Kyathanpalli Municipal Election Postponed Over Lack of Quorum
క్యాతనపల్లి మున్సిపాలిటీ కోరం లేక ఎన్నిక వాయిదా…
రామకృష్ణాపూర్, నేటిధాత్రి:
క్యాతనపల్లి మున్సిపాలిటీ లో చైర్ పర్సన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్ల ప్రమాణస్వీకారం కోరం లేక వాయిదా పడింది. నిర్దేశించిన సమయానికి మునిసిపాలిటీ కార్యాలయానికి 22 మంది కౌన్సిలర్లు ఎవరూ రాకపోవడంతో రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు కోరం వాయిదా వేస్తున్నట్లు మందమర్రి ఎమ్మార్వో, ఎన్నికల అధికారి సతీష్ కుమార్ తెలిపారు. నేడు మళ్లీ 11 గంటల ప్రాంతంలో కౌన్సిలర్ల ప్రమాణస్వీకారాలు ఉంటాయని, కౌన్సిలర్ లు అందరూ సకాలంలో విచ్చేసి ఎన్నికలకు హాజరు కావాల్సిందిగా ఎమ్మార్వో కోరారు. దీంతో మున్సిపాలిటీ కార్యాలయం ముందు బిఆర్ఎస్, సిపిఐ, కాంగ్రెస్ శ్రేణుల పోటా పోటీగా నినాదాలు చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. బిఆర్ఎస్,సిపిఐ కలిపి 14 కౌన్సిలర్ సీట్లు గెలుపొందగా కౌన్సిలర్లను ప్రమాణస్వీకారానికి తీసుకొస్తున్న సందర్భంలో కొంత ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. కౌన్సిలర్లతో పాటు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ రావడాన్ని మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ డిసిసి అధ్యక్షులు రఘునాథరెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారు. మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్, ఏఐటియుసి రాష్ట్ర అధ్యక్షులు సీతారామయ్య లను పోలీసులు అడ్డుకోవడంతో రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. మున్సిపాలిటీ కార్యాలయం ముందు కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

పరిస్థితులు అదుపుతప్పుతున్నాయని గమనించిన పోలీస్ యంత్రాంగం, ఎన్నికల అధికారులు మున్సిపాలిటీ కౌన్సిలర్ల ప్రమాణస్వీకారాన్ని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించడంతో మున్సిపాలిటీ కార్యాలయం ప్రాంతంలో అల్లరి సద్దుమణిగింది. నేడు ఎన్నిక జరిగే సమయంలో మళ్లీ పరిస్థితి ఉద్రిక్తంగా మారే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎన్నికల సంఘానికి, జిల్లా కలెక్టర్ కు సమాచారం అందిస్తామని ఎమ్మార్వో, ఎన్నికల అధికారి సతీష్ కుమార్ తెలిపారు.
