నామినేషన్ కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్

నామినేషన్ల స్వీకరణ కేంద్రాలను సందర్శించిన కలెక్టర్

కరీంనగర్, నేటిధాత్రి:

 

గ్రామ పంచాయతీ ఎన్నికలలో భాగంగా రాష్ట్ర ఎన్నికల కమిషన్ విడుదల చేసిన షెడ్యూల్ ను అనుసరిస్తూ కరీంనగర్ జిల్లాలో తొలి విడత సర్పంచ్, వార్డు స్థానాలకు రిటర్నింగ్ అధికారులు గురువారం నోటిఫికేషన్లు జారీ చేశారు. తొలి విడతలో కరీంనగర్ రెవెన్యూ డివిజన్ పరిధిలోని గంగాధర, రామడుగు, చొప్పదండి, కొత్తపల్లి, కరీంనగర్ రూరల్ మండలాల్లోని తోంబైరెండు సర్పంచ్, ఎనిమిది వందల అరవై ఆరు వార్డు మెంబర్ల స్థానాలకు గురువారం నోటిఫికేషన్ విడుదల చేసి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభించారు. ఈనేపథ్యంలో రామడుగు మండలం వెదిర గ్రామ పంచాయతీ కార్యాలయంలో వెదిర, వెలిచాల గ్రామాల పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఏర్పాటు చేసిన నామినేషన్ల స్వీకరణ కేంద్రాన్ని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ పమేలా సత్పతి సందర్శించారు. నామినేషన్ స్వీకరణ కేంద్రంలో సదుపాయాలు పరిశీలించారు. నామినేషన్ పత్రాల స్వీకరణకు చేసిన ఏర్పాట్లు గమనించి పలు సూచనలు చేశారు. హెల్ప్ డెస్క్, పోలీస్ బందోబస్తు తదితర అంశాలను పరిశీలిస్తూ, సపోర్టింగ్ స్టాఫ్ సరిపడా ఉన్నారా అని ఆరా తీశారు. నోటీసు బోర్డులపై అతికించిన నోటిఫికేషన్ పత్రాలను తనిఖీ చేశారు. ఎలాంటి పొరపాట్లు జరగకుండా నామినేషన్ల ప్రక్రియను నిర్వహించాలని, నామినేషన్ దరఖాస్తు ఫారాలు తీసుకున్న వారి వివరాలను కూడా రిజిస్టర్ లో నమోదు చేయాలని కలెక్టర్ సూచించారు. దాఖలైన నామినేషన్లకు సంబంధించి జిల్లా కేంద్రానికి సకాలంలో రిపోర్టులు పంపించాలని అన్నారు. ప్రతి నామినేషన్ సెంటర్ వద్ద హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశామని, విధుల్లో ఉన్న ప్రభుత్వ సిబ్బంది నామపత్రాలు దాఖలు చేసే విషయంలో అభ్యర్థులకు అవసరమైన సహకారం అందించాలని సూచించారు. ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలను తూచ తప్పకుండా పాటిస్తూ, ప్రశాంత వాతావరణంలో ఎన్నికల ప్రక్రియను నిర్వహించాలని అన్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి పక్కాగా అమలయ్యేలా చూడాలన్నారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఎలాంటి సందేహాలు ఉన్నా, ఉన్నతాధికారులను సంప్రదించాలని సూచించారు. ఈకార్యక్రమంలో రామడుగు తహసిల్దార్ రాజేశ్వరి, మండల ప్రత్యేక అధికారి అనిల్ ప్రకాష్, స్థానిక అధికారులు, తదితరులున్నారు.

భూపాలపల్లి గ్రామపంచాయతీ ఎన్నికలకు ఏర్పాట్లు

గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేయాలి

భూపాలపల్లి నేటిధాత్రి

 

మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు.
బుధవారం ఐడిఓసి కార్యాలయపు సమావేశపు హాలులో మొదటి విడత గ్రామ పంచాయితీ ఎన్నికల నిర్వహణపై రిటర్నింగ్ అధికారులతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 27వ తేదీ ఉదయం 10.30 గంటల లోపు ఎన్నికల నోటిఫికేషన్ ప్రకటించి గ్రామ పంచాయతీ కార్యాలయం, గ్రామపంచాయతీ ప్రధాన కూడళ్లలో ప్రదర్శింపచేయాలని అన్నారు. అలాగే గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఓటరు జాబితా కూడా ప్రదర్శింపజేయాలని సూచించారు. నామినేషన్లు ప్రక్రియ ఉదయం 10:30 నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఉంటుందని ఈనెల 29వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించాలని తెలిపారు. 30వ తేదీన నామినేషన్లు పరీశీలన, డిసెంబర్ 1వ తేదీన అప్పీళ్లు, 2వ తేదీన డిస్పోజల్, 3వ తేదీన ఉపసంహరణ ఉంటుందని తెలిపారు. నామినేషన్లు స్వీకరణకు 25 మంది 25 రిటర్నింగ్ అధికారులను నియమించామని తెలిపారు.
ప్రతి రిటర్నింగ్ అధికారుల కేంద్రాల్లో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయాలని తెలిపారు. ఒక వ్యక్తి గరిష్టంగా నాలుగు సెట్లు నామినేషన్ సెట్లు దాఖలు చేసేందుకు అవకాశం ఉందని తెలిపారు. నామినేషన్ లో ఖచ్చితంగా తేదీ, సమయం, క్రమ సంఖ్య నమోదు చేయాలని సూచించారు. నామినేషన్లలో అభ్యర్థి సంతకం, ధ్రువీకరణ ప్రతిపాదకుని సంతకం ఉండాలని తెలిపారు. మొదటి విడతలో 4 మండలాల్లోని 82 గ్రామపంచాయతీల పరిధిలోని 712 వార్డులకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఎన్నికల నిర్వహణలో రిటర్నింగ్ అధికారి విధులు చాలా కీలకమని ఎన్నికలపై సమగ్ర అవగాహన కలిగి ఉండాలని తెలిపారు.
అనంతరం మాస్టర్ ట్రైనర్లు ఎన్నికల విదులపై పవర్ పాయింట్ ద్వారా అవగహన కల్పించారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్, విజయలక్ష్మి, ట్రైని డిప్యూటీ కలెక్టర్ నవీన్ రెడ్డి , డిపిఓ శ్రీలత ఎంపీడీవోలు, రిటర్నింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version