Peaceful Municipal Vote Counting in Mancherial
ప్రశాంతంగా మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ
జిల్లా ఎన్నికల అధికారి,కలెక్టర్ కుమార్ దీపక్
మంచిర్యాల,నేటి ధాత్రి:
2వ సాధారణ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ జిల్లాలో ప్రశాంతంగా జరిగిందని జిల్లా ఎన్నికల అధికారి,కలెక్టర్ కుమార్ దీపక్ ఒక ప్రకటనలో తెలిపారు.శుక్రవారం జిల్లాలోని క్యాతనపల్లి మున్సిపల్ పరిధిలోని సూపర్ బజార్ ఏరియాలో గల ఆర్.కె.సి.ఓ.ఎ. క్లబ్ లో ఏర్పాటు చేసిన ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని ప్రత్యేక అధికారి,మంచిర్యాల రాజస్వ మండల అధికారి శ్రీనివాస్ రావు, మున్సిపల్ కమిషనర్ మారుతి ప్రసాద్,బెల్లంపల్లి మున్సిపల్ పరిధిలోని బజార్ ఏరియాలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటుచేసిన ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని బెల్లంపల్లి ఎ.సి.పి. రవికుమార్,మున్సిపల్ కమిషనర్ సంపత్,చెన్నూర్ మున్సిపల్ పరిధిలోని చెన్నూర్ పట్టణంలో గల అటవీశాఖ కార్యాలయం వెనుక ఉన్న ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాటుచేసిన ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని జైపూర్ ఎ.సి.పి. వెంకటేశ్వర్లు, ప్రత్యేక అధికారి,జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి కిషన్, మున్సిపల్ కమిషనర్ మురళీకృష్ణ లతో కలిసి సందర్శించి ఓట్ల లెక్కింపు ప్రక్రియను పరిశీలించారు.ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి,కలెక్టర్ మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియను ప్రశాంత వాతావరణంలో ఒక ఇబ్బందిగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.ఓట్ల లెక్కింపు కొరకు మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల కౌంటింగ్ కొరకు అదనపు సిబ్బందితో కలిపి 66 మంది కౌంటింగ్ సూపర్వైజర్లు,132 మంది కౌంటింగ్ సహాయకులు, బెల్లంపల్లి మున్సిపాలిటీకి అదనపు సిబ్బందితో కలిపి 19 మంది కౌంటింగ్ సూపర్వైజర్లు,37 మంది కౌంటింగ్ సహాయకులు, చెన్నూరు మున్సిపాలిటీకి అదనపు సిబ్బందితో కలిపి 10 మంది కౌంటింగ్ సూపర్వైజర్లు,20 మంది కౌంటింగ్ సహాయకులు, క్యాతనపల్లి మున్సిపాలిటీకి అదనపు సిబ్బందితో కలిపి 24 మంది కౌంటింగ్ సూపర్వైజర్లు,48 మంది కౌంటింగ్ సహాయకులు, లక్షెట్టిపేట మున్సిపాలిటీకి అదనపు సిబ్బందితో కలిపి 9 మంది కౌంటింగ్ సూపర్వైజర్లు, 18 మంది కౌంటింగ్ సహాయకులను రాండమైజేషన్ ప్రక్రియ ద్వారా కేటాయించడం జరిగిందని తెలిపారు.ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో సజావుగా సాగేలా అధికారుల సమన్వయంతో చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
