అటవీ ప్రాంతంలోకి ఎవరు వెళ్లకూడదని హెచ్చరిస్తున్న అటవీ అధికారులు
నీలగిరి ప్లాంటేషన్ వద్ద గుర్తించిన చిరుత పులి పాదముద్రలు
జైపూర్, నేటి ధాత్రి:
మంచిర్యాల జైపూర్ మండలం లోని కుందారం అటవీ ప్రాంతంలో చిరుత పులి సంచరిస్తోందని మంగళవారం రోజున అటవీ అభివృద్ధి సంస్థ మంచిర్యాల రేంజ్ ప్లాంటేషన్ సిబ్బంది తెలియజేశారు. ఈ సందర్భంగా ప్లాంటేషన్ మేనేజర్ సురేష్ కుమార్ మాట్లాడుతూ కుందారం సమీపంలోని అటవీ అభివృద్ధి సంస్థ (టి.ఎస్.ఎఫ్.డి.సి )నీలగిరి ప్లాంటేషన్ లో రెండు రోజుల కిందట సంచరించిన చిరుత పులి పాదముద్రలను గుర్తించామని చెప్పారు.కుందారం,నర్సింగాపూర్,మద్దులపల్లి,ఆరెపల్లి అటవీ ప్రాంత సమీప గ్రామాల నివాసితులు అడవిలోకి రావద్దని హెచ్చరించారు.చిరుత పులి సంచారాన్ని దృష్టిలో పెట్టుకొని రైతులు తమ పంట పొలాల రక్షణ చర్యల నిమిత్తం కరెంట్ తీగలు వాడవద్దని,చిరుత పులి కి హాని కలిగించే ప్రయత్నాలు ఎవరూ చేయవద్దని పేర్కొన్నారు. అటవీ ప్రాంతం లో చిరుత పులి సంచారం సహజమని,అది తన ఆవాసం, జీవనం కోసం వందల కిలోమీటర్లు తిరుగుతూ ఉంటుందని వివరించారు.ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని కోరుతూ ఆందోళన చెందవద్దని సూచించారు.ఈ నేపథ్యంలో అటవీ శాఖ అధికారులు,సిబ్బంది, అటవీ అభివృద్ధి సంస్థ (టి.ఎస్.ఎఫ్.డి.సి) అధికారులు, సిబ్బంది సమన్వయంతో చిరుత పులి సంచరిస్తున్న సమీప ప్రాంత ప్రజలకు అడవిలోకి వెళ్లకుండా అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు.