అడిగితే..చెప్పుతో కొడతారా?

https://epaper.netidhatri.com/

`మంత్రులు మాట్లాడాల్సిన మాటలేనా?

`పాలకులకు సంయమనం ముఖ్యం.

`అధికారంలో వున్నవారికి ఓపిక అవసరం.

`ప్రతిపక్షాల విధే ప్రశ్నించడం.

`సమాధానం చెప్పడం పాలకుల కర్తవ్యం.

`ప్రతిపక్షమంటేనే ప్రజా గొంతుక.

`పాలకులను నిలదీయడమే దాని బాధ్యత.

హైదరబాద్‌,నేటిధాత్రి:

నోరు మంచిదైతే ఊరు మంచిదౌతుందంటారు. ఏది జారినా ఫరవా లేదు కాని, నోరు జారకూడదని పెద్దలు ఏనాడు చెప్పారు. మాట పొదుపు మనిషికి గొప్ప కీర్తిని అందిస్తుంది. అందమైన మాట ఎంతో మేలు చేస్తుంది. ఇలాంటి మంచి విషయాలు మనకు అనేకం వున్నాయి. అయినా ఆవేశం అప్పుడప్పుడు అవసరం లేకున్నా కట్టలు తెంచుకుంటుంది. నోటి నుంచి ఏదో ఒకటి వచ్చేలా చేస్తుంది. వివాదాలు చుట్టుముట్టేలా చేస్తుంది. విమర్శల పాలు చేస్తుంది. నాయకులైతే ప్రజలకు దూరం చేస్తుంది. మాట మాట్లాడాలే గాని మాట తూల కూడదని నాయకులు నేర్చుకోవాలి. అయినా అప్పుడప్పుడు నాయకులు మాట జారుతూనే వుంటారు.. ఇదెక్కడి సంప్రదాయం. రాజకీయాల్లో రాను రాను ఇదేం వింత కోణం..మార్పు కావాలి…మార్పు కావాలని ప్రజలకు చెప్పిన కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చేస్తున్నదేమిటి? గత ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందని, ప్రశ్నించే గొంతుకలను అణి వేస్తుందని చెప్పిన కాంగ్రెస్‌ నాయకులు ఆ మాటలు అప్పుడే మర్చిపోయారా? తెలంగాణలో ప్రజలకు తమ సమస్యలు చెప్పుకునే స్వేచ్ఛ కూడా లేదా? అని ప్రశ్నించిన కాంగ్రెస్‌ నాయకులు అధికారంలోకి రాగానే ఆ విషయం గుర్తు లేదా? అధికారంలోకి రాగానే అదే నాయకులకు ప్రశ్న చేదౌతుందా? రెండు నెలలు కాకముందే కోమమొస్తుందా? ప్రజలు ప్రభుత్వాన్నేమీ గొంతెమ్మ కోరికలు కోరడం లేదు. పరిధి దాటి విమర్శించడం లేదు. అసలు ప్రభుత్వాన్ని ఇంత వరకు ఏమీ అనడం లేదు.
ఏటా రైతులకు ప్రభుత్వం నుంచి అందే రైతు బుంధు ఎప్పుడు వస్తుందని మాత్రమే అడుగుతున్నారు.
రైతు బంధు విషయంలో మంత్రులందరిదీ ఒకటే మాటైతే ఎవరూ అడిగేవారు కాదు. రైతుబంధు పడిరదని కొందరంటారు. పడుతోందని కొందరంటారు. వేస్తామని కొందరంటారు. నిజానికి చిన్న కతమతాలున్న రైతులకు రైతు బంధు వేస్తున్నారన్న సమచారం వుంది. కాకపోతే రైతు బంధు ఎప్పుడో పడిరదని వార్తలు కూడా ప్రజలను అయోమయానికి గురి చేస్తున్నాయి. మాకెందుకు రాలేదన్న ఆందోళన చాలా మందిలో వ్యక్తమౌతోంది. దాంతో మాకు రాలేదు, మాకు రాలేదన్న మాటలే ఎక్కువగా వినిపించడంతో ప్రశ్న మొదలౌతోంది. ఇది తప్పెలా అవుతుంది. తాజాగా ఎకరంపైగా సాగు భూమి వున్న రైతులకు రైతు బంధు రావడం లేదన్న ప్రచారం సాగుతోంది. అది నిజమో? కాదో వివరణ ఇవ్వాల్సిన బాద్యత ప్రభుత్వానికి వుంది. రైతు బంధు అనేది ఏ ఒక్కరి వ్యక్తిగత సమస్య కాదు. తెలంగాణలోని రైతులందరి సమస్య. దాని కోసం ఒకటికి పది సార్లు మంత్రులు సమాధానాలు చెప్పాల్సిన అవసరం వుంది. రైతులకు భరోసా కల్పించాల్సిన బాధ్యత వారిపై వుంది. అయినా రైతు బంధు రావడం లేదని ఎవరైనా ప్రశ్నిస్తే విడతల వారిగా అందుతోందనో, వాయిదాల పద్దతిలో వస్తుందన్న విషయం సున్నితంగా చెబితే సరిపోతుంది. ఆని రైతు బంధు రావడం లేదని ఎవరంటే వారిని చెప్పుతో కొడతామన్నంత అర్ధమొచ్చెలా ఆవేపడాల్సిన పనిలేదు.
పాలకులకు ఎంతో ఓపిక వుండాలి.
ఎన్నుకున్న ప్రజలకు ఎంతో సునాయాసంగా సమాధానం చెప్పాలి. మేం పాలకులం కాదు..సేవ కులం అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పి యాభై రోజులు కాలేదు. అప్పుడే మంత్రులు ఆవేశపడితే ఎలా? ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పిన మాటకు అర్ధమేముంటుంది. కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు, తెలంగాణ ఉద్యమం కోసం మంత్రి పదవి త్యాగం చేసిన మంత్రి వెంకటరెడ్డి. అలాంటి వారి నుంచి ఇలాంటి మాటలు రావడం ప్రజలు జీర్ణించుకోలేరు. ఎందుకంటే వెంకటరెడ్డి ముఖ్యమంత్రి కావలనుకుంటున్న నాయకుడు. అవకాశం వస్తే భవిష్యత్తులో ముఖ్యమంత్రి అయ్యేందుకు అన్ని అర్హతలు వున్న నాయకుడు. ముఖ్యమంత్రి స్ధాయి వున్న మంత్రి కోమటి రెడ్డి వెంకటరెడ్డి నుంచి ఎంతో ఓర్పుతో కూడిన సమాధానాలు కోరుకుంటారు. అలాంటి నాయకుడు రైతు బంధు విషయంలో మరింత సంయమనంతో సమాధాన చెబితే ఎంతో బాగుండేంది. కోమటిరెడ్డి వెంటకరెడ్డి చేసిన వ్యాఖ్యలపై తెలంగాణలో తీవ్ర దుమారం రేగుతోంది. రైతులంటే అంత చులకనైపోయారా? అన్న ప్రశ్న తలెత్తుతోంది. తెలంగాణ వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. రచ్చ రచ్చగా ఈ వ్యాఖ్యలు మారుతున్నాయి.
ఎందుకంటే తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావడానికి ప్రధాన కారణం రైతులు.
ఆ రైతుల మనసు నొప్పించకుండా మసలుకోవాల్సిన అవసరం ఎంతైనా వుంది. ఎందుకంటే ఇన్ని రోజులు తెలంగాణ అంటే కేవలం హైదరాబాద్‌ అభివృద్ది అనుకున్నారు. కాని తెలంగాణ గ్రామీణ సమాజం, ప్రజలు గ్రామీణ బారతం బాగుపడాలని కోరుకుంటోంది. అందుకే కాంగ్రెస్‌కు తెలంగాణ పల్లె ఓటేసింది. ఇది కాంగ్రెస్‌ నేతలు ఇప్పటికైనా గమనించాలి. మాట్లాడే ముందు కాస్త ముందూ వెనక ఆలోచించుకొని మాట్లాడాలి. రైతు బంధు పడలేదంటే చెప్పుతో కొడతారా? మంత్రులు మాట్లాడాల్సిన మాటలేనా? పాలకులకు ఎంతో సంయమనం వుండాలి. ప్రజలు ప్రశ్నించకుండా ఎవరు ప్రశ్నిస్తారు? ప్రజల పక్షాన ప్రశ్నించేవారిని ఎంత మందిని కొడతారు? అధికారంలో వున్నవారికి ఓపిక ఎంతో అవసరం. స్పందించాలనుకుంటే స్పందించండి. లేదంటే వివరణ ఇవ్వండి. ఒకటికి పది సార్లైనా వివరణ ఇవ్వడం మంత్రులుగా, పాలకులుగా, నాయకులుగా వారి బాధ్యత. అధికారంలో వుండేవారికి భూదేవికి వున్నంత సహనం వుండాలి. ఓపిక ఎంతో అవసరం. ప్రతి పక్షాలున్నదే ప్రశ్నించేందుకు? ప్రజలు ప్రతిపక్ష స్ధానమిచ్చిందే ప్రభుత్వాన్ని ఎండగట్టేందుకు? ప్రభుత్వం ఇచ్చిన మాట తప్పితే నిలదీసేందుకు. సమాధానాలు చెప్పాల్సిన బాద్యత పాలకులది. ప్రతిపక్షమంటేనే ప్రజా గొంతుక. దాన్ని నొక్కడం సరైంది కాదు. సరైన సమాధానం చెప్పి ప్రతిపక్షాల నోరు మూయించండి. ఇచ్చిన మాట నిలబెట్టుకొని ప్రతిపక్షాలకు ప్రశ్న లేకుండా చేయండి. పాలకులను నిలదీయాల్సిన కర్తవ్యం ప్రతిపక్షాలది. దాని బాధ్యతను వాళ్లు సరిగ్గానే నిర్వర్తిస్తున్నారు. మరి ప్రభుత్వం కూడా తన మాట తాను నిలబెట్టుకోవాలి. ప్రజల నుంచే గాని, ప్రతిపక్షాల నుంచి గాని ప్రశ్న లేకుండా చూసుకోవాలి. వంద రోజుల సమయం అంటూ కాల యాపన చేయకుండా వీలైనంత తొందరగా వాటిని అమలు చేయాలి. ఎందుకంటే ఏ మాత్రం ఏమరపాటు జరిగినా ఎన్నికల కోడ్‌ వస్తుంది. అప్పుడు కోడ్‌ను బూచిగా చూపి తప్పించుకునేందుకు వీలౌతుందని అనుకుంటే తప్పుడు సంకేతాలే వెళ్తాయి. అప్పుడు ఎవరూ చెప్పాల్సిన అవరసం లేదు. ప్రతపక్షాలు ప్రశ్నించాల్సిన అవసరం రాదు. ప్రజలే ఆలోచిస్తారు. కోడ్‌ దాకా ప్రభుత్వం కాలయాపన చేసిందని గ్రహిస్తారు. అప్పుడు ఎన్నికల ఫలితాలు ఎవరికి అనుకూలంగా తీర్పునిస్తారో కాంగ్రెస్‌ నేతలు, ప్రభుత్వపెద్దలు ఆలోచిస్తే చాలు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!