోరు రానంత భయం కలగాలి.
`లంచం తీసుకొని దొరికిన వారి ఆస్థులన్నీ జప్తు చేయాలి.
`కఠినమైన చట్టాలు తీసుకు రావాలి.
`ఉద్యోగులంటే ప్రజలకు సేవకులు అని తెలిసి రావాలి.
హైదరాబాద్,నేటిధాత్రి:
మామూళ్ల మత్తు వదలరా? లంచాలు తీసుకోకుండా బతకలేరా? అంటూ తెలంగాణ సమాజం లంచాలవతారులైన కొంత మంది ప్రభుత్వ ఉద్యోగులను ప్రశ్నిస్తోంది. నిలదీస్తోంది. నిందిస్తోంది. తూతూ అంటూ ఉమ్మెస్తోంది. ఉందుకా బతుకులు పాడుగానని శపిస్తోంది. అయినా మారరు. మారితే ఉద్యోగులెందుకౌతారు? మారితే కోట్లు ఎలా కూడబెట్టుకుంటారు. ఎవరెన్ని తిట్టినా మారం..ఎవరెంత బాధపడినా వదిలిపెట్టం. ఇదే ప్రభుత్వ ఉద్యోగుల అనుసరిస్తున్న ధోరణి. అసలు ఇంతగా ప్రబుత్వ ఉద్యోగులు భరితెగించడానికి కారణం కూడా రాజకీయ పార్టీలు, పాలకులు. అది ఆ పార్టీ ఈ పార్టీ అని తేడా ఏం లేదు. అన్ని పార్టీల అలుసు..వారి అవసరాలే ఉద్యోగులను అవినీతి పరులుగా మారేందుకు కారణమయ్యాయని చెప్పడంలో సందేహం లేదు. ఎన్నికల మందు అవినీతికి తావు లేని సమాజం నిర్మాణం చేస్తామని రాజకీయ నాయకులు , పార్టీలు ప్రతిసారి గొప్పగా చెబుతాయి. గెలిచిన తర్వాత అదే ఉద్యోగులచేత అవినీతి పనులు చేయిస్తుంటాయి. దొంగ చేతికి తాళమిచ్చి సొమ్ము పోవొద్దంటే ఊరుకుంటారా? ఇది కూడా అంతే..ప్రజలను పీడిరచకుండా, వేదించకుండా, సేవకులైన పని చేయాలని ఏ పాలకులు ఉద్యోగులను బెదించడం లేదు. అందులో చిత్త శుద్ది వుండడం లేదు. ఎందుకంటే మేం తిట్టినట్లు చేస్తాం..మీరు పడినట్లు నటించండి? అన్న దోరణితో సాగుతోంది. లేకుంటే అదికారులు ఇంత విచ్చలవిడిగా లంచాలు తీసుకుంటున్నారు? ఏ దైర్యంతో తీసుకుంటున్నారు. ప్రజల నుంచి చిన్న, చితకా పైనైనా సరే లక్షలకు లక్షలు వసూలు చేస్తున్నారు. అవి పైసాల..లేక పెంకాసులనుకుంటున్నారా? జీతాలు లక్షల్లోకి పెరిగిన తర్వాత ఉద్యోగులు లంచాల రేట్లు కూడా పెంచేశారు. వెలల్లో వున్నప్పుడు వేలల్లో వసూలుచేసేవారు. ఇప్పుడు సగటు ఏ ఉద్యోగికి లక్షకు తక్కువ జీతం లేదు. అందుకే లంచాలు కూడా లక్షలు వసూలు చేస్తున్నారు. జీతం నెలకొక్కొసారి తీసుకంటే, లంచం రోజూ తీసుకుంటున్నారు. నెలలోనే కోట్లు కూడబెట్టుకుంటున్నారు. ముఖ్యంగా కొన్నిశాఖల్లోని ఉన్నతాధికారులు మాత్రం వాళ్ల సంపాదన వాళ్లెకే తెలియనంతగా పోయింది. వాళ్లేం వ్యాపారం చేసి సంపాదించడం లేదు. కష్టం చేసి చెమటోడ్చడం లేదు. ఏసిలో కూర్చోని సంతకం చేసేందుకు లక్షలు తీసుకుంటున్నారు. ఇంత అన్యాయమా? రైతులను వేదించుకుతింటున్నారు. వేపుకు తింటున్నారు. పీడిరచుకుతింటున్నారు. ఆఖరుకు చచ్చిన రైతు పిండాకుడు కూడా తినడానికి వెనుకాడడంలేదు. ఇంతగా ఉద్యోగులు దిగజారి పోవడం తెలంగాణ సమాజపు దౌర్భాగ్యం. అయినా ఈ రోజు భూముల ధరలు పెరిగాయంటే అది ఉద్యోగుల పుణ్యం కాదు. కష్టం వచ్చినా సరే అప్పులు చేసుకున్నారు. కష్టపడి రూపాయి,రూపాయి సంపాదించి తీర్చుకున్నారు. కాని భూములు అమ్ముకోలేదు. అలా దాచుకున్నదే భూమి. ఆ భూమి నుంచి బుక్కెడు బువ్వ రాని సమయంలో మట్టి తిని రైతులు బతికారు. మంచినీళ్లతో కడుపు నింపుకున్నారు. ఆకలి దహించివేయకుండా నడుము చుట్టూ కడుపును గుడ్డతో బిగించి కట్టుకున్నారు. కడుపు డొక్కలీడ్చుకుపోయినా సరే ఎవరి వద్ద చేయి చాచకుండా బతికారు. అడుక్కొని బతకడానికి ఆత్మాభిమానం అడ్డొచ్చి, అడ్డకూలీలుగా నైనా బతికారే గాని, ఎక్కడా చేయి చూపి బతకలేదు. పల్లెను వదిలి పొట్ట చేత పట్టుకొని, పట్నం వచ్చి ఎంతో మంది రైతులు హోటళ్లలో ఎంగిలి గ్లాసులు కడిగారు. ప్లేట్లు తోమారు. పల్లెలో తలబిరుసుతో బతికిన రైతు తల దించుకొని పని చేశాడు. తలెత్తి చూడకుండా కన్నీటిని మింగుతూ కాలం గడిపారు. భూమి తల్లిని నమ్ముకొని బతికారు. ఇల్లూ, వాకిలి వదిలేసి, ముసలి, ముకతకు ఇంటి కావాలి పెట్టి పొట్ట చేత పట్టుకొని వలసలు పోయారు. కంటికి నిద్రలేని రాత్రులు గడిపారు. బతికుండగా మళ్లీ పల్లెను చూస్తామా? అని దిగులుతో దిన దిన గండంగా బతికారు. కాలం కలిసి వచ్చింది. తెలంగాణ వచ్చింది. భూముల ధర వచ్చింది. సాగుకు నీరొచ్చింది. రైతులో మళ్లీ ఆశ చిగురించింది. వలస బతుకులకు ఓదార్పు దొరికింది. వలస జనమంతా పల్లెకు చేరింది. అయితే భూముల ధరలు పెరిగింది అదికారులకు లంచాలిచ్చేందుకు అన్నట్లుగా తయారైంది. తమ భూములను తమ పిల్లల పేరు మీద మార్చాలన్నా లక్షలు లంచాలివ్వాల్సిందే. అమ్ముకోవాలన్నా లంచమే.కొనుక్కొవాలన్నా లంచమే. అధికారులు తప్పులు చేసి, సరిదిద్దాలనుకున్నా లంచమే..పల్లె పట్నం అనే తేడా లేదు. ఎక్కడ విన్నా గోవింద నామం లెక్క లంచం..లంచం అనే మాట వినిపిస్తోంది. వినీ వినీ జనానికి విసుగొస్తోంది. అధికారులకు మాత్రం మరింత బలుపొస్తోంది. తెలంగాణ వచ్చిన తర్వాత ఉద్యోగులకు కూడా విపరీతంగా జీతాలు పెరిగాయి. దేశంలో ఏ రాష్ట్రంలో లేనంత జీతాలు తెలంగాణలో వున్నాయి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానమైన జీతాలున్నాయని తెలుస్తోంది. పైగా ప్రమోషన్లు కూడా వచ్చాయి. ఇంకే కావాలి. ఇంకా ఇంకా కావాలి. లంచాలు తీసుకునే బుద్ది మారడం లేదు. ఉద్యోగుల దుర్భుద్ది మారడం లేదు. లంచాలు తీసుకొని దొరుకుతామన్న భయం లేదు. దొరికిన వారిలో కూడా ఆ భయం కళ్లల్లో కనిపించడం లేదు. లంచం తీసుకున్న ఓ అధికారి ఇటీవల సోఫాలో కూర్చొని ముసిముసి నవ్వు నవ్వుతున్నాడు. ఏసిబికి పట్టుబడిన భయం ఒక్క శాతం కూడా లేదు. ఏం చేస్తారు? మహా అయితే కోర్టుకు తీసుకెళ్తారు. నాలుగు రోజులు జైలులో పెడతారు. ఎందుకంటే ఆ జైలులో కూడా క్రిమినల్స్ గా చూడరు. గౌరవంగా చూస్తారు. కాకపోతే నాలుగు రోజులు ఇంటికి దూరమౌతాము. తర్వాత బైటకొస్తాం…కొంత కాలం హాయగా కాలం గడుపుతాం..మళ్లీ కొలువు తెచ్చుకుంటామన్న ధీమా అవినీతి అదికారులలో పెరిగిపోయింది. సహజంగా ఎవరికైనా సరే ఉద్యోగానికి ముందు ఎలాంటి కేసులు లేవని సర్టిఫికెట్లు సమర్పించుకోవాలి. పోలీసు కేసులుంటే ఉద్యోగం రాదు. కాని ఉద్యోగం చేస్తూ ఎన్ని సార్లు పట్టిబడినా ఉద్యోగం పోదు. పోలీసులు కేసులైనా లెక్కలేదు. జైలు జీవితం అనుభవించినా కొలువు మళ్లీ రాకుండాపోదు. ఇదెక్కడి న్యాయమో అర్దం కాని పరిస్దితి. అవినీతి నిరోధక శాఖ అధికారులుకు రెడ్ హాండెడ్గా దొరికినా సరే , తమను అన్యాయంగా ఇరికించారని వాదించుకుంటున్నారు. మళ్లీ కొలువులు తెచ్చుకుంటున్నారు. అంటే ఇక్కడ మళ్లీ ఏసిబితో ప్రమేయం లేకుండా సంబందిత శాఖల పెద్దల చేత జరిగే విచారణలో అబద్దాలు రాసుకుంటున్నారు. న్యాయస్దానాలను తప్పుదోవ పట్టిస్తున్నారు. అదికారులను లంచాలతో కొడుతున్నారు. కొలువులు తెచ్చుకుంటున్నారు. అలా ఉద్యోగం పోతోంది. ఇలా వస్తోంది. ఇక అవినీతి ఉద్యోగులకు భయం ఎందుకంటుంది. తప్పు చేసిన దొరికినా చర్యలు లేనప్పుడు ఇక పట్టుకోవడం ఎందుకు? మళ్లీ వదిలేయడం ఎందుకు? అసలు ఎందుకు పట్టుకుంటున్నట్లు. ఎందుకు వదిలేస్తున్నట్లు? ఈ ఏడాది ఎంత లేదన్నా కనీసం ఓ వెయ్యి మందికి తక్కువ కాకుండా లంచాలు తీసుకొని దొరికి వుంటారు. వాళ్లలో కొలువులు పోయిన వారు ఎంత మంది వున్నారు. మళ్లీ కొలువుల్లో చేరిన వారు మాత్రం వున్నారు. అసలు ఈ మధ్య రోజుకు ముగ్గురు నుంచి నలుగురు, ఐదురుగు పట్టుబడుతున్నారు. ఇలాంటి అవినీతి అదికారుల మూలంగా సామాన్యుడు తన జీవితంలో సొంతిళ్లు కట్టుకోలేదు. వంద జగాల స్థలం కొనుగోలు చేసుకోలేడు. అప్పులు చేసి, చిన్న గుడిసె కట్టుకోవాలన్నా దాని పర్మిషన్కు లక్షలు ఇస్తే గాని పర్మిషన్ రానంత దౌర్భాగ్యపు రోజులు దాపురించాయి. పెళ్లిళ్లు పేరంటాలకు ఎవరైనా బ్యాండు మేళం మాట్లాడుకుంటారు. ఉద్యోగులు,పోలీసుల కుటుంబాలలో పెళ్లి, పేరంటాలైనా వారిని మాట్లాడుకుంటారు. అలాంటి బ్యాండు మేళం వారి వల్ల పర్యావరన నష్టం జరగుతుందని పోలీసులు వాయిద్యాలు తీసుకెళ్లిన ఘటనలో వాటిని వదిలేయాలంటే లంచం అడిగిన దౌర్భాగ్యులు కూడా వున్నారంటే ఈ సమాజం బాగుపడుతుందా? ఏడాదిలో ఇతర సమయాల్లో కూలీ పనులు చేసుకంటూ, పెళ్లిళ్ల సీజన్లో బ్యాండు వాయిస్తూ పొట్ట పోసుకునే వారి నుంచి కూడా వేలకు వేలు లంచాలు తీసుకున్నారంటే వాళ్లను ఉద్యోగులంటారా? రాక్షసులంటారా? ఇంతగా లంచం కోసం దిగజారి బతకాలా? ఒక్కసారి ఆలోచించండి.