Govt Land Encroachment Row in Chevella
పేదలకు ఇచ్చిన ప్రభుత్వ ఇళ్ల స్థలాలు కబ్జా
* అప్పరెడ్డిగూడ సర్వే నెం.394,395,396,397,398లో
* ఎల్కగూడ సర్వే నెం. 581 లో
* ప్రభుత్వం కొనుగోలు చేసిచ్చిన పేదలకు ఇళ్ల స్థలాలు కబ్జా
• రికార్డుల్లో ప్రభుత్వ భూమి..ధరణిలో పాసుబుక్కులు
* అధికారుల నిర్లక్ష్యంతోనే ఇళ్ల స్థలాల్లో ముదిరిన వివాదం
• తమకు న్యాయం చేయాలంటూ చేవెళ్ల ఆర్డిఓను కలిసిన బాధితులు
నేటిధాత్రి, చేవెళ్ల :
1976,1987 లోని దేశంలో అధికారంలో ఉన్న ఇందిరా గాంధీ కాంగ్రెస్ ప్రభుత్వం దేశవ్యాప్తంగా పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చింది. ఇదే సమయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దళితులకు ఇళ్ల పట్టాల పంపిణి జరిగింది. ఆ సమయంలో రంగారెడ్డి జిల్లా, మొయినాబాద్ మండలంలో కొన్ని గ్రామాలు బాకారం, ఎనికేపల్లి, చిలుకూరు, ఎల్కగూడ, శ్రీరాంనగర్, కేతిరెడ్డిపల్లి, అప్పరెడ్డిగూడా, తోలుకట్ట, కనకమామిడి, గ్రామాలలో ప్రభుత్వ భూములు లేని గ్రామాలలో ప్రభుత్వమే పట్టాదారులనుండి కొంత భూమిని కొనుగోలు చేసి 121 గజాల స్థలం పేదలకు ఇళ్లపట్టాలు ఇచ్చింది. ఇది ఇలా ఉండగా ధరణి పోర్టల్ వచ్చాక రెవెన్యూ రికార్డుల్లో అధికారుల నిర్లక్ష్యంతో పట్టదారుల పేర్లు రావటం, పట్టా పాసుబుక్కులు మంజూరు కావడంతో దళితుల ఇళ్ల స్థలాలపై కన్నేసి ఈ భూమి తమదే అంటూ కబ్జాలకు పాల్పడుతున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇచ్చిన ఇళ్ల స్థలాలలను ఇప్పుడు కొందరు వ్యక్తులు కబ్జా చేసారని తమకు న్యాయం చెయ్యాలని అప్పరెడ్డిగూడా, ఎల్కగూడ గ్రామాల బాధితులు శనివారం చేవెళ్ళ ఆర్థివోను కలిసి వినతిపత్రం అందజేశారు.
* రికార్డుల్లో ప్రభుత్వ భూమి… ధరణిలో పట్టా బుక్కులు
అప్పరెడ్డిగూడ గ్రామ సర్వేనేంబర్ 394, 395,397,397, 398 లలో ప్రభుత్వం కొనుగోలు చేసి ఇచ్చిన ఇళ్ల స్థలాలు ప్రభుత్వ భూమిగా రికార్డుకేక్కిందని, కాని ధరణిలో మాత్రం పట్టాదారుల పేర్లు రావటం, పట్టా పాస్ బుక్కులు మాంజూరు కావటంతో వారు రికార్డుల్లో మా పేర్లు వచ్చాయి కనుక ఈ భూమి మాది అంటూ దౌర్జన్యంగా దళితులను బెదిరించి( సిమెంట్ కడీలు )హద్దురాళ్లు వేసుకున్నారని బాధితులు తెలిపారు. ఈ స్థలం మాది అన్నవారిపై బెదిరింపులు, దాడులకు దిగుతున్నారని బాధితులు ఆరోపించారు. ఇది ఇలా ఉండగా మొయినాబాద్ మండలం ఎల్కగూడ గ్రామ రెవెన్యూ సర్వే నెంబర్ 581లో 1987లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం పట్టాదారుల నుండి భూమి కొనుగోలు చేసి పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చింది. ధరణి వచ్చిన తర్వాత రెవెన్యూ అధికారుల తప్పిదంతో పట్టాదారుల పేర్లు మళ్ళీ రికార్డులో రావడంతో ఈ భూమి మాది అంటూ కొందరు వ్యక్తులు ప్రభుత్వ స్థలాలను కబ్జా చేశారని ఎల్కగూడా గ్రామస్తులు ఆర్డీవోను కలిసి వినతిపత్రం అందజేశారు. బాధితులు మాట్లాడుతూ..ధరణి పోర్టల్ వచ్చాక అధికారుల నిర్లక్ష్యం వల్ల భూ రికార్డుల్లో భారీగా అక్రమాలు జరిగాయని ఆరోపించారు. ఈ తప్పిదం వల్లే ఈ సమస్య వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం కొనుగోలు చేసి దళితులకు ఇచ్చిన ఇళ్ల స్థలాలను గ్రామకంఠం భూమిగా గుర్తించి, కబ్జాలకు పాల్పడ్డ వారి పై చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని బాధితులు ఆర్డీవో పార్టసింహారెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో బాధితులు గునుగుర్తి జంగయ్య, తోలికట్ట యాదయ్య, ఆలూరి అనిల్,గుడిపల్లి సుధాకర్ అప్పరెడ్డి గూడా గ్రామస్థులు తదితరులు ఉన్నారు.a
