సుసంపన్నం…సుభిక్షం…కేసిఆర్‌ తోనే సాధ్యం.

`సమస్యలు తెలిసినప్పుడే పరిష్కారం.

`సామాన్యులకు అండగా వుండడమే నాయకత్వం.

`పేదల జీవితాలలో వెలుగులు నింపడమే పరమార్ధం.

`ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోవడమే సేవాభావం.

`దేశమే వసుదైక కుటుంబం. 

`ప్రజల జీవన ప్రమాణాలు పెరగాలి.

`ఆర్థిక అసమానతలు తగ్గాలి.

`సమసమాజ స్థాపన జరగాలి.

`సంతులిత ప్రగతి కావాలి

.`అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతి నెరవేరాలి.

`ఇన్నేళ్లు నిరాదరణకు గురైన సమాజంలో చైతన్యం తీసుకురావాలని.

`ముఖ్యంగా స్వార్థ రాజకీయాలను తరిమికొట్టాలి.

`కేసిఆర్‌ నాయకత్వంలో దేశం పురోగమించాలి.

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

సుసంపన్నమైన భారతావణి నిర్మాణం జరగాలి. సుభిక్షమైన భవిష్యావని నిర్మింపబడాలి. పేదరికం పారద్రోలాలి. ఆకలి లేని వ్యవస్థ సృష్టించాలి. పౌష్టికాహార లోపం లేని సమాజం కావాలి. అన్ని వర్గాల అభ్యున్నతి కాంక్షలు నెరవేరాలి. సమసమాజ నిర్మాణం జరగాలి. ఇదీ సగటు భారతీయుడు కలలు గనేది. సగటు వ్యక్తి ఆలోచనలు వ్యక్తం చేసేది. తరతమ బేధాలు రూపుమాసిపోవాలి. అందరం ఒక్కటే అనే భావన చిగురించాలి. అందుకు అర్థిక అసమానతలు తగ్గాలి. పాలకులు అన్ని వర్గాల ప్రజల జీవితాలలో వెలుగులు నింపాలి. ఇది కేసిఆర్‌ లక్ష్యం. 

   తెలంగాణ ప్రగతి ఆదర్శంగా దేశమంతా వెలుగులు నిండాలి.

 నాయకత్వంలో చిత్తశుద్ధి వుంటే, దేశ గతి మారుతుందనడంలో సందేహం లేదు. నాయకుడు సమస్యలు చూసి చలించినప్పుడే పరిష్కారం అవుతాయి. నాయకుడికి ప్రజాక్షేత్రం తెలియాలి. ప్రజల నుంచి నాయకుడు ఉద్భవించాలి. అవకాశాలు కలిసివచ్చి నాయకుడైన వారికి ప్రజా సమస్యలు తెలియవు. ప్రజల బాధలు తెలియవు. ప్రజల కష్టాలు తెలియవు. వారు పడుతున్న వేధన చూడరు. ఎంత సేపు వందిమాగధులు చెప్పే విషయాలే అనుసరిస్తుంటారు. అనుచరులు చేసే భజనలు ఆలకిస్తుంటారు. ఇప్పుడు కేంద్రంలో అదే జరుగుతోందనేది మెజారిటీ ప్రజల అభిప్రాయం. బిజేపి కేంద్రంలో అధికారంలోకి వచ్చి నోట్ల రద్దు సమయంలో ప్రజలను ప్రధాని మోడీ చెప్పిన మాట ఏమిటి? ప్రజలు అనుభవించిన బాధలేమిటి? 1975 లో వచ్చిన జనతా ప్రభుత్వం కూడా అప్పటి పెద్ద నోట్లు రద్దు చేసింది. నాటి ప్రధాని మురార్జీ దేశాయి కూడా ఏదో జరుగుతుందనుకున్నాడు. కానీ ఆర్థిక వ్యవస్థ దివాలా తీసింది. పర్యవసానంగా ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా ఇందిరాగాంధీని ఓడిరచిన ప్రజలే మళ్ళీ ఆమె నాయకత్వాన్ని కోరుకున్నారు. అప్పుడు పెద్ద నోట్లు ఎక్కువగా సంపన్నుల చేతిలోనే వుండేవి. కానీ ఈసారి సామాన్యుల చేతిలోనూ నిత్యం కనిపించే నోట్ల రద్దు మూలంగా దేశం మొత్తం ఒక్కసారిగా అతలాకుతలమైంది. అయినా ప్రజలు భరించారు. దేశంలో నల్లదనం లేకుండా పోతుందనుకున్నారు. విదేశాలలో వున్న నల్లదనం తేవొచ్చన్నారు. కానీ నోట్ల రద్దు వల్ల ఇబ్బంది పడిన సంపన్నుడు ఒక్కడు కూడా లేడు. సామాన్యులే కష్టాలు పడ్డారు. నోట్ల రద్దు కష్టాలనుంచి ఇప్పటికీ సామాన్యులు బైటపడలేదంటే అతిశయోక్తి కాదు. ఇక దేశం మొత్తం ఒకటే పన్ను విధానం అంటే సామాన్యులు ఎంతో సంతోషించారు. అర్థరాత్రి వేళ పార్లమెంటు సెంట్రల్‌ హాల్‌ ముస్తాబు చేసి, జిఎస్టీ అమలు ప్రకటిస్తే దేశంలో చీకట్లు తొలగిపోతాయనుకున్నారు. అర్థరాత్రి మరో స్వతంత్రం అని భావించారు. దానిని గొప్పగా బిజేపి నేతలు ఊదరగొట్టారు. ప్రధాని మోడీ సైతం దేశ చరిత్రలో ఒక సువర్ణాధ్యాయం అన్నాడు. ఏమైంది.. ప్రజల జీవితాలను నేలనాకించాడు. సామాన్యడు చతికిల పడ్డాడు. విలవిలలాడుతున్నాడు. ధరలు విపరీతంగా పెరిగాయి. చిన్న చిన్న పరిశ్రమలు మూతపడ్డాయి. నోట్ల రద్దుతో విదేశాలలో నల్లదనం తిరిగివస్తుందని నమ్మించినట్లే, జిఎస్టీ పేదలకు మేలు జరుగుతుందన్నారు. పేదవారి కలలు చెరిపేశారు. అశలు కూల్చేశారు. ఉపాధి లేకుండా చేశారు. బతుకు మీద భరోసా లేకుండా చేశారు. భవితవ్యం శూన్యం చేశారు. పన్ను ఎగవేత దారులకు చుక్కలు కనిపిస్తాయని ప్రచారం చేశారు. ప్రజలకు ఇక మంచి రోజులొచ్చినట్లే అన్నారు. పేదల జీవితాలు తలకిందులు చేశారు. ఇదీ ప్రజల మధ్య లేని నాయకులు తీసుకున్న నిర్ణయాల పర్యవసానం.

అదే ప్రజల నాయకుడు, ప్రజల నుంచి ఉద్భవించిన నాయకుడి పాలన తెలంగాణ లా వుంటుంది. 

ఆ నాయకత్వం కేసిఆర్‌ లా సేవనందిస్తుంది. పేదల రాజ్యం నిర్మాణమౌతుంది. సామాన్యులకు అండగా వుండడమే అసలైన నాయకత్వం. అది ఈ తరంలో కేసిఆర్‌ సొంతం. అసలు సాధ్యం కాదనుకున్న తెలంగాణ సాధించాడు. మహా నాయకుడుగా కీర్తికెక్కాడు. గతంలో ఎంతో మంది చేతులెత్తేసిన తెలంగాణ ఉద్యమానికి మళ్ళీ ఊపిరులూదాడు. ఒక్కడుగా మొదలై లక్షలాది మంది కేసిఆర్‌ లను తయారు చేశారు. కోట్లాది గొంతుకలతో తెలంగాణ అనిపించారు. నినదించారు. ఎత్తిన పిడికిలి దించకుండా పద్నాలుగేళ్లు ఉద్యమ ప్రస్థానం సాగించాడు. పంతం పట్టి తెలంగాణ సాధించాడు. ఇదీ ప్రజల్లో నుంచి ఉద్భవించిన నాయకుడు చేసే పని. అదీ కేసిఆర్‌. 

తెలంగాణ వస్తే పేదల జీవితాలలో వెలుగు నిండుతాయని కేసిఆర్‌ కు తెలుసు. 

తెలంగాణ సాధించి తెలంగాణ నిధులను వినియోగించి అధ్భతాలను సృష్టించొచ్చని కేసిఆర్‌ కు తెలుసు. అందుకే పేదల జీవితాలలో వెలుగులు నింపాడు. అన్ని వర్గాల ప్రజల జీవితాలతో మార్పులు తీసుకొచ్చాడు. రేషన్‌ సీలింగ్‌ తొలగించి కుటుంబంలో ఎంత మంది వుంటే అంత మందికి బియ్యం ఇచ్చే ఏర్పాటు చేశాడు. ఇలా మొదలైన వెలుగుల విప్లవం కరంటు తెచ్చింది. ఉమ్మడి రాష్ట్రంలో చూద్దామన్నా కనిపించని కరంటు, తెలంగాణ లో పోతే చూద్దామన్నా అవకాశం లేదు. అసలు తెలంగాణ వచ్చినా ఇలాంటి రోజులు చూస్తామని ఎవరూ అనుకోలేదు. రాదన్న తెలంగాణను కేసిఆర్‌ ఎలా సాధించాడో, తెలంగాణ వస్తే చీకట్లే అన్న వారి కళ్లు బైర్లు కమ్మేలా చేశాడు. ఇదీ ఒక నాయకుడు చేసే పని. ఇదీ చరిత్రలో నిలిచిపోయే పని. ఇలాంటి పనులు చేస్తే ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు. ఆదర్శమూర్తులౌతారు. 

 దేశమే వసుదైక కుటుంబం. 

 ప్రజల జీవన ప్రమాణాలు పెరగాలి. ఆర్థిక అసమానతలు తగ్గాలి. సమసమాజ స్థాపన జరగాలి. సంతులిత ప్రగతి కావాలి. అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతి నెరవేరాలి. ఇన్నేళ్లు నిరాదరణకు గురైన సమాజంలో చైతన్యం తీసుకురావాలన్నదే కేసిఆర్‌ ఆశయం. ముఖ్యంగా దేశంలో పెరిగిన స్వార్థ రాజకీయాలను తరిమికొట్టాలి. కేసిఆర్‌ నాయకత్వంలో దేశం పురోగమించాలి. తెలంగాణ రాకముందు తొండలు గుడ్ల పెట్టే నేలలని సీమాంధ్రులు ఎగతాళి చేసేవారు. కానీ ఇప్పుడు ఆ భూములు కోట్లు పెట్టినా దొరకడం లేదు. కారణం ముఖ్యమంత్రి కేసిఆర్‌. ఆయన విజన్‌. ఆయన సాధించిన తెలంగాణ. నీళ్లు తెచ్చాడు. పొలాలు తడిపాడు. బంగారు పంటలు పండేలా చేశాడు. తెలంగాణ ను కోటి ఎకరాల మాగాణ చేశాడు. అదే పని ఇప్పుడు దేశమంతా చేయాలని సంకల్పిస్తున్నాడు. దేశమంతా సస్యశ్యామలం కావాలంటున్నాడు. బిఆర్‌ఎస్‌ కు ఒక్క అవకాశం ఇస్తే దేశంలో సాగు విప్లవం తెస్తానంటున్నాడు. రైతు కలలుగనే దేశ నిర్మాణం సాగించాలనుకుంటున్నాడు. రాజకీయాలలో సరికొత్త పంథాను అనుసరించి, అభివృద్ధి మేళవించి, అద్భుత ప్రగతిని అన్వయించి రైతు రాజ్యమే అసలైన రామ రాజ్యమని నిరూపించనున్నాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!