పి డి ఎస్ యు రాష్ట్ర 23వ మహాసభలను జయప్రదం చేయండి.
మహాసభల లోగో ఆవిష్కరించిన ప్రొఫెసర్ కాత్యాయని విద్మహే
హన్మకొండ:నేటిధాత్రి
డిసెంబర్ 10,11,12 తేదీల్లో జరిగే పి డి ఎస్ యు రాష్ట్ర 23వ మహాసభలను జయప్రదం చేయాలని గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ లో మహాసభ లోగోను ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన పి డి ఎస్ యు రాష్ట్ర మహాసభల ఆహ్వాన సంఘం అధ్యక్షులు, ప్రొఫెసర్ కాత్యాయని విద్మహే మాట్లాడుతూ చారిత్రాత్మక పోరాట వారసత్వం ఉన్న పి డి ఎస్ యు రాష్ట్ర మహాసభలు ఉద్యమాల కేంద్రం వరంగల్ జిల్లాలో నిర్వహించడం అభినందనీయమన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాల వల్ల విద్య పేదలకు మరింత దూరం అవుతుందన్నారు. భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు గడిచినా నేటికీ విద్యా వైద్యం ఉపాధి అవకాశాలు పేద బడుగు బలహీన వర్గాలకు అందకుండా ప్రభుత్వాలు తమ విధానాలను రూపొందించుకుంటున్నాయన్నారు. పాలకులు కార్పొరేట్, పెట్టుబడేదారులకు ఊడిగం చేసేందుకే ప్రభుత్వాలను నడుపుతున్నాయన్నారు. ప్రభుత్వ విద్యారంగం ధ్వంసం అవుతుందని అనేక పాఠశాలలు కళాశాలలు యూనివర్సిటీలు మూసివేత గురి అవ్వడమే దీనికి తార్కాణం అన్నారు. కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం దేశంలోనే ఉన్న చట్టాలను కార్పొరేట్ పెట్టుబడిదారులకు అనుకూలంగా మార్చారన్నారు. ఇప్పటికే ప్రభుత్వ రంగ సంస్థలు అన్నీ ప్రైవేటుపరం అయ్యాయని, విద్యా రంగాన్ని కూడా పూర్తిగా ప్రవేట్ పరం చేసేందుకు నూతన జాతీయ విద్యా విధానం 2020 తీసుకొచ్చిందన్నారు. దీంతో దేశంలోని ప్రతిష్టాత్మక యూనివర్సిటీలలో కోర్స్ ఫీజులు ఎగ్జామినేషన్ ఫీజులు పెరిగి ఆర్థిక భారంతో విద్యార్థులు ఉన్నత చదువులకు దూరం అవుతున్నారన్నారు. విద్యార్థుల మెదలను కలుషితం చేయడం కోసం పాఠ్యాంశాల్లో మూఢనమ్మకాలను, మతోన్మాదం ను చెప్పిస్తుందన్నారు. ఎన్సీఈఆర్టీ పాఠ్యాంశాల్లో గాంధీని చంపిన గాడ్సే పాఠాలను తీసివేయడం చరిత్ర వక్రీకరణలో భాగమే అన్నారు. ప్రపంచంలో వివిధ దేశాల్లో విద్యార్థులు యువకులు విద్యార్థి వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాటాలు నడుస్తున్నాయన్నారు. విద్యార్థుల పోరాటాలతో ఆఫ్ఘనిస్తాన్ బంగ్లాదేశ్ శ్రీలంక నేపాల్ లాంటి దేశాల్లో ప్రభుత్వాలే కూలిపోయాయని అన్నారు. అంతర్జాతీయ విద్యార్థి ఉద్యమాల స్ఫూర్తితో దేశం విద్యార్థులోకం పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. జార్జిరెడ్డి, జంపాల చంద్రశేఖర ప్రసాద్ శ్రీపాద శ్రీహరి రంగవల్లి కోలాశంకర్ చేరాలు లాంటి ఎందరో విద్యార్థి అమరవీరుల త్యాగంతో పురుడోసుకున్న పి డి ఎస్ యు సంస్థ విద్యార్థుల ఉద్యమాన్నీ తీవ్రతరం చేయాలని ఆకాంక్షించారు.
మహాసభల ఆహ్వాన సంఘం ప్రధాన కార్యదర్శి మైసా శ్రీనివాస్ మాట్లాడుతూ రేవంత్ రెడ్డి సర్కార్ అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు గడుస్తున్నా విద్యార్థుల సమస్యలను పరిష్కరించడంలో విఫలమైందన్నారు. కనీసం పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్ కూడా విద్యార్థులకు ఇవ్వకుండా మొండిగా వ్యవహరిస్తుందన్నారు. దీంతో విద్యార్థుల భవిష్యత్తు నాశనం అవుతుందన్నారు. పాలకులు మారిన వారి విధానాలు మారకపోవడం వల్ల విద్యారంగ సమస్యలు పరిష్కారం కావడంలేదని అన్నారు. విద్యార్థులు సమస్యల పరిష్కారం కోసం సమరశీల ఐక్య ఉద్యమాలు చేయాలన్నారు. డిసెంబర్ 10,11 ,12 తేదీల్లో వరంగల్ లో జరిగే రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు..
ఈ కార్యక్రమం లో పి డి ఎస్ యు జాతీయ నాయకులు P. మహేష్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి. నాగరాజు, రాష్ట్ర ఉపాధ్యక్షులు బోనగిరి మధు, డాక్టర్ రాజేష్, పి డి ఎస్ యు వరంగల్ జిల్లా అధ్యక్షులు గుర్రం అజయ్, ప్రధాన కార్యదర్శి మర్రి మహేష్ ,పి డి ఎస్ యు రాజేందర్, బాలరాజు, బండి కోటేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.
