తూముల్లో తుమ్మ పొదలు..

తూముల్లో తుమ్మ పొదలు..!

జహీరాబాద్ నేటి ధాత్రి:

ఝరాసంగం: ప్రతీ ఏటా వర్షాకాలంలో కురిసే భారీ వర్షాలతో చెరువులు, కుంటలు నీటితో సమృద్ధిగా నిండిపోతున్నాయి. కానీ, నీటిపారుదల శాఖ అధికారుల నిర్లక్ష్యం వల్ల రైతులు అవస్థలు పడుతున్నారు. సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం వ్యాప్తంగా ఏడాకులపల్లి కొత్తూరు వాగు, రాళ్ల వాగు చెరువులు, మేదపల్లి శివారులో గుండం చెరువు, ఏనుగుల చెరువు, ఈదులపల్లిలో కప్పలగ వాగు చెరువు, రాచన్న వాగు చెరువు, గంగాపూర్లో చెరువులు ఉన్నాయి. ఆయా చెరువుల కింద దాదాపు 2 వేల ఎకరాలకు పైగా ఆయకట్టు ఉందని అధికారుల లెక్కలు సూచిస్తున్నాయి. కానీ వాటి తూములు, సీసీ కాలువలు శిథిలావస్థకు చేరి 10 ఏళ్లు గడిచిన పాలకులు, అధికారులు పట్టించుకోవడం లేదు. 200 ఎకరాలకు కూడా నీరు చేరడం లేదు. దీంతో పుష్కలమైన నీటి వనరులు ఉన్నప్పటికీ రైతులు పండించే వివిధ రకాల పంటలకు నీరు అందకపోవడంతో ఆయా గ్రామాల రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

శిథిలావస్థలో తూములు, కాలువలు..

ఝరాసంగం మండల వ్యాప్తంగా 7 పెద్ద చెరువులు ఉండగా, పొట్టిపల్లి, బర్దిపూర్, చిల్కపల్లి, చిలేపల్లి, ఎల్గోయి తదితర గ్రామాల్లో చిన్నచిన్న చెరువులు ఉన్నాయి. వాటి తూములు శిథిలావస్థకు చేరుకోగా, మట్టి కాలువలు ఉండటంతో చివరి ఆయకట్టు రైతులకు నీరు చేరడం లేదు. చెరువుల కింద ఉన్న ఆయకట్టు రైతులు వర్షాధార పంటలు మాత్రమే పండిస్తున్నారు. మరి కొంతమంది రైతులు చెరువుకు సమీపంలో ఉన్న రైతులు మోటర్లు బిగించుకొని పంటలు పండిస్తున్నారు. ఆర్థిక స్తోమత అంతంత మాత్రమే ఉన్న రైతులు వర్షాధార పంటల పైనే ఆధారపడి ఉన్నారు. ఆయా గ్రామాలకు చెందిన ఆయకట్టు రైతులు,గ్రామస్తులు పలుమార్లు చెరువుల మరమ్మత్తులు చేయాలని అధికారులకు విన్నవించినప్పటికీ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి చెరువులకు సంబంధించిన కాలువలు, మరమ్మతు చేయాలని విజ్ఞప్తి చేశారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version