– లింగన్నపేట నుండి కోరుట్లపేట వరకు నిర్మించిన రోడ్డును ప్రారంభించిన కేంద్ర మంత్రి బండి సంజయ్
– గంభీరావు పేట నుండి మల్లారెడ్డిపేట వరకు రూ.8.30 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మించిన బ్రిడ్జిని ప్రారంభం
– కాంగ్రెస్ సైతం బీఆర్ఎస్ బాటలోనే నడుస్తోందన్న బండి సంజయ్
– తెలంగాణ సొమ్మును ఇతర రాష్ర్టాల్లో ఎన్నికలకు ఖర్చు చేస్తున్నారని మండిపాటు
– హామీల అమలులో మొండి చేయి చూపుతున్నారని ధ్వజం
సిరిసిల్ల(నేటి ధాత్రి):
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఈరోజు సిరిసిల్ల జిల్లాలోని గంభీరావుపేట మండలంలో రూ.23 కోట్ల కేంద్ర నిధులతో అభివ్రుద్ధి పనులను శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా లింగన్నపేట నుండి కోరుట్లపేట వరకు నిర్మించిన రోడ్డును బండి సంజయ్ ప్రారంభించారు. అట్లాగే గంభీరావుపేట నుండి మల్లారెడ్డిపేటకు వెళ్లే దారిలో రూ.8.30 కోట్ల కేంద్ర నిధులతో నూతనంగా నిర్మించిన బ్రిడ్జిని సైతం కేంద్ర మంత్రి చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా గంభీరావుపేట లోని ఎల్లమ్మ దేవాలయం వద్ద బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు. ఏమన్నారంటే…
గతంలో గంభీరావుపేట ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు లింగన్నపేట నుండి కోరుట్లపేట వరకు రూ.15 కోట్ల వ్యయంతో రోడ్డును నిర్మించాం. అట్లాగే గంభీరావు పేట నుండి మల్లారెడ్డిపేట వరకు రూ.8.30 కోట్ల వ్యయంతో నూతనంగా బ్రిడ్జిని నిర్మించాం. ఈరోజు వాటిని ప్రారంభించుకోవడం సంతోషంగా ఉంది.
గతంలోనూ కేంద్ర ప్రభుత్వం సిరిసిల్ల నియోజకవర్గ అభివ్రుద్దికి ఎన్నో నిధులిచ్చింది. అయితే నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం తమ సొమ్ముగా ప్రచారం చేసుకున్నాయి. రాజకీయ వైషమ్యాలతో గత ప్రభుత్వం కుట్రలు చేసింది.
ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా బీఆర్ఎస్ తోవలో నడుస్తోంది. రాజకీయ వైషమ్యాలు స్రుష్టించి అభివ్రుద్ధి జరగకుండా చేస్తోంది. కేంద్రంతో వైరం పెట్టుకుంటోంది. పేరు ప్రఖ్యాతుల కోసం మొండి పట్టుకు పోయి షో పొలిటిక్స్ చేస్తోంది. ఇది మంచి పద్దతి కాదు. మితిమీరి విమర్శలు చేసి తెలంగాణ ప్రజలకు అన్యాయం చేయొద్దని కోరుతున్నా.
తెలంగాణ సొమ్మును ఇతర రాష్ట్రాల ఎన్నికల కోసం ఖర్చు పెట్టడం ఏ మాత్రం మంచి పద్దతి కాదు. గతంలో కేసీఆర్ తెలంగాణ డబ్బును పంజాబ్, కర్నాటక రాష్ట్రాల్లో ఖర్చు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం సైతం తెలంగాణ సొమ్మును మహారాష్ట్ర ఎన్నికల్లో ఖర్చు చేసింది. ఇక్కడ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మొండి చేయి చూపింది.
మహారాష్ట్ర ప్రజలు వాస్తవాలు గమనించారు. కాంగ్రెస్ ను ఓడించి బీజేపీకి పట్టం కట్టారు. అక్కడ వార్ వన్ సైడ్ అయ్యింది. జార్ఘండ్ లో టఫ్ పైట్ నడుస్తోంది. ఇతర రాష్ట్రాల్లో జరిగిన ఉప ఎన్నికల్లోనూ బీజేపీ మెజారిటీ సీట్లు సాధించింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేసిన అభివ్రుద్ధి కార్యక్రమాలకు ప్రజలు ఆమోదం తెలిపారు. ప్రతి ఒక్క పార్టీ రాజకీయ వైషమ్యాలను పక్కనపెట్టి తెలంగాణ అభివ్రుద్ధికి సహకరించాలని కోరుతున్నానని అన్నారు. ఇట్టి కార్యక్రమంలో బిజెపి సిరిసిల్ల నియోజకవర్గ ఇంచార్జ్ రాణి రుద్రమ, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.