మరిచిపోయిన హ్యాండ్ బ్యాగు చోరీ కేసు ఛేదించిన పోలీసులు
వరంగల్, నేటిధాత్రి.
వరంగల్ నగరంలో మరిచిపోయిన హ్యాండ్ బ్యాగును చోరీ చేసిన కేసును ఇంతజార్గంజ్ పోలీసులు ఛేదించారు. కొత్తగూడెం నివాసి శ్వేత అను మహిళ 26-01-2026 తెల్లవారుజామున వేములవాడకు వెళ్లేందుకు వరంగల్ వెంకట్రామ్ వద్ద బస్సు ఎక్కే సమయంలో ఆత్రుతలో టీవీఎస్ షోరూం ముందు హ్యాండ్ బ్యాగును మరిచిపోయింది.
ఆ బ్యాగులో మూడు తులాల బంగారు ఆభరణాలు, రూ.30,000 నగదు మరియు ఒక వివో స్మార్ట్ ఫోన్ ఉన్నాయి. ఈ విషయమై బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇంతజార్గంజ్ పోలీసులు క్రైమ్ నంబర్ 34/2026 గా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
పోలీసుల విచారణలో టీవీఎస్ షోరూం ఉద్యోగి పల్లకొండ వేణు దొంగిలించాలనే ఉద్దేశంతో తన భార్య కళ్యాణి, తల్లి సరోజనతో కలిసి ముఖాలకు మాస్కులు కట్టుకొని వచ్చి, మరిచిపోయిన బ్యాగు తమదేనని వాచ్మెన్ కేదారిని నమ్మించి మోసపూరితంగా బ్యాగును తీసుకెళ్లినట్లు గుర్తించారు.
సీసీ కెమెరాలు, ఐటీ కోర్ సాంకేతిక ఆధారాల సహాయంతో దర్యాప్తు కొనసాగించిన పోలీసులు ఈరోజు వాహనాల తనిఖీ సమయంలో నిందితులు వేణు, కళ్యాణిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి మూడు తులాల బంగారు ఆభరణాలు, మొబైల్ ఫోన్ మరియు రూ.5,000 నగదును స్వాధీనం చేసుకున్నారు. మిగిలిన నగదును ఖర్చు చేసినట్లు విచారణలో వెల్లడైంది.
నిందితులను రిమాండ్కు తరలించగా, వేణు తల్లి సరోజన పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసును ఛేదించడంలో ఇంతజార్గంజ్ ఇన్స్పెక్టర్ ఎం.ఏ. షుకూర్, ఎస్సై సందీప్, పిఎస్సై తేజ, కానిస్టేబుల్స్ దీపక్, సురేష్ మరియు ఐటీ కోర్ సిబ్బంది సల్మాన్ ప్రతిభ కనబరిచినట్లు తెలిపారు.
