పోలీసు అమరవీరుల ప్రాణ త్యాగాలు చిరస్మరణీయం:జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే ఐపీఎస్.
పోలీస్ అమరుల త్యాగాన్ని స్మరిస్తూ నివాళులు,వారి కుటుంబ సభ్యులకు జిల్లా ఎస్పీ పరామర్శ.
చందుర్తి, నేటిధాత్రి:
రాజన్న సిరిసిల్ల జిల్లా, చందుర్తి మండలం లింగంపెట గ్రామ శివారులో గల అమరవీరుల స్తూపం వద్ద పోలీస్ అమరవీరుల సంస్మరణ దినం (ఫ్లాగ్ డే)ను ఘనంగా నిర్వహించి,అమరవీరుల కుటుంబ సభ్యులు,పోలీస్ అధికారులతో కలసి నివాళులర్పించి శ్రద్ధాంజలి ఘటించిన ఎస్పీ.
అనంతరం సాయుధ పోలీసులు”శోక్ శ్రస్త్” చేసి మరణించిన పోలీసు అమరవీరులకు పోలీసు అధికారులు,సిబ్బంది అమరవీరుల కుటుంబ సభ్యులు రెండు నిమిషాలు మౌనం పాటించి గత ఏడాది నుండి ఇప్పటి వరకు దేశంలో విధి నిర్వహణలో మరణించిన192 మంది పోలీస్ అమరవీరుల పేర్లను చదివి వినిపించారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ…శాంతి భద్రతల పరిరక్షణకై ప్రాణత్యాగాలు చేసిన పోలీస్ అమరవీరులు ప్రజల గుండెల్లో చిరస్మరణీయంగా నిలిచిపోతారని ఎస్పీ తెలిపారు.
జిల్లాలో అంతర్గత భద్రత పరిరక్షణ విధుల్లో 8 మందికి పైగా పోలీసులు అసువులు బాసారని,వారి త్యాగఫలం వల్లే గతం కంటే ప్రస్తుత పరిస్థితి మెరుగ్గా ఉందని,పోలీసుల త్యాగనిరతిని నిరంతరం మననం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.అమరవీరులు అందించిన స్ఫూర్తితో ప్రజల భద్రత,రక్షణ చర్యల్లో భాగంగా శాంతి భద్రతల పరిరక్షణ కోసం ముందుకు సాగుతున్నామన్నారు. అమరుల త్యాగాలను స్మరించుకోవాల్సిన బాధ్యత అన్ని వర్గాల ప్రజలపై ఉందని,దేశ సరిహద్దుల్లోని ఆక్సాయ్ చిన్ ప్రాంతంలో పహార కాస్తున్న 10 మంది సిఆర్పిఎఫ్ పోలీసులను 1959లో ఇదే రోజున చైనా దేశానికి చెందిన సైనికులు హతమార్చారని, అప్పటినుండి వారి త్యాగాలను స్మరిస్తూ అక్టోబర్ 21న పోలీసు అమరవీరుల దినం జరుపుకోవడం జరుగుతున్నదని పేర్కొన్నారు.విధి నిర్వహణ సందర్భంగా ఎన్నో జటిలమైన సవాళ్లు ఎదురవుతున్నా వాటిని అధిగమిస్తూ ముందుకు సాగుతున్నామని చెప్పారు.
ఇట్టి కార్యక్రమానికి హాజరైన అమరవీరుల కుటుంబాల సభ్యులతో మాట్లాడి వారి కుటుంబ పరిస్థుతులు వారి యొక్క సమస్యలను అడిగి వారు చెప్పిన సమస్యలను సాద్యమైనoత తొందరగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చి అమరవీరుల కుటుంబాలకు జ్ఞాపికలను అందించడం జరిగింది.
పోలీస్ అమరవీరుల స్మరిస్తూ పోలీస్ వారి ఆధ్వర్యంలో ఈరోజు నుండి 31 తేదీ వరకు రక్తదాన శిబిరాలు,సైకిల్ ర్యాలీ,క్యాండిల్ ర్యాలీ,2k రన్,ఓపెన్ హౌస్, వ్యాసరచన పోటీలు,ఫోటో,వీడియో పోటీలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.
ఈకార్యక్రమంలో వేములవాడ ఏఎస్పీ శేషాద్రిని రెడ్డి, అదనపు ఎస్పీ చంద్రయ్య, డీఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి, సి.ఐ లు వెంకటేశ్వర్లు, వీరప్రసాద్, శ్రీనివాస్,మొగిలి, శ్రీనివాస్,నటేష్,ఆర్.ఐ రమేష్, యాదగిరి, ఎస్.ఐ లు అమరవీరుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
