పత్తి కొనుగోళ్లపై సీసీఐ షరతులు ఉపసంహరించుకోవాలి
రైతులకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలంటూ డిమాండ్
నవంబర్ 26 కలెక్టర్ కార్యాలయం ముందు జరగనున్న ధర్నాను జయప్రదం చేయండి
— ఎం. చుక్కయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి
నేటిధాత్రి అయినవోలు:
జిల్లా రైతులు పండించిన పత్తి పంట కొనుగోళ్లపై కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) విధించిన పరిమితులను వెంటనే ఎత్తివేయాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం. చుక్కయ్య డిమాండ్ చేశారు.
అయినవోలు మండల కేంద్రంలో జరిగిన తెలంగాణ రైతు సంఘం మండల కమిటీ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడిన ఆయన, ఒక ఎకరానికి కేవలం 7 క్వింటాళ్ల పత్తి మాత్రమే కొనుగోలు చేస్తామని సీసీఐ నిర్ణయం రైతులను తీవ్రంగా నష్టపరిచేలా ఉందని విమర్శించారు.రైతులు మిగతా పత్తిని మధ్యదళారీలకు పావుదరలకు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని, ఇది మధ్యదళారీలకు లాభం చేకూర్చే విధంగా, రైతులను నష్టపరచే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆరోపించారు.
“ప్రభుత్వం రైతుల పక్షమా? వ్యాపారుల పక్షమా?” అంటూ ప్రశ్నించిన చుక్కయ్య, సీసీఐ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని, రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు.అలాగే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన భూభారతి, పంట రుణాల మాఫీ, రైతు భరోసా, బోనస్, ఇన్పుట్ సబ్సిడీ, గిట్టుబాటు ధర వంటి హామీలను అమలు చేయడంలో విఫలమైందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ఇచ్చిన హామీలను అమలు చేయాలంటూ ప్రభుత్వాన్ని కోరారు.
నవంబర్ 26న కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో జరిగే కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నాకు రైతులు, వ్యవసాయ కూలీలు, కార్మికులు భారీగా హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.సమావేశంలో మండల అధ్యక్ష కార్యదర్శులు మడిగ నాగరాజు, కొంకాల నారాయణరెడ్డి, కొంకటి శంకర్ రెడ్డి, గుండెకారు రాజేశ్వరరావు, వరికల గోపాలరావు, ఏసీ రెడ్డి, రాజిరెడ్డి, మహేందర్ తదితర నాయకులు పాల్గొన్నారు.
