Strict Action Against Illegal Paddy Transport
ఇతర రాష్ట్రాల నుండి ధాన్యం అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు
జిల్లా పౌర సరఫరాల అధికారి కిరణ్ కుమార్
భూపాలపల్లి నేటిధాత్రి
జిల్లాలో రైతులకు మద్దతు ధర (ఎంఎస్ పి ) సమర్థంగా అందించేందుకు ఇతర రాష్ట్రాల నుండి ధాన్యం అక్రమ రవాణాను పూర్తిగా అడ్డుకునే దిశగా కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా పౌర సరఫరాల అధికారి కిరణ్ కుమార్ తెలిపారు.
బుధవారం కాలేశ్వరం వద్ద ఏర్పాటు చేసిన అంతరాష్ట్ర చెక్పోస్టును ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రెవెన్యూ, పోలీసు, వ్యవసాయ పౌర సరఫరాల శాఖలు సమన్వయంతో 24 గంటలు నిరంతర పహారా నిర్వహిస్తాయని వెల్లడించారు.
జిల్లా రైతుల ప్రయోజనాలను కాపాడడం మరియు వారికి న్యాయమైన మద్దతు ధర లభించేలా చేయడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాల నుండి అక్రమంగా ధాన్యం రాకుండా పటిష్ట నియంత్రణ చర్యలు కొనసాగుతాయని స్పష్టం చేశారు.
అంతరాష్ట్ర చెక్పోస్టు ద్వారా వాహనాల తనిఖీలు క్రమం తప్పకుండా నిర్వహించబడతాయని, నియమావళిని ఉల్లంఘించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా పౌర సరఫరాల శాఖ జిల్లా మేనేజర్ రాములు, ఎస్.ఐ తమాషా రెడ్డి, మండల వ్యవసాయ అధికారి శ్రీజ, సివిల్ సప్లై ఇన్స్పెక్టర్లు సురేందర్ రెడ్డి, రాజు, గ్రామ పరిపాలన అధికారి శ్యామ్ తదితరులు పాల్గొన్నారు
