గద్దర్, జహీరుద్దీన్ లు
ప్రెస్ క్లబ్ ఆద్వర్యంలో సంస్మరణ సభ
మందమర్రి, నేటిధాత్రి:-
ప్రజ గాయకుడు, ప్రజా యుద్ధ నౌక గద్దర్, సియాసత్ ఉర్దూ దినపత్రిక ఎడిటర్, తెలంగాణ భారత్ బచావో చైర్మన్ జహీరుద్దీన్ ఆలీ ఖాన్ లు భౌతికంగా దూరం అయినప్పటికీ ప్రజల మదిలో పాట, ఆట, రచనలు, పోరాటం రూపంలో చిరంజీవులుగా ఎల్లప్పుడూ నిలిచి ఉంటారని మందమర్రి ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు చందర్, పలువురు పట్టణ ప్రముఖులు, వివిధ రాజకీయ, కుల, ప్రజా, కార్మిక, సంఘాల నాయకులు తెలిపారు. శుక్రవారం సాయంత్రం పట్టణంలోని సిఈఆర్ క్లబ్ నందు మందమర్రి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో గద్దర్, జహీరుద్దీన్ ఆలీ ఖాన్ ల సంస్మరణ సభను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రెస్ క్లబ్ సభ్యులతో పాటు పట్టణ ప్రముఖులు హాజరై గద్దర్, జహీరుద్దీన్ అలీ ఖాన్ లకు పుష్పాలతో ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పలువురు కళాకారులు గద్దర్ తో తమకున్న పరిచయాన్ని, అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ, తమ ఆటపాటలతో వారికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ, ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడిన మహనీయులను కోల్పోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా ఉద్యమకారులుగా ప్రజా సమస్యలపై ప్రజలను చైతన్యమంతులను చేయడంలో వారి పాత్ర మరువలేనిదని, వారి లోటును సమాజానికి ఎవరు తీర్చలేరన్నారు. వారి పోరాట స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ ప్రజా సమస్యలపై పోరాటం కొనసాగించాలని పోరాటంలో వారి ఎల్లప్పుడూ సజీవంగా ఉంటారని, అవే వారికి మనమిచ్చే నిజమైన నివాళులని తెలిపారు. ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు చందర్ మాట్లాడుతూ, సమాజ హితం కోసం అహర్నిశలు కృషి చేసిన ప్రజా ఉద్యమకారులను స్మరిస్తూ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో సంస్మరణ సభ నిర్వహించడం జరిగిందన్నారు. దీనికి అన్ని విధాల సహకరించి, విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు.