` నివేదికిచ్చి 15 రోజులు కావస్తున్నా కానరాని చర్యలు
` కలెక్టర్ చుట్టూ తిరుగుతున్న కబ్జా కహాని
` అసలు రిపోర్టులో ఏముంది…?
` ఇప్పటికే గ్రామపంచాయితీ అనుమతి లేకుండా రిజిస్ట్రేషన్ చేసినట్లు నిర్ధారించిన పంచాయితీ అధికారులు
` భూమి విషయాన్ని బయటకు రాకుండా రెవెన్యూ అధికారుల దాగుడు మూతలు
` ఆర్టీవో అడిషనల్ కలెక్టర్పై , అడిషనల్ కలెక్టర్ కలెక్టర్పై దాటవేత
` కలెక్టర్ గారికి కాల్ చేస్తే సీసీ, గన్మెన్ల సమాధానాలు
` కలెక్టర్ సార్ ఫైల్ చూసేదెన్నడు , చర్యలు తీసుకునెదెన్నడు
బ్యూరో , నేటిధాత్రి : ప్రభుత్వ భూమిని కాజేశారు.. గ్రామ పంచాయితీలో అనుమతులు , రికార్డు లేకుండా రిజిస్ట్రేషన్ చేయించారు. ఫిర్యాధు చేసిన ఓ సామాజిక కార్యకర్తను హత్య చేయడానికి ప్రయత్నం చేశారు. అయినా అధికారులు తీరు ఏ మాత్రం మారలేదు. కేసు పెట్టడానికి పోలీసులు సతాయిస్తే ఇప్పుడు చర్యలు తీసుకోవడానికి అధికారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు ప్రవర్తిస్తున్నారు. అక్రమాలు చేసే వ్యక్తులకు మరోమారు చేయోద్దనేలా , చేయాలనుకునే వ్యక్తులకు హెచ్చరించేలా చర్యలు తీసుకోవాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం ప్రజల ఆగ్రహానికి కారణమౌతన్నది. సామాన్యులు తమ సొంత భూములను రిజిస్ట్రేషన్ చేయమని వెళ్లి అడిగితేనే చేయమని చెబుతున్న అధికారులు ఏకంగా ప్రభుత్వ భూములనే రిజిస్ట్రేషన్ చేయడం ఏంటనే కోణంలో ఉన్నతాధికారులు ఎందుకు విచారణ చేయడం లేదనే అనుమానాలు బలపడుతున్నాయి. ప్రజలు కష్టపడి సంపాదించిన భూములను పట్టా చేయమని ఎళ్ల తరబడి రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరిగినా కన్నెత్తి చూడని అధికారులు అక్రమార్కులు ఏకంగా ప్రభుత్వ భూములనే దోచుకుంటుంటే చూసిచూడనట్లు వ్యవహరించడం వారి విధి నిర్వహణకు అద్దం పడుతున్నదని స్థానికులు అంటున్నారు.
ములుగు జిల్లా కేంద్రంలో సంచలనం రేపిన బండారపల్లి భూ వివాదంపై వచ్చిన ఆరోపణలను నివృత్తి చేయడంలో అధికారులు అత్యంత నిర్లక్ష్యంగా వ్యహరిస్తున్నారు. ప్రభుత్వ భూమిని కబ్జా చేసి ఆక్రమంగా రిజిస్ట్రేషన్ చేశారని జిల్లా ఆర్డీవోకు , కలెక్టర్ కార్యాలయంలో మొగుళ్ల భద్రయ్య అనే సామాజిక కార్యకర్త ఫిర్యాధు చేశారు. ఫిర్యాధు చేసిన రోజు రాత్రే భద్రయ్యపై ఆయన ఇంటి ఆవరణలో ముగ్గురు వ్యక్తులు హత్య చేయడానికి కర్రలు, కత్తులతో దాడి చేశారు. చుట్టు పక్కల ఉన్న ప్రజలు గొడవ దగ్గరకు చేరడంతో దాడి చేయడానికి వచ్చిన సమ్మయ్య అనే వ్యక్తి మరో ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు అక్కడి నుండి పారిపోయారు. దీంతో ఈ విషయం తీవ్రంగా జిల్లా ప్రజల మధ్య చర్యకు దారి తీసింది . దీంతో స్పందించిన అధికారులు సంబంధిత గ్రామ పంచాయితీ , రెవెన్యూ అధికారులను విచారణ చేయాలని ఆదేశించారు. దీంతో స్థానిక అధికారులు 3 రోజుల్లో పూర్తి విచారణ చేసి నివేదిక తయారు చేసి ఉన్నతాధికారులకు పంపించారు. నివేదికలు అంది నెల రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు ఉన్నతాధికారులు ఉలుకు పలుకు లేకుండా ఎలాంటి చర్యలు తీసుకోకుండా చోద్యం చూస్తున్నారు. విచారణకు చేసినంత హడావిడి చర్యలు తీసుకోవడానికి ఎందుకు చూపట్లేదనేది ఇప్పుడు ప్రజలను మరింత గందరగోళానికి గురి చేస్తున్నది. అధికారులు కావాలనే నిర్లక్ష్యం చేస్తున్నారా..? లేక ఎవరైనా రాజకీయ నాయకులు తమ అనుచరులను , బాగా కావాల్సిన అధికారులకు కాపాడుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తూ అధికారుల చర్యలకు అడ్డుతగులుతున్నారా…? అనే అనుమానాలు ఇప్పుడు తలెత్తుతున్నాయి.
` కలెక్టర్ గారికి కాల్ చేస్తే సీసీ, గన్మెన్ల సమాధానాలు
ప్రజలకు ఎదైనా ఆపద వస్తే అందరికి అందుబాటులో ఉండాలని కలెక్టర్కు ప్రభుత్వం కేటాయించిన నంబర్ను అయన వాడడం లేదనే ఆ నంబర్కి కాల్ చేసేకత కలెక్టర్ సీసీనంటూ ఓ వ్యక్తి సమాధానం చెప్పకుండా సార్ బిజీగా ఉన్నారని మాత్రం చెప్ప కాల్ కట్ చేస్తున్నట్లు తెలిసింది. ఎలాగైనా మాట్లాడాలని ప్రయత్నించినా చివరకు గన్మన్ ఎత్తి సమాధానం చెప్తాడే తప్ప సామాన్యులకు మాత్రం కలెక్టర్ లైన్లోకి రావడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే విషయాన్ని స్వయంగా పరీక్షించడానికి నేటిధాత్రి పలుమార్లు ఓ వారం రోజులు ప్రయత్నించినప్పటికి గన్మెన్ , సీసీలు తప్ప కలెక్టర్ గారు మాత్రం నేరుగా లైన్లోకి రావడం లేదు. ఎదైనా విషయం చెప్పినా కలెక్టర్కి చెప్పి కాల్ చేయాస్తానని చెప్పడంతో ముగిసిన ఫోన్ తిరిగి రావడం లేదని నిర్ధారణ అయింది. ఇక కలెక్టర్ నిత్యం ప్రజా సేవలో ఉంటున్నామని చెప్తూనే కాల్ చేసే సామాన్యులకు అందుబాటులో లేకపోవడం ప్రజల్లో తీవ్ర ఆగ్రహానికి గురి చేస్తున్నది.