హనుమకొండలో వయోవృద్ధుల డే కేర్ సెంటర్ ప్రారంభం..

హనుమకొండలో వయోవృద్ధుల డే కేర్ సెంటర్ ప్రారంభం

ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి

హన్మకొండ, నేటిధాత్రి:

హనుమకొండ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, హనుమకొండ శాఖ ఆధ్వర్యంలో వయోవృద్ధుల కోసం ఏర్పాటు చేసిన డే కేర్ సెంటర్‌ను వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే మరియు రెడ్ క్రాస్ సొసైటీ ప్యాట్రన్ శ్రీ నాయిని రాజేందర్ రెడ్డి శనివారం ప్రారంభించారు. రిబ్బన్ కట్ చేసి వృద్ధులతో సంభాషించిన ఆయన, తరువాత తలసీమియా పిల్లలకు పండ్లు పంపిణీ చేశారు.
ముందుగా ఎమ్మెల్యేకు రెడ్ క్రాస్ చైర్మన్ డా. పి. విజయచందర్ రెడ్డి, పాలకవర్గం సభ్యులు ఘన స్వాగతం పలికారు. పూలమొక్క అందజేసి సత్కరించారు.
ఈ సందర్భంగా రెడ్ క్రాస్ చైర్మన్ మాట్లాడుతూ, 60 ఏళ్లు పైబడిన వృద్ధులకు ఉచితంగా డాక్టర్ల సేవలు, చెస్, క్యారమ్ వంటి ఆటల సౌకర్యం అందిస్తామన్నారు. వృద్ధులు సమయం విలువైనదిగా గడిపే విధంగా ఏర్పాట్లు చేశామన్నారు.
ఎమ్మెల్యే శ్రీ నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రంలోని 33 జిల్లాల్లో 37 డే కేర్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అందులో హనుమకొండలో రాష్ట్రంలో మొట్టమొదటిగా ఈ సెంటర్ ప్రారంభమవడం గర్వకారణమని తెలిపారు. రెడ్ క్రాస్ రక్తదానం, ఇతర సేవలకు రాష్ట్రంలో తొలి స్థానంలో నిలుస్తున్న హనుమకొండ రెడ్ క్రాస్ పాలకవర్గాన్ని ఆయన ప్రత్యేకంగా అభినందించారు.
రెడ్ క్రాస్ సేవలకు మరింత తోడ్పాటు అందించాలని, ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి ని హనుమకొండ రెడ్ క్రాస్ సందర్శించేవిధంగా ప్రయత్నం చేస్తానని ఎమ్మెల్యే తెలిపారు. ఈ సందర్భంగా వృద్ధులకు చేనేత కళాకారులు తయారు చేసిన టవెల్స్ తో సన్మానించారు. అనంతరం ఎమ్మెల్యేకు పాలకవర్గం షీల్డ్ అందించి సత్కరించింది.
ఈ కార్యక్రమంలో డా. పి. విజయచందర్ రెడ్డి (చైర్మన్), బొమ్మినేని పాపిరెడ్డి (కోశాధికారి), ఈ.వి. శ్రీనివాస్ రావు (రాష్ట్ర పాలకవర్గ సభ్యులు), జిల్లా పాలకవర్గ సభ్యులు పుల్లూరు వేణుగోపాల్, డా. ఎం. శేషుమాధవ్, బిళ్ల రమణ రెడ్డి, మహిళా శిశు, దివ్యాంగుల మరియు వయోవృద్ధుల సంక్షేమ అధికారి జె. జయంతి, డిఆర్‌డిఓ పీ.డి. యం. శ్రీను, హనుమకొండ డిఎంహెచ్ఓ ఎ. అప్పయ్య, కేయూ ఈ సి సభ్యులు కే. అనిత రెడ్డి, వృద్ధులు, రెడ్ క్రాస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version