సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై దాడికి నిరసనగా నవంబర్ 1న ‘చలో హైదరాబాద్’ దళిత ఆత్మగౌరవ మహా ర్యాలీ
నేటి ధాత్రి,పటాన్ చెరు:
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) బి.ఆర్. గవాయి పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ, దళితుల ఆత్మగౌరవం, న్యాయవ్యవస్థ పరిరక్షణ కోసం నవంబర్ 1వ తేదీన ‘చలో హైదరాబాద్’ మహా ర్యాలీని విజయవంతం చేయాలని ఎంఆర్పిఎస్,ఎంఎస్పి అనుబంధ సంఘాల నాయకులు పిలుపునిచ్చారు.
ఈ మహా ర్యాలీకి సంబంధించిన ఏర్పాట్లపై పటాన్ చెరు నియోజకవర్గంలోని ఎంఆర్పిఎస్, ఎంఎస్పి ముఖ్య కార్యకర్తల సమావేశం పొట్టోల్ల వెంకటేశం మాదిగ ఎంఎస్పి రాష్ట్ర సీనియర్ నాయకులు ఆధ్వర్యంలో నిర్వహించబడింది.
ఈ సందర్భంగా ఎంఆర్పిఎస్ సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు మైసగళ్ళ బుచ్చేంద్ర మాదిగ మాట్లాడుతూ, సీజేఐ గవాయి పై జరిగిన దాడి కేవలం ఒక వ్యక్తిపై జరిగిన దాడి కాదని, ఇది భారత రాజ్యాంగం, న్యాయవ్యవస్థ, దళితుల ఆత్మగౌరవం మరియు అస్తిత్వంపై జరిగిన దాడిగా భావించాలన్నారు.
నవంబర్ 1న హైదరాబాద్లో జరగబోయే ఈ భారీ బహిరంగ ర్యాలీలో నియోజకవర్గం నుంచి లక్షలాది మంది పాల్గొనాలని ఆయన కోరారు. ముఖ్యంగా హైదరాబాద్కు దగ్గరలో ఉన్న పటాన్ చెరు నియోజకవర్గం నుండి దళిత వర్గాలు, రాజ్యాంగం పట్ల గౌరవం ఉన్న ప్రతి ఒక్కరూ, ప్రజాస్వామ్య స్ఫూర్తి కలిగిన నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై ర్యాలీని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం కోసం ఎంఆర్పిఎస్ సీనియర్ నాయకులు, నియోజవర్గ బాధ్యులు, మండల ఇన్చార్జులు పూర్తి సమయం కేటాయించాలని ఆయన స్పష్టం చేశారు.
ఈ సమావేశంలో నల్లోల్ల ప్రవీణ్ కుమార్ మాదిగ ఎంఆర్పిఎస్ జిల్లా అధికార ప్రతినిధి, వెలుమల ప్రమోద్ మాదిగ ఎంఆర్పిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి, క్యాసారం నటరాజ్ మాదిగ ఎంఎస్పి జిల్లా అధికార ప్రతినిధి, కొంగేరి కృష్ణ మాదిగ ఎంఎస్పి జిల్లా ప్రధాన కార్యదర్శి, ముక్క గళ్ళ ఆంజనేయులు మాదిగ ఎంఈఎఫ్ సీనియర్ నాయకులు, కందుకూరి ఏసయ్య మాదిగ ఎంఆర్పిఎస్ అమీన్పూర్ మండలం ఇంచార్జి, బందెల రవికుమార్ మాదిగ ఎంఆర్పిఎస్ ఆర్సి పూర్ టౌన్ కన్వీనర్, దర్బార్ రమేష్ మాదిగ కో కన్వీనర్, కర్రెనుల బాలేష్ మాదిగ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
